ᐅగణేశ స్మృతి


---------------------
వినాయక స్వరూపం
---------------------


శ్రీగణేశ అనే సంస్కృత పదానికి ప్రారంభం అని అర్థం. అందుకే వినాయకుడు ఆదిదేవుడ య్యాడు. సమస్త విఘ్నాలను తొలగించి శుభాలను కలుగజేసేవాడు వినాయకుడు. దేవతాగణాలు ఉద్భవించి సృష్టి ప్రారంభం అయినప్పటి నుంచి ఆదిపురుషునిగా పూజలందుకుంటున్నట్లుగా గణేశపురాణం తెలియజేస్తోంది. గణేశుడు విష్ణుస్వరూపమని ‘శుక్లాంబరధరం విష్ణుం’ శ్లోకం సూచిస్తుంది.

దేజతలలో ప్రథముడైన గణపతిని ముందుగా పూజించిన తర్వాతే ఇష్టదైవాలను ప్రార్థించడం ఆనవాయితీగా వస్తోంది. విఘ్నేశ్వరునికి గణాధిపత్యం ఇవ్వడమే ఇందుకు కారణం. గణపతిని జ్యేష్ఠరాజుగా, సర్వదేవతలలో ప్రథమపూజ్యుడుగా ఋగ్వేదం వర్ణించింది. ముప్పది మూడు కోట్ల మంది దేవతలు గణాలుగా ఉండగా, వారందరికీ అధినాయకుడు గణపతియేనని వేదాలు నిర్దేశించాయి. శ్రీ మహాగణపతి ద్వాదశ ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్టవసువులకు కూడా ప్రభువు. ప్రణవనాద స్వరూపుడు కనుక గణపతిగా వెలుగొందుతున్నాడు. యోగానికి అధిపతి గణాధిపుడే అని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది.

గణపతి సకల విద్యలకూ అధిదేవత. ప్రణవస్వరూపంగా, శుద్ధబ్రహ్మగా, ఆనంద స్వరూపంగా విరాజిల్లే దేవదేవుడు వినాయకుడు. నాయకుడు లేని సర్వ స్వతంత్రుడాయన. ‘గణపతి’ అనే పదంలో ‘గణ’ అనే శబ్దానికి వాక్కు అని అర్థం. కాబట్టి వాగధిపతి గణపతియే!

వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు. కృతయుగంలో సింహవాహనంపై పదితలలతో దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో నెమలివాహనంపై మయూరేశుడిగా ఆవిర్భవించాడు. ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై, చతుర్భుజుడై అలరారాడు. కలియుగంలో తొండంతో, ఏకదంతుడై సంపద బొజ్జతో ఉన్న గణనాథుడు దర్శనమిచ్చాడు. ఇందుకు నిదర్శనమేనేమో వివిధ రూపాల్లో వీధివీధుల్లో కొలువుదీరే గజాననుని దివ్య ఆవిష్కారాలు.

తొమ్మిదిరోజులపాటు వినాయక విగ్రహాన్ని భక్తితో పూజించి ఊరేగింపుగా తీసుకెళ్లి నీటిలో కలిపి వేయడం బాధగానే ఉంటుంది. కాని అది ఒక సంప్రదాయం. 3, 5, 9 రోజుల పూజ తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలకు ఉద్వాసన పలికి ఎక్కడైనా ప్రవహించే నీటిలోగానీ, లోతైన నీటిలోగాని నిమజ్జనం చేస్తారు.ఎన్నో అలంకరణలతో, మనం పోషించుకునే ఈ శరీరం తాత్కాలికమేనని, మూణ్ణాళ్ల ముచ్చటేనని, పంచభూతాలలో నడిచే ఈ శరీరం ఎప్పటికైనా పంచభూతాల్లో కలిసిపోవలసిందేననే సత్యాన్ని వినాయక నిమజ్జనం మనకు తెలియపరుస్తుంది.

వినాయకునికి ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుడికి మంత్రయుక్తంగా పూజ చేసి, దూర్వాయుగ్మం అంటే రెండు గరికలతో పూజ చేస్తారు. వినాయకునికి గరికపూజ ప్రీతిపాత్రం. గరికపోచలలో ఔషధీ గుణం ఉంది. సర్పి, చిడుము మొదలైన వాటికి మంత్రించే వారు గరికపోచలు వాడేది అందుకే.

(Source : Sakhi)

ఓం గం గణపతయే నమః
విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబ సభ్యులకు సదా, సర్వదా అభయ, విజయ, లాభ శుభాలు చేకూరాలని.. క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని.. సుఖసంతోషాలు చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
వినాయక చవితి శుభాకాంక్షలు.... !!