ᐅఇరుముడి సారం



------------------
ఇరుముడి సారం
------------------


శబరియాత్ర చేసేవారు అయ్యప్ప దర్శనానికి వెళ్లేటప్పుడు తీసుకుని వెళ్లే ఇరుముడి అతిప్రధానమైంది. అతి ముఖ్యమైం. ఈ ఇరుముడే స్వామికి కూడా చాలా ఇష్టమైనదిగా చెబుతారు. ‘ఇరుముడి’. ఇరుము అంటే రెండు భాగాలు అని అర్థం. ముందూ, వెనక రెండు మూతులున్న పెద్ద సంచిని ఇరుముడి అని వ్యవహరిస్తారు. ఈ ఇరుముడిలో ముందుభాగంలో స్వామివారి పూజకి, అభిషేకానికి కావలసిన సామాన్లు పెట్టుకోవడానికి, వెనుకభాగంలో నడిచేటప్పుడు దారిలో వండుకోవడానికి కావలసిన వంట సామానులు, తినుబండారములు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇరుముడి ముందుభాగం మనిషిని, వెనుకనున్న భాగం మనిషి కోర్కెలకు (ప్రారబ్ధకర్మ) ప్రతీక. నడిచి వెళ్లేదారిలో వెనుక వున్న తినుబండారములు ఖాళీ అయినట్లుగా ప్రారబ్ధకర్మ తీరిన తరువాత మనిషి భగవంతుని సన్నిధికి చేరుకుంటాడు. నెయ్యితో నిండిన కొబ్బరికాయ మనిషి శరీరాన్నీ, అందులో వున్న నెయ్యి జీవాత్మని సూచిస్తుంది. కొబ్బరి చిప్పల్ని హోమగుండంలో కాల్చేసి, నెయ్యిని స్వామివారికి అభిషేకం చెయ్యడంలోని అంతరార్థం మనిషి చనిపోయిన తర్వాత శరీరం కాలిపోయి అందులో వున్న జీవాత్మ పరమాత్మతో లీనమైపోతుంది అని దాని పరమార్థం. మనస్సులో వున్న కోరికల్నీ, కల్మషాల్నీ అగ్నిలో కాల్చేసినవాడు భక్తిమార్గం ద్వారా భగవంతుని చూడవచ్చు అన్నదానికి పరమార్థమే ఈ శబరిగిరి యాత్ర- ‘స్వామియే శరణం అయ్యప్ప’. అంతేకాదు తత్వమసి సిద్ధాంతమే ఈ అయ్యప్ప దీక్షకు పట్టుకొమ్మ. తనలో అయ్యప్పస్వామిని చూసుకొని ఎదుటివారిలో కూడా స్వామివారి రూపాన్ని దర్శించకలగడమే ఈ దీక్ష ప్రత్యేకత. అందుకే ఎవరు ఎదురు పడినా ‘స్వామి శరణం’ అంటూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తారు.

- వసంతకుమార్ సూరిశెట్టి