ᐅఇరుముడి సారం



------------------
ఇరుముడి సారం
------------------


శబరియాత్ర చేసేవారు అయ్యప్ప దర్శనానికి వెళ్లేటప్పుడు తీసుకుని వెళ్లే ఇరుముడి అతిప్రధానమైంది. అతి ముఖ్యమైం. ఈ ఇరుముడే స్వామికి కూడా చాలా ఇష్టమైనదిగా చెబుతారు. ‘ఇరుముడి’. ఇరుము అంటే రెండు భాగాలు అని అర్థం. ముందూ, వెనక రెండు మూతులున్న పెద్ద సంచిని ఇరుముడి అని వ్యవహరిస్తారు. ఈ ఇరుముడిలో ముందుభాగంలో స్వామివారి పూజకి, అభిషేకానికి కావలసిన సామాన్లు పెట్టుకోవడానికి, వెనుకభాగంలో నడిచేటప్పుడు దారిలో వండుకోవడానికి కావలసిన వంట సామానులు, తినుబండారములు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇరుముడి ముందుభాగం మనిషిని, వెనుకనున్న భాగం మనిషి కోర్కెలకు (ప్రారబ్ధకర్మ) ప్రతీక. నడిచి వెళ్లేదారిలో వెనుక వున్న తినుబండారములు ఖాళీ అయినట్లుగా ప్రారబ్ధకర్మ తీరిన తరువాత మనిషి భగవంతుని సన్నిధికి చేరుకుంటాడు. నెయ్యితో నిండిన కొబ్బరికాయ మనిషి శరీరాన్నీ, అందులో వున్న నెయ్యి జీవాత్మని సూచిస్తుంది. కొబ్బరి చిప్పల్ని హోమగుండంలో కాల్చేసి, నెయ్యిని స్వామివారికి అభిషేకం చెయ్యడంలోని అంతరార్థం మనిషి చనిపోయిన తర్వాత శరీరం కాలిపోయి అందులో వున్న జీవాత్మ పరమాత్మతో లీనమైపోతుంది అని దాని పరమార్థం. మనస్సులో వున్న కోరికల్నీ, కల్మషాల్నీ అగ్నిలో కాల్చేసినవాడు భక్తిమార్గం ద్వారా భగవంతుని చూడవచ్చు అన్నదానికి పరమార్థమే ఈ శబరిగిరి యాత్ర- ‘స్వామియే శరణం అయ్యప్ప’. అంతేకాదు తత్వమసి సిద్ధాంతమే ఈ అయ్యప్ప దీక్షకు పట్టుకొమ్మ. తనలో అయ్యప్పస్వామిని చూసుకొని ఎదుటివారిలో కూడా స్వామివారి రూపాన్ని దర్శించకలగడమే ఈ దీక్ష ప్రత్యేకత. అందుకే ఎవరు ఎదురు పడినా ‘స్వామి శరణం’ అంటూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తారు.

- వసంతకుమార్ సూరిశెట్టి


ᐅవిజయదశమి


---------------
విజయదశమి
---------------


శివము శక్తిని గూడిన సృష్టి జరుగు
లేక దైవము స్పందనే లేని జడము 
అట్టి నిను, హరిహర విరించాదులకును
పూజ్యమౌ దాని, నుతియింప మ్రొక్కులిడగ
అకృత పుణ్యులకున్ సాధ్యమగుట యెట్లు?

అమిత సూక్ష్మము, నీ పాదకమల భవము,
అయిన రేణువుచే లోక మవికలముగ
నా విరించి రచించు; సహస్ర శీర్ష
ములను హరి యెట్లొ భరియించు, బూదివోలె
హరుడు దానిని పొడి జేసి అలముకొనును

ఇవి సౌందర్యలహరిలోని మొదటి రెండు శ్లోకాలకీ అనువాద ప్రయత్నం. దసరా పండగంటే అమ్మవారిని కొలిచే పండగ. అమ్మవారు శక్తి స్వరూపిణి. మన దేశంలోని మతాలలో శక్తిని ఆరాధించే వారి మతాన్ని శాక్తేయం అంటారు. ఈ శాక్తేయం ఎక్కువగా వంగ ప్రాంతంలో వర్ధిల్లిన మతం. అందుకే ఇప్పటికీ బెంగాలీలకి దసరానే అతి ప్రధానమైన పండగ. ఈ పండగని వాళ్ళు "పూజో" అంటారు. పదిరోజులు జరిగే ఈ దసరా పండగలో ఆ శక్తి వివిధ రూపాలని పూజిస్తాం.

శివము, శక్తి అనే ఈ ద్వంద్వం మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. వాక్కు-అర్థము, ప్రకృతి-పురుషుడు, బీజము-క్షేత్రము, చైతన్యము-జడము, energy-mass ఇలా. అవి రెండు కాదు ఒకటి అని తెలుసుకోవడం అద్వైతం. మన మెదడు ఉంది. అది ఏమిటంటే కొన్ని కోట్ల న్యూరాన్ల కలయిక. అయితే, అన్ని కొట్ల న్యూరాన్లు కలిసినంత మాత్రానే మెదడు ఏర్పడిపోతుందా? వాటిలోని స్పందన శక్తి ఏదో వాటిని పని చేయిస్తోంది. ఆ శక్తి లేకపోతే వట్టి న్యూరాన్లు మాత్రమే మెదడు కాలేవు. అలాగే ఒక పెద్ద జడపు ముద్దగా ఉన్న రూపంలో విశ్వానికి ఉనికి లేదు. ఏదో ఒక చైతన్యం, ఒక శక్తి - ఆ జడపు ముద్దని విశ్వంగా మార్చిందని మన సైంటిస్టులు కూడా ఊహిస్తున్న విషయమే. విచిత్రం ఏమిటంటే, ఈ శక్తి జడంలో ఉన్నదే! దానికి భిన్నమైనది కాదు. మనిషి మెదడులోని అన్ని కోట్ల న్యూరాన్లూ ఒక్క అండము, శుక్రము కలయికలోంచి ఉద్భవించాయి. ఏ ఏ న్యూరాన్లు ఎలా పనిచెయ్యాలన్న విషయమంతా పరమాణు సదృశమైన DNAలో నిక్షిప్తమై ఉంది. అందులోంచే మనిషి (జీవం) సృష్టించబడుతోంది. జీవి మనుగడకి, చావుకీ కూడా అది కారకమవుతోంది. ఇది ప్రాణశక్తి. విశ్వం పుట్టుక ఎలా అయితే మనకింకా అంతుబట్ట లేదో, అలానే ప్రాణం పుట్టుక కూడా అంతుబట్ట లేదు. అయితే ఈ రెంటికీ కూడా మూలమైనది శక్తి అని మాత్రం తెలుసు. ఆ శక్తులు రెండూ వేరువేరా, ఒకటేనా అన్నది తెలియదు. సృష్టి, స్థితి, లయ అనేవి అటు విశ్వానికీ, ఇటు ప్రాణానికీ కూడా సమానంగా ఉన్న లక్షణాలు.

ఇలా ఆలోచించుకుంటూ పోతే ఎక్కడ తేలతామో తెలీదు! శక్తిని ఆరాధించడమంటే నిజానికి గుడ్డిగా నమ్మడం కాదు. దాని ప్రభావాన్ని పరిపూర్ణంగా అనుభవించడం. దాని స్వరూపాన్ని శాస్త్రీయంగా అన్వేషించడం. దైనందిన జీవితపు మూసలో బతికేస్తున్న మనుషుల మనసులని ఆ అన్వేషణవైపు, ఆ అనుభవం వైపు మళ్ళించేందుకే ఈ పండగలు.

- కామేశ్వర రావు భైరవభట్ల




ᐅగణేశ స్మృతి


---------------------
వినాయక స్వరూపం
---------------------


శ్రీగణేశ అనే సంస్కృత పదానికి ప్రారంభం అని అర్థం. అందుకే వినాయకుడు ఆదిదేవుడ య్యాడు. సమస్త విఘ్నాలను తొలగించి శుభాలను కలుగజేసేవాడు వినాయకుడు. దేవతాగణాలు ఉద్భవించి సృష్టి ప్రారంభం అయినప్పటి నుంచి ఆదిపురుషునిగా పూజలందుకుంటున్నట్లుగా గణేశపురాణం తెలియజేస్తోంది. గణేశుడు విష్ణుస్వరూపమని ‘శుక్లాంబరధరం విష్ణుం’ శ్లోకం సూచిస్తుంది.

దేజతలలో ప్రథముడైన గణపతిని ముందుగా పూజించిన తర్వాతే ఇష్టదైవాలను ప్రార్థించడం ఆనవాయితీగా వస్తోంది. విఘ్నేశ్వరునికి గణాధిపత్యం ఇవ్వడమే ఇందుకు కారణం. గణపతిని జ్యేష్ఠరాజుగా, సర్వదేవతలలో ప్రథమపూజ్యుడుగా ఋగ్వేదం వర్ణించింది. ముప్పది మూడు కోట్ల మంది దేవతలు గణాలుగా ఉండగా, వారందరికీ అధినాయకుడు గణపతియేనని వేదాలు నిర్దేశించాయి. శ్రీ మహాగణపతి ద్వాదశ ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్టవసువులకు కూడా ప్రభువు. ప్రణవనాద స్వరూపుడు కనుక గణపతిగా వెలుగొందుతున్నాడు. యోగానికి అధిపతి గణాధిపుడే అని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది.

గణపతి సకల విద్యలకూ అధిదేవత. ప్రణవస్వరూపంగా, శుద్ధబ్రహ్మగా, ఆనంద స్వరూపంగా విరాజిల్లే దేవదేవుడు వినాయకుడు. నాయకుడు లేని సర్వ స్వతంత్రుడాయన. ‘గణపతి’ అనే పదంలో ‘గణ’ అనే శబ్దానికి వాక్కు అని అర్థం. కాబట్టి వాగధిపతి గణపతియే!

వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు. కృతయుగంలో సింహవాహనంపై పదితలలతో దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో నెమలివాహనంపై మయూరేశుడిగా ఆవిర్భవించాడు. ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై, చతుర్భుజుడై అలరారాడు. కలియుగంలో తొండంతో, ఏకదంతుడై సంపద బొజ్జతో ఉన్న గణనాథుడు దర్శనమిచ్చాడు. ఇందుకు నిదర్శనమేనేమో వివిధ రూపాల్లో వీధివీధుల్లో కొలువుదీరే గజాననుని దివ్య ఆవిష్కారాలు.

తొమ్మిదిరోజులపాటు వినాయక విగ్రహాన్ని భక్తితో పూజించి ఊరేగింపుగా తీసుకెళ్లి నీటిలో కలిపి వేయడం బాధగానే ఉంటుంది. కాని అది ఒక సంప్రదాయం. 3, 5, 9 రోజుల పూజ తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలకు ఉద్వాసన పలికి ఎక్కడైనా ప్రవహించే నీటిలోగానీ, లోతైన నీటిలోగాని నిమజ్జనం చేస్తారు.ఎన్నో అలంకరణలతో, మనం పోషించుకునే ఈ శరీరం తాత్కాలికమేనని, మూణ్ణాళ్ల ముచ్చటేనని, పంచభూతాలలో నడిచే ఈ శరీరం ఎప్పటికైనా పంచభూతాల్లో కలిసిపోవలసిందేననే సత్యాన్ని వినాయక నిమజ్జనం మనకు తెలియపరుస్తుంది.

వినాయకునికి ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుడికి మంత్రయుక్తంగా పూజ చేసి, దూర్వాయుగ్మం అంటే రెండు గరికలతో పూజ చేస్తారు. వినాయకునికి గరికపూజ ప్రీతిపాత్రం. గరికపోచలలో ఔషధీ గుణం ఉంది. సర్పి, చిడుము మొదలైన వాటికి మంత్రించే వారు గరికపోచలు వాడేది అందుకే.

(Source : Sakhi)

ఓం గం గణపతయే నమః
విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబ సభ్యులకు సదా, సర్వదా అభయ, విజయ, లాభ శుభాలు చేకూరాలని.. క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని.. సుఖసంతోషాలు చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
వినాయక చవితి శుభాకాంక్షలు.... !!


ᐅఅణువున వెలసిన దేవా




-------------------------------
అణువు అణువున వెలసిన దేవా
--------------------------------

అణువు అణువున వెలసిన దేవా
కనువేలుగై మము నడిపించరావా
అణువు అణువున వెలసిన దేవా

మనిషిని మనిషె కరిచేవేళ
ద్వేషము విషమయి కురిసేవేళ
నిప్పులు మింగి నిజమును తెలిపి
చల్లని మమతల సుధలను చిలికి
అమరజీవులై వెలిగిన మూర్తుల
అమృత గుణం మాకందించరావా
అణువు అణువున వెలసిన దేవా
కనువేలుగై మము నడిపించరావా
అణువు అణువున వెలసిన దేవా

జాతికి గ్రుహణల పట్టిన వేల
మాతృ భూమి మురు పెట్టిన వేల
స్వరాజ్య సమరం సాగించి
స్వాతంత్ర ఫలమును సాధించి
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
త్యాగ నిరతి మాకందించరావా
అణువు అణువున వెలసిన దేవా
కనువేలుగై మము నడిపించరావా
అణువు అణువున వెలసిన దేవా

వ్యధులు బాధలు ముసిరేవేళ
మ్రుత్యువు కోరలు చాచేవేల
గుండెకు బందులుగా గుండెను పోదిగి
కొన ఊపిరులకు వూపిరిలూది
జీవన దాతవై వెలిగిన మూర్తుల
సేవాగుణం మాకందించరావా
అణువు అణువున వెలసిన దేవా
కనువేలుగై మము నడిపించరావా
అణువు అణువున వెలసిన దేవా



ᐅనవమి కళ్యాణం



---------------------------------
శ్రీరామనవమి-శ్రీరామ కళ్యాణం 
---------------------------------


తెలుగునాట శ్రీరామ నవమి ఉత్సవాలు జరిగేంత వైభవంగా మరే ఉత్సవాలు జరగవన్నది అతిశయోక్తి కాదు. ముఖ్యంగా సంవత్సర ప్రారంభ దినాలలో రామాయణ అనుసంధానంతో వసంత నవరాత్రులు, సీతారామ కళ్యాణం జరుపుకోవడం మన చిర మర్యాద.

వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే |
వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా||

వేదవేద్యుడు, పరమ పురుషుడు దశరథరాజ నందనుడుగా అవతరించడంతో వేదం వాల్మీకినోట రామాయణంగా వెలువడింది. రామాయణం సాక్షాత్తు వేదం. వేదంలోని విషయాలను మనకు కనిపించేట్టు చేసేదే రామాయణం. రక్షణ అంటే ఏమి ? భగవంతుడిలోని దయ మనల్ని ఎట్లా కాపాడుతుంది ? ఎట్లా రక్షిస్తాడు ? రక్షించడానికి ఏమేమి పరికరాలు కావాలి ? రక్షణ పొందడానికి మనం ఎం చేయాలి ? దీన్ని తెలుపడానికే రామావతారం.

ప్రపంచంయొక్క సృష్టి, స్థితి, ప్రళయము కార్యాలను భగవంతుడు దయతో చేస్తాడు అని శాస్త్రం చెబుతుంది. సృష్టి, స్థితి అంటే దయతో చేసేవి, ప్రళయం కూడా దయతో చేస్తాడా అనేది ఒక సందేహం. పద్మ పురాణం చెప్పిన విషయం. 'ప్రళయం కూడా దయా కార్యమే'. ఎన్నో జన్మలలో ఎన్నో కర్మలు చేసి ఆ సంస్కారాలని మోసుకు తిరుగుతూ మనల్ని మనం మరచి ప్రవర్తించే అల్పులైన జీవుల్ల దుస్థితిని చూసి జాలి పడి, ఆయన దయా సాగరుడు కనుక ఉపకారం చేయాలని అనుకుంటాడు. కర్మ తొలగించుకొని తనంత ఆనంద స్థితికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో శరీరాన్ని ఇస్తాడు. శరీరానికి ఏర్పడ్డ అవసరాలని ఇస్తూ రక్షణ చేస్తాడు. అవసరం అయ్యాక శరీరాన్ని తీసేయాల్సి వస్తుంది, మనం ధరించే వస్త్రం మాసిపోతే మరొకటి ధరించినట్లుగానే. ఇది కూడా దయతో చేసేది.

మనకు కావాల్సిన విషయాలను మన చుట్టూ ఉన్నవారితో చెప్పిస్తాడు, లేకుంటే గురువుల ద్వారా చెప్పిస్తాడు. అది వీలు పడనప్పుడు తానే ఈ లోకంలో అవతరిస్తాడు. నరసింహుడు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు ఆయా సందర్భాన్ని బట్టి ఉపకారం చెయ్యడానికి వీలయ్యే అవతారంలో వస్తాడు. ద్వాపర యుగంలో కృష్ణుడిగా వచ్చాడు, ఆ కాలం నియమం ప్రకారం నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాడు, అంతకు ముందు త్రేతాయుగంలో రాముడిగా వచ్చినప్పుడు పదకొండు వేల సంవత్సరాల కాలం ఉన్నాడు. లోకంలో తాను వచ్చి, ఈ లోకంలో ఉన్న వ్యక్తుల వలె నడచి, ఈ లోకంలో ఉన్న వ్యక్తులు పడే సుఖదుఃఖాలు తానూ అనుభవిస్తే తప్ప మనకు చెప్పలేడు కనుక తానూ అట్లా అనుభవించాడు. భగవంతుడు ఊరికె చెబితే ఎదుటి వారికి నచ్చదు, మన వలె తానూ అనుభవించి చెప్పాలని మన వద్దకి రాముడిగా వచ్చాడు. నరసింహ అవతారం ఆయన ఒక్కసారిగా స్థంభంలోంచి వచ్చాడు, కానీ రామావతారంకోసం ఆయన నిజంగా పుట్టాడు. ఒక సంవత్సర కాలం గర్భవాసం చేసాడు. నిజంగా పెరిగాడు, నిజంగా తిరిగాడు, నిజంగా గురువులని అనువర్తించాడు. అందుకే మన ఆళ్వార్లు భగవంతుణ్ణి అవతరించాడు అని చెప్పరు, ఆయన పుట్టాడు అని చెబుతారు. ఆయన మన సాటివాడిగా కావాలని మనవలె గర్భవాసం చేసి మన వద్దకు కష్టపడి అంత ఆర్తితో వస్తే, అవతరించాడు అని చెబితే అది ఆయన గొప్పతనాన్ని తగ్గించినట్లు అవుతుందే తప్ప పెంచినట్లు కాదు అని.

అట్లా ఈ లోకంలోకి వచ్చినప్పుడు లౌకికమైన ప్రభావాలు ఆయనపై పడకుండా కాపాడగల్గిన తేజస్వరూపిణి అమ్మ. ఆయన హడావిడిలో నేరుగా వస్తాడు, వచ్చి పూర్తిగా మనిషిగా ప్రవర్తిస్తాడు. కానీ ఆమె వెనకాతల ఏమేమి కావాలో అన్ని పరికరాలతో జాగ్రత్తగా వస్తుంది. రామావతారంలో భగవంతుడు గర్భవాసం చేసి వచ్చాడు, కానీ అమ్మ నేరుగా భూమిలోనే లభించింది. గోదాదేవి అట్లానే వచ్చింది. భగవంతుడు అప్పుడప్పుడు చేయాల్సినవి మరచిపోతుంటే, ఆయనకు చెప్పడానికి ఆమె అన్నీ తెలుసుకొని వస్తుంది. రక్షణ జరిగేది ఆయన వెంట అమ్మ ఉన్నప్పుడే. ఒంటరిగా ఎప్పుడూ రక్షణ చేయడు, ఆయన వెంట శక్తి, యుక్తి, దయ, సౌలబ్యం, సౌశీల్యం ఇలా ఎన్నో ఉండాలి. ఈ కళ్యాణ గుణాలు పైకి రప్పించే అమ్మ ప్రక్కన ఉండాలి. భగవంతుడు రాముడిగా వచ్చినా, ఆయనలో దయని పైకి తేవడానికి అమ్మ సీతగా వచ్చింది. భగవంతుడిని ఆశ్రయించడానికి అమ్మ ప్రక్కన ఉంటే మనలోని లోపాలని చూడ కుండా చేసి ఆయనలోన అణిగి ఉండే ప్రేమ, వాత్సల్యాది గుణాలను పైకి తెచ్చి మనల్ని అనుగ్రహించేట్టు చెప్పగల్గుతుంది. రక్షణ చేయాలంటే ఆమె సాన్నిద్యం ఆయనకి కూడా అవసరం. అమ్మ తన వెంట లేక పోయినట్లయితే, స్వామీ! నీవే కనుక అమ్మను స్వీకరించకపోయినట్లయితే, అమ్మ వెంట లేక నీవు అడవిలో సంచరించినట్లయితే "అసరస మభవిశ్యన్" అని అంటారు పరాశరబట్టర్ వారు. తాను అడవికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అమ్మను తన వెంట రావద్దు అని చెప్పాడు స్వామి. కానీ 'నేను వెంట లేకుంటే నీవు చేయాల్సిన లోకరక్షణ జరగదయా' అని వెంట వచ్చింది అమ్మ. అట్లా రక్షణ కోసం చేసే కార్యాల్లో ప్రధానమైనది సీతమ్మను వివాహ మాడటం.

శ్రీరామచంద్రుడు ధనుర్భగం చేసి సీతమ్మను వివాహమాడే సన్నివేశం మనకు ఎంతో స్పృహణీయం. ఆత్మ ఏ తత్వానిపై నిలపదగును. శాస్త్రాల్లో ధనస్సు అంటే ఓంకారం లేక ప్రణవం అని అంటారు. "ప్రణవో ధనుః శిరోహ్యాత్మా బ్రహ్మతలక్ష్యముచ్చతే" అని ఉపనిషత్ చెబుతుంది. ప్రణవం అంటే వంగేది అని అర్థం. ప్రణవం ఎవరికి వంగుతుందో వాడికి ఆత్మను అర్పించ దగును. ఎందరో ప్రయత్నించారు కానీ ఆ ధనస్సుని వంచలేక పోయారు. లోకంలో ఎందరో ఎన్నో దైవాలను చూపిస్తుంటారు, అట్లా ఎవరికో ఒకరికి అని మన ఆత్మని అర్పించవచ్చా ? దానికి సమాధానం ఓంకారం ఎవరిని చెబుతుందో వారికి అర్పించతగును. ధనస్సు వంగింది రాముడికొక్కడికే. ఓంకారం వంగేది రాముడికి మాత్రమే. రాముడు ఎవరు ? "ఏతస్మిన్ అంతరే విష్ణురుపయాతః మహా ద్యుతిః" అని దశరథుడికి సంతానంగా అవతరించింది విష్ణువే కదా. ఓంకారం ఎవరిని చెబుతుంది అని శాస్త్రానికి ప్రశ్న వేస్తే ఓంకారం కారణ దశలో వెళ్ళి చేరేది అకారంలో. "అదితి భగవతో నారాయణస్య ప్రథమ విధానం" అకారం నారాయణుడి యొక్క మొదటి పేరు. ప్రణవం వంగేది నారాయణుడికి. ఆయన ఆత్మను పాలించగల వ్యక్తి, క్షేమం కలిగించగల వ్యక్తి అని శాస్త్రం చెబుతోంది. అందుకే జనకుడు ధనస్సును పెట్టి, ఆధనస్సుని వంచినవాడికి సీతను అర్పించాడు. మనం చెందేది నారాయణునికి మాత్రమే. అట్లా మన ఆత్మని అర్పించదగినవాడు నారాయణుడు మాత్రమే.


శ్రీరామ చంద్రుడు ఒక్క సారిగా ఆధనస్సును ఎత్తాడు . దాన్ని సంధించడానికి దానికి ఉన్న నారిని కట్టగానే ఒక్క సారిగా ధనస్సు రెండు ముక్కలైంది. ధనస్సు యొక్క ఒక భాగం శ్రీరామ చంద్రుడి చేతిలో ఉంది, రెండో భాగం ఆ నారి ద్వారా వ్రేలాడుతోంది. ఇది అప్పటి దృష్యం. ఓంకారంలో ఉన్న అర్థాన్ని ప్రకాశింప జేయడానికే ధనుర్భంగం చేసి ఒక ఖండాన్ని తన చేతిలో పట్టుకొని చూపించాడు. ఓంకారానికి తాత్పర్యమేమి ? ఆ తాత్పర్యాన్ని చూపించడమే ఆయన లక్ష్యం. ఓంకారం అంటే 'అ' అనే అక్షరం, 'మ' అనే అక్షరం మద్యన 'ఉ' అనే అక్షరం ఉంది. 'అ' అనేది భగవంతుడి మొదటి నామం. అక్షరానాం అకారోస్మి. ఇది నేను అని చెప్పడానికి ధనస్సుని విరిచి ఒక ఖండాన్ని పట్టుకుని ఇది నేను అని చూపాడు. రెండో ఖండం 'అ' తో కలిసి ఉండే జీవుడు, అంటే మనం. 'మ' అనేది 'మన్ జ్ఞానే మన్ అవభోదనే' జ్ఞానం అనేదే ఆకృతిగా, గుణంగా కలవాడు. అ కి మ కి మధ్యన ఉన్న ఉకారమే ధనస్సు యొక్క రెండు కండాల మధ్య ఉన్న నారి. ఉకారం భగవంతుడికి జీవుడికీ మధ్య ఉన్న సంబంధాన్ని చెబుతుంది. జీవుడికి భగవంతుడికి ఉన్న సంబంధం తీసేస్తే పోదు. సూర్యుడికి కిరణాలకి ఉన్న సంబంధం లాంటిది. అట్లా జీవుడికి దేవుడికి ఉన్న సంబంధం విడరానిది. మనకు భగవంతుడికి ఉన్న సంబంధం ఇది అది అని పరిమితం కాదు అన్ని సంబంధాలు ఉంటాయి. ఇది చెప్పడానికే "నీవే తల్లివి తండ్రివి ..." అనే పద్యం. 'త్వమేవ సర్వం మన దేవ దేవ' ఇది భగవంతుడి ఒక్కడితోనే ఇట్లాంటి సంబంధం. ఇది తరగదు, నశించదు, చెదరదు. ఆ సంబంధాన్ని మనం మరిచాం కానీ ఆయన ఎప్పుడు మరవడు. ఇది చూపడానికే ధనస్సు యొక్క రెండు ఖండాలు, దాని మధ్యన విలక్షణమైన సంబంధమే ఆ నారి. అందులో ఒక దాన్ని పట్టుకొని "ఓంకార ప్రతిపాద్య దైవం నేను సుమా! ఓంకారం చెప్పేది నన్ను సుమా! జీవుడు నాకు సంబంధించినవాడే కానీ స్వతంత్రుడు కాదు" అనేది చూపించాడు. ఇక్కడ గుర్తించాల్సింది ఒకటి తత్వమతడు,రెండోది ఇద్దరి మధ్య ఉన్న సంబంధం నిత్యం, మూడోది మనం వానికే చెందే వారిమి. ఇది నిరూపించడం కోసమే ఆనాడు రామచంద్రుడు ధనుర్భంగం చేసి చూపాడు.అమ్మను వేరుగా స్వామిని వేరుగా సేవించుకునే సంప్రదాయం కాదు మనది, అందుకే వారిరువురిని ఒక చోట చేర్చి సేవించుకొనేందుకు 'సీతారామ కళ్యాణం'.

- శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళా శాసనాలు

శ్రీ సీతా రామ కళ్యాణోత్సవం (2013) - భద్రాచలం : TV9 & SVSC

Part - 1 > http://www.youtube.com/watch?v=PbQwFMicCXY

Part - 2 > http://www.youtube.com/watch?v=UDg2TK06H08

Part - 3 > http://www.youtube.com/watch?v=CdJrGD2-atc

Part - 4> http://www.youtube.com/watch?v=geMV96dx5KM

Part - 5 > http://www.youtube.com/watch?v=7W23uTa2gdI

Part - 6 > http://www.youtube.com/watch?v=aDZdQL01CEs

Part - 7 > http://www.youtube.com/watch?v=xP6ViFLCDyY

Part - 8 > http://www.youtube.com/watch?v=_cnMiBxPPjc

Part - 9 > http://www.youtube.com/watch?v=XqJVUhdthRc

Part - 10 > http://www.youtube.com/watch?v=Xz7JJP2TiaE

Part - 11 > http://www.youtube.com/watch?v=SNJfmTr8BoA



ᐅఉగాది విశిష్ఠత



---------------
ఉగాది విశిష్ఠత
---------------

ఋతువుల్లో వసంత ఋతువు అత్యంత మనోహరమైనది. ఖగోళవిజ్ఞానం ప్రకారం భూమి 23 1/2 డిగ్రీలు ఏటవాలుగా ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతున్న కారణంగా ఋతువులు ఏర్పడుతున్నాయి. ఋతుచక్రం పూర్తికావడానికి సంవత్సరకాలం పడుతుంది. శీతల దేశాల్లో ఋతువులు వసంతం, వేసవి, ఆకురాలు కాలం, చలికాలంగా వుంటే ఎస్కిమోలు నివసించే ప్రాంతాల్లో కేవలం వేసవి, చలి ఋతువులే ఉన్నాయి.

భారతదేశంలో 2 నెలలకాలం ఒక ఋతువుగా చెప్పబడింది. తెలుగు నెలల ప్రకారం చైత్ర, వైశాఖ మాసాలను – వసంత ఋతువుగానూ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలను – గ్రీష్మ ఋతువుగానూ, శ్రావణ, భాద్రపదమాసాలను – వర్ష ఋతువుగానూ, ఆశ్వయుజ, కార్తీక మాసాలను – శరదృతువుగానూ, మార్గశిర, పుష్యమాసాలను – హేమంత ఋతువుగానూ, మాఘ, ఫాల్గుణ మాసాలను – శిశిర ఋతువుగానూ పేర్కొంటూ ఆరు ఋతువులను ఏర్పాటు చేసుకున్నాం.

వసంతం నుండి శిశిరం వరకు సంవత్సరకాలాన్ని లెక్కకట్టుకోవడంలో ఓ ప్రత్యేకత ఉంది. శిశిరంలో వృక్ష సంతతి ఆకులనూ, బెరళ్ళను వదిలేసి వసంతంలో తిరిగి కొత్త అందాలను నింపుకుంటుంది. ఈ మార్పు ప్రకృతిలో పచ్చదనాన్ని నింపడంతో పశుపక్ష్యాదులతో పాటు మానవ సంతతి మనస్సులు కూడా నూతనోత్తేజంతో తొణికిసలాడతాయి. అందుకే వసంతం కొత్త అందాలనే కాదు క్రొత్త ఆశలను కూడా మోసుకొస్తుంది. సాక్షాత్తూ శ్రీ కృష్ణపరమాత్మ సైతం భగవద్గీతలో ఋతువుల్లో నేను వసంత ఋతువునని చెప్పుట ద్వారా వసంత ఋతువు ప్రత్యేకతను ప్రపంచానికి అందించాడు.

కాలమానం.. కాలమానంలో సూక్ష్మ ఘడియలు, పరఘడియలు, విఘడియలు, ఘడియలు, దినాలు, వారాలు, మాసాలు, సంవత్సరాలు మొదలైనవన్నీ ఏర్పరచిన అతి ప్రాచీనకాలం మనది. విదేశీయులు కూడా ఖగోళశాస్త్ర ఆధారంగా వారికి తోచినట్లు ఆంగ్ల కాలమానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రపంచమంతా ఆంగ్లకాలమానాన్ని ఏకరీతిన అనుసరిస్తున్నా హిందువులు మనకాలమానాన్ని సరైన కాలమానంగా భావించడం జరుగుతోంది. ఖగోళశాస్త్ర ప్రకారం చంద్రమానం, సౌరమానం, చాంద్ర సౌరమానం అని మూడు కాలమానాలున్నాయి. చంద్రమానంలో ఒకే పద్ధతిని అనుసరించినా, సౌరమానంలో విదేశీ పద్ధతి, హిందువుల పద్ధతి అని రెండు పద్ధతులున్నాయి. చంద్రుని నడకలను అనుసరించి మాసాలను, సూర్యుని నడకలను అనుసరించి సంవత్సరాన్ని లెక్కకడతాం. చంద్ర, సౌరమాన పద్ధతిలో కనిపిస్తుంది. చంద్ర, సౌరమానం వలన ‘లుప్తమాసాలు’, ‘అధికమాసాలు’ ఏర్పడతాయి. భారతదేశంలో అధిక శాతం హిందువులు ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. కొత్త సంవత్సరం ఆరంభ దినాన్ని ‘యుగాది’ అంటున్నాం. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజును సంవత్సరాదిగా సౌరమానాన్ని పాటించే హిందువులు కూడా వున్నారు. తమిళనాడు, కేరళ, ఒడిసా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల హిందువులు ఈ విధంగా సంవత్సరారంభం జరుపుకోవడం వలన ఈ పండుగ వైశాఖ మాసంలో వస్తుంది.

చంద్రుని నడకలను అనుసరించి చైత్రమాస శుద్ధ పాడ్యమినాడు మిగతా ప్రాంత హిందువులు సంవత్సర ఆరంభ దినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇదే తెలుగువారి ఉగాది కూడా. మన దేశంలో యిలా రెండు రకాలైన కాలమానాలను అనుసరించి ఉగాదిని జరుపుకోవడంలో ఖగోళ విశిష్ఠత కనిపిస్తుంది.
హిందువులు రెండురకాలైన ఉగాది పర్వదినం జరుపుకుంటున్నా దానిలో ‘ఏకత్వం’ కనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య కొద్దిపాటి రోజులు తేడాలున్నా రెండూ వసంతకాలంలోనే ఉండడం విశేషం!

చాగంటి కోటేశ్వర రావు > ఉగాది ఉపన్యాసం : http://www.youtube.com/watch?v=5S_uM0evBZ4

ᐅసంక్రాంతకులు


---------------------------
సంక్రాంతకులు
---------------------------


ప్రకృతిలో పరమేశ్వర కారుణ్య స్వరూపాన్ని చూడగలిగినవాడే ధన్యుడు. అలాంటి ధన్యతనిచ్చే సంస్కారాలు భారతీయుల పండుగల్లో ప్రత్యక్షమవుతాయి.
ప్రకృతి పరిణామాల్లో ఉండే దివ్యశక్తిని తెలుసుకొని, ఆ శక్తి మనలో నింపుకొనేలా పర్వదినాలను ఏర్పరచారు మహర్షులు. అలాంటి పర్వమే సంక్రమణం.

'ఈ ద్వావా పృథువులు (ఆకాశం, భూమి) మీకు సాఫల్యమొసగుగాక! ఇవి తండ్రీ తల్లులవంటివి...' అని ఒక వేదమంత్ర భావం.

భూమిని తల్లిగాను, ఆకాశాన్ని తండ్రిగాను మన ఆర్షసంస్కృతి సంభావించింది. మనల్ని తల్లిలా భరించి పోషిస్తున్నది భూమాత. ఈ తల్లికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చి, సఫలతను చేకూర్చుతున్నది ఆకాశం.

నింగి నుంచి కురిసే వర్షాదులు, జ్యోతిర్మండలాల కాంతీ, ఆకాశరాజైన సూర్యభగవానుని ప్రాణశక్తి భూమి గ్రహిస్తున్నది. భూవాసులు పోషణ పొందుతున్నారు. అందుకే గగనాన్ని తండ్రి భావంతో దర్శించారు.

ఎన్ని సౌరకుటుంబాలు ఉన్నా మన భూమికి సంబంధించిన సూర్యుడే మనకు ఆకాశరాజు. అందునా గగనంనుంచి సూర్య, మేఘాదుల శక్తులను వేర్వేరు కాలాల్లో, వివిధ ప్రాంతాల్లో ఒకే భూమిపై జీవరాశి రకరకాలుగా పొందుతోంది. ఆయా దేశకాలాల్లో ఉన్నవారిని అనుసరించి విభిన్న ప్రాంతాల్లో పలు పర్వాలు ప్రసిద్ధిచెందుతాయి. భారతదేశంలో అనేక పర్వాలు అన్ని ప్రాంతాలవారికీ సర్వసాధారణమే అయినా, వాటిని జరుపుకొనే రీతుల్లో భిన్న ధోరణులు కనిపిస్తాయి.

సమస్త ధార్మిక గ్రంథాల్లోను సంక్రాంతకులకు ఉత్కృష్ట స్థానం ఇచ్చారు. అందునా ఉత్తరాయణారంభ సంక్రాంతి అయిన 'మకరసంక్రాంతి'కి ఆధ్యాత్మిక శాస్త్రాల్లో ఎంతో ప్రాధాన్యముంది. ఈరోజున స్నాన, దాన, జపతపాలకు ప్రాముఖ్యం. అందుకే గంగ మొదలుకొని కావేరి వరకు భారతీయ నదీతీరవాసులు పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. ఆ తీరాల్లో పితరులకు తర్పణాదులు సమర్పిస్తారు. దాన, అనుష్ఠానాదులు చేస్తారు. పంటఫలాలను 'భోగి'ంచే పర్వం సంక్రమణాన్ని స్వాగతిస్తుంది.

దక్షిణాపథంలో సూర్య(కాంతి)గమన పరిణామం మాత్రమే కాక, భూమి పండుగగా ఆచరించడమూ కనిపిస్తుంది. భూమాత దయవల్ల, కాంతి వర్షాదుల అనుకూలతవల్ల పంటలు పండాయని భావించి- వారి పట్ల కృతజ్ఞతతో సూర్యారాధన, ఇతర దేవతారాధన చేయడం ప్రధానం.

మన కృషితో మనం వ్యవసాయఫలాన్ని పొందగలం. నిజమే కానీ ఆ కృషి ఫలించేలా దైవం అనుకూలించాలి. అనుకూలించిన దైవానికి కృతజ్ఞతాపూర్వక భక్తిభావాన్ని ప్రకటించాలి. ఆ సంస్కారం ఈ పండుగలో కనిపిస్తుంది.

దేవతల్నీ పితృదేవతల్నీ ఆరాధించిన తరవాత, సాటి మానవులతో పంచుకొని ఆనందించే పర్వంగా సంక్రమణ కాలం గడుస్తుంది. దానాలు, వేడుకలు మొదలైనవి ప్రతి పల్లెలో తారసిల్లుతాయి. వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో వ్యవసాయరంగానికి ఉన్న ప్రత్యేకత, పవిత్రత ఈ పండుగలో స్పష్టమవుతాయి. రైతుకీ, వ్యవసాయానికీ దేశం ప్రాధాన్యమివ్వాలి... అని మన పూర్వగ్రంథాలు నొక్కి చెప్పాయి. ఎంత పారిశ్రామిక ప్రగతి అయినా- ఆహార సమృద్ధి ఉంటేనే సాధ్యమవుతుంది. ప్రాకృతిక పద్ధతుల్లో సాగిన భారతీయ వ్యవసాయ విధానంలోని గొప్పతనాన్ని ఇప్పుడే ప్రపంచం గుర్తించి అనుసరిస్తోంది.

సేంద్రీయ ఎరువుల వాడకం, పశుసంపద సాయంతో వ్యవసాయం వంటి శ్రేష్ఠమైన పద్ధతులు భారతీయులవి. అందువల్లే- ఈ సౌరపర్వంలో పశువుల్నీ పూజించడం కనబడుతుంది. తమ కృషిలో భాగస్వాములైన పశువులపట్లా కృతజ్ఞతా భావాన్ని ప్రకటించే భారతీయ సంస్కారానికి జోహారులు. శ్రమజీవుల పండుగగా ప్రశంసించదగిన ఈ మహాపర్వంలో సమాజంలో అందరితో పంటఫలాలను పంచి, పరవశించడం ప్రత్యేకత.

ధనుర్మాసంలో సందడిగా, సౌందర్యంగా రంగవల్లులతో, గొబ్బెమ్మలతో పౌష్యలక్ష్మీకళలు ఉట్టిపడే తెలుగువాకిళ్లు, మకర సంక్రమణంతో ఐశ్వర్యాలను ఆహ్వానించి ప్రతిష్ఠచేస్తాయి. పనిచేసే బసవయ్య కూడా అలంకారాలతో హారతులందుకుంటుంటే, మరో ఆబోతు గంగిరెద్దుగా ఈశ్వరవాహనాన్ని తలపింపజేస్తుంది. గోవుమాలక్ష్ములు కోటి దండాలందుకుంటాయి.

కొత్త బియ్యం ఆవుపాలతో ఉడికి పాయసమై, సూర్యదేవునికి నివేదనయై, మనకు 'పొంగలి' ప్రసాదమవుతుంది. పంటతో మొదటిసారి వండి ఆదిత్యునికి నివేదించే ఈ భక్తిభావన- నింగినీ నేలనీ ఆత్మీయంగా అనుబంధించే ఉదాత్త సంస్కృతి. పల్లెబతుకులోని సహవాస సౌందర్యానికి సాకారమైన సంక్రాంతినాటి రీతిలో సాగినప్పుడు, దివీభువీ మనకు అనుకూలించి సాఫల్యాన్ని ఇచ్చి తీరుతుందనడంలో సందేహముంటుందా!

- సామవేదం షణ్ముఖశర్మ

ᐅసంక్రాంతి అర్థం



-------------
పెద్ద పండుగ 
-------------


మనిషి ఆలోచనలను గ్రహించడానికి మాట ఎలాగో, ఒక జాతి ఆలోచనలను, ఆచారాలను గ్రహించడానికి పండుగలు అలాగ! ఏ ప్రాంతంలో అయినా, పండుగలను జరుపుకొనే తీరు పరిశీలిస్తే- ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆ ప్రాంత ప్రజల అలవాట్లు కట్టుబాట్లు తెలుస్తాయి. కనుకనే పండుగలను జాతి జీవనాడికి కొలమానాలుగా చెబుతారు. వాటిని సంస్కృతిలో భాగంగా పరిగణిస్తారు. పండుగలనాటి జనజీవన వ్యవహారశైలిని రూపొందించిన మన పెద్దల దృష్టిలో ప్రాణికోటి అంటే మానవులొక్కరే కాదు- జంతువులు, వృక్షాలతో సహా సృష్టిలోని జీవజాలం మొత్తాన్ని వారు ప్రాణికోటిగా పరిగణించారు. ఆచార వ్యవహారాల్లో వాటికి భాగం పంచారు. పశువులూ పక్షులూ మానవ పరివారంలో భాగమేనన్నది పండుగల ద్వారా మనపెద్దలు అందించిన సందేశం. సంక్రాంతి పండుగ దానికి చక్కని ఉదాహరణ. సంక్రాంతి అనే మాటకు చేరువ కావడం అని అర్థం. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి చేరడాన్ని సంక్రాంతిగా పరిగణిస్తారు. పండుగలనేవి మనుషుల్ని కలపడానికే పుట్టాయి. సంక్రాంతి రోజుల్లో మన విధులను పరిశీలిస్తే ప్రకృతితో లయకలిపి జీవించడమే సంక్రాంతి అనే మాటకు అసలు అర్థంగా తోస్తుంది.

మూడు రోజుల పెద్దపండుగలో మొదటిది భోగి పండుగ. ధనుర్మాసానికి ముగింపు అది. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి భూదేవి అంశతో జన్మించిన గోదాదేవి శ్రీరంగనాథుడి పత్నిగా సౌభాగ్యానికి నోచుకున్న దానికి సంకేతమే భోగి. పాతసామాన్లు, చీపుళ్లు, ఎండుకొమ్మలు, విరిగిన వస్తువులు లాంటి మానవ దారిద్య్ర చిహ్నాలను మంటల్లో తగలబెట్టడం ఆనాటి ఆచారం. లేమి చీకట్లలోంచి భోగవికాసాల్లోకి దారిచూపే ఆ మంటల్ని భోగిమంటలన్నారు. మర్నాటి నుంచి ఆరంభమయ్యే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మనిషి ఉత్సాహంగా ఆహ్వానించడానికి అవి చిహ్నాలు. పండిన పంటలు చేతికి అందే ఆనందపు రోజులవి. తెల్లగా వెల్లలు పూసిన గాదెలు నిండు ధాన్యపు రాశులతో కళకళలాడే సమయం అది. వాటిని గరిసెల్లో గాదెల్లో నింపడానికి ముందే గ్రామీణులు తమ ఇళ్లచూరులకు, దేవాలయ ప్రాంగణాల్లోను కొత్త ధాన్యపు కంకుల్ని కుచ్చులుగా కట్టి వేలాడదీస్తారు. చూడటానికి అవి వడ్ల కిరీటాల్లా ఉంటాయి. పిచుకలనూ, పిట్టలనూ అవి ఆహ్వానిస్తాయి. మందలు మందలుగా చేరిన పక్షుల బృందగానాల రొదతో కొత్త సున్నాలు వేసిన రైతుల ఇళ్లు చిలకలు వాలిన చెట్లు అయిపోతాయి. ఇంటికి పండుగ వాతావరణాన్ని ఆపాదించడంలో ఆ సందడి చాలా ముఖ్యమైనది. పిల్లల కేకలు, పక్షుల అరుపులు లేకుండా నిశ్శబ్దంగా ఉసూరుమంటూ ఉండే ఇంటికి పండుగ శోభ రమ్మన్నా రాదు. ఇంటి ముంగిట ముగ్గుల్లోని గుల్లసున్నం ఘాటు, గుమ్మాలకు పూసిన పసుపు కుంకుమల వింత పరిమళాలను కలుపుకొని ఇల్లంతా చక్కగా వ్యాపించిందంటే పెద్దపండుగ వచ్చేసిందని అర్థం.

ఇంతలో తంబురమీటుతూ, 'హరిలో రంగ హరి' వినిపిస్తూ (వైష్ణవం) హరిదాసులు, 'శంభో' అని పెద్దధ్వనితో శంఖం పూరిస్తూ (శైవం) జంగందేవరలు, 'అంబ పల్కు జగదంబ పల్కులను వినిపించే బుడబుక్కల వాళ్లూ, 'అయ్యగారికి దండం అమ్మగారికి దండం' అంటూ గంగిరెద్దుల విన్యాసాలు పండుగకు శోభ చేకూరుస్తాయి. సంపదల సమృద్ధితో సంతోషంగా ఉన్న గృహస్థులు వారిని సత్కరిస్తారు. భోగినాటి ఆకర్షణల్లో గొబ్బెమ్మల పూజ ప్రధానమైనది. భాగవతంలోని కాత్యాయనీ వ్రతమే దీనికి పునాది. కన్యలు వేకువనే లేచి, వాకిట రంగవల్లులు తీర్చి. ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను మధ్యలో ఉంచి, గుమ్మడి పూలతో అలంకరించి, వాటి చుట్టూ ప్రదక్షిణలు చేసే దృశ్యం చూస్తే పండుగంటే ఇదేసుమా అనిపిస్తుంది. పట్టు పరికిణీలు, వెండిమువ్వల కేరింతలు... భోగి కళ కన్నుల పండుగ! 'సుబ్బీ సుబ్బమ్మ! శుభములీయవె, తామర పూవంటి తమ్ముణ్నీయవె, చేమంతి పూవంటి చెల్లెలినీయవె' అంటూ కన్నెపిల్లలు గొబ్బెమ్మల రూపంలోని గౌరీదేవిని ఆరాధిస్తారు. ఈ పాటలోని నిజమైన ఆంతర్యం చివరి పంక్తిలో ఉంది. 'మొగలి పువ్వంటి మొగుణ్ని ఈయవే'- అనేదే అసలైన ప్రార్థన. భార్య సంపెంగ పూవులాను, మొగుడు మొగలిపూవులాను ఉండాలనుకోవడంలో చక్కని చమత్కారం ఉంది. సంపెంగలపై తుమ్మెదలు వాలవు. మొగలిపూవు శివార్చనకు పనికిరాదు. 'నా మనిషి నాకే సొంతం' తరహా గడుసు అంతరార్థం కారణంగా ఈ పాట తరతరాలుగా నిలిచింది. ఇక తల్లిహోదా పొందిన ఇల్లాళ్లకు ఈరోజు చేతినిండా పని. పదిమందినీ పిలిచి పేరంటం చేసి, తమ పిల్లల నెత్తిన రేగుపళ్లు కొబ్బరిముక్కలు పచ్చిశెనగలు నాణాలు కలిపిన భోగిపళ్ల సంబరాలతో హారతులు ఆశీస్సులు ఇప్పిస్తారు. భోగినాడు ఇంద్రుడికి పొంగలి నైవేద్యం ఆనవాయితీ. రాబోయే వేసవితాపాన్ని తగ్గించి, తొలకరినీ, సకాల, సంపూర్ణ వర్షాలతో పంటలను బాగా అనుగ్రహించాలన్న ప్రార్థనలతో 'ఇంద్ర పొంగలి' నివేదిస్తారు. మొత్తంమీద పెద్దాచిన్నా, ఆడామగ, పిల్లామేకా, పక్షీపశువూ, చెట్టుచేమా... మొత్తం మానవ పరివారానికి చెందిన పూర్తిస్థాయి పండుగ ఇది. అందుకే ఇది పెద్దపండుగ!

- ఎర్రాప్రగడ రామకృష్ణ