ᐅఉగాది విశిష్ఠత



---------------
ఉగాది విశిష్ఠత
---------------

ఋతువుల్లో వసంత ఋతువు అత్యంత మనోహరమైనది. ఖగోళవిజ్ఞానం ప్రకారం భూమి 23 1/2 డిగ్రీలు ఏటవాలుగా ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతున్న కారణంగా ఋతువులు ఏర్పడుతున్నాయి. ఋతుచక్రం పూర్తికావడానికి సంవత్సరకాలం పడుతుంది. శీతల దేశాల్లో ఋతువులు వసంతం, వేసవి, ఆకురాలు కాలం, చలికాలంగా వుంటే ఎస్కిమోలు నివసించే ప్రాంతాల్లో కేవలం వేసవి, చలి ఋతువులే ఉన్నాయి.

భారతదేశంలో 2 నెలలకాలం ఒక ఋతువుగా చెప్పబడింది. తెలుగు నెలల ప్రకారం చైత్ర, వైశాఖ మాసాలను – వసంత ఋతువుగానూ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలను – గ్రీష్మ ఋతువుగానూ, శ్రావణ, భాద్రపదమాసాలను – వర్ష ఋతువుగానూ, ఆశ్వయుజ, కార్తీక మాసాలను – శరదృతువుగానూ, మార్గశిర, పుష్యమాసాలను – హేమంత ఋతువుగానూ, మాఘ, ఫాల్గుణ మాసాలను – శిశిర ఋతువుగానూ పేర్కొంటూ ఆరు ఋతువులను ఏర్పాటు చేసుకున్నాం.

వసంతం నుండి శిశిరం వరకు సంవత్సరకాలాన్ని లెక్కకట్టుకోవడంలో ఓ ప్రత్యేకత ఉంది. శిశిరంలో వృక్ష సంతతి ఆకులనూ, బెరళ్ళను వదిలేసి వసంతంలో తిరిగి కొత్త అందాలను నింపుకుంటుంది. ఈ మార్పు ప్రకృతిలో పచ్చదనాన్ని నింపడంతో పశుపక్ష్యాదులతో పాటు మానవ సంతతి మనస్సులు కూడా నూతనోత్తేజంతో తొణికిసలాడతాయి. అందుకే వసంతం కొత్త అందాలనే కాదు క్రొత్త ఆశలను కూడా మోసుకొస్తుంది. సాక్షాత్తూ శ్రీ కృష్ణపరమాత్మ సైతం భగవద్గీతలో ఋతువుల్లో నేను వసంత ఋతువునని చెప్పుట ద్వారా వసంత ఋతువు ప్రత్యేకతను ప్రపంచానికి అందించాడు.

కాలమానం.. కాలమానంలో సూక్ష్మ ఘడియలు, పరఘడియలు, విఘడియలు, ఘడియలు, దినాలు, వారాలు, మాసాలు, సంవత్సరాలు మొదలైనవన్నీ ఏర్పరచిన అతి ప్రాచీనకాలం మనది. విదేశీయులు కూడా ఖగోళశాస్త్ర ఆధారంగా వారికి తోచినట్లు ఆంగ్ల కాలమానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రపంచమంతా ఆంగ్లకాలమానాన్ని ఏకరీతిన అనుసరిస్తున్నా హిందువులు మనకాలమానాన్ని సరైన కాలమానంగా భావించడం జరుగుతోంది. ఖగోళశాస్త్ర ప్రకారం చంద్రమానం, సౌరమానం, చాంద్ర సౌరమానం అని మూడు కాలమానాలున్నాయి. చంద్రమానంలో ఒకే పద్ధతిని అనుసరించినా, సౌరమానంలో విదేశీ పద్ధతి, హిందువుల పద్ధతి అని రెండు పద్ధతులున్నాయి. చంద్రుని నడకలను అనుసరించి మాసాలను, సూర్యుని నడకలను అనుసరించి సంవత్సరాన్ని లెక్కకడతాం. చంద్ర, సౌరమాన పద్ధతిలో కనిపిస్తుంది. చంద్ర, సౌరమానం వలన ‘లుప్తమాసాలు’, ‘అధికమాసాలు’ ఏర్పడతాయి. భారతదేశంలో అధిక శాతం హిందువులు ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. కొత్త సంవత్సరం ఆరంభ దినాన్ని ‘యుగాది’ అంటున్నాం. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజును సంవత్సరాదిగా సౌరమానాన్ని పాటించే హిందువులు కూడా వున్నారు. తమిళనాడు, కేరళ, ఒడిసా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల హిందువులు ఈ విధంగా సంవత్సరారంభం జరుపుకోవడం వలన ఈ పండుగ వైశాఖ మాసంలో వస్తుంది.

చంద్రుని నడకలను అనుసరించి చైత్రమాస శుద్ధ పాడ్యమినాడు మిగతా ప్రాంత హిందువులు సంవత్సర ఆరంభ దినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇదే తెలుగువారి ఉగాది కూడా. మన దేశంలో యిలా రెండు రకాలైన కాలమానాలను అనుసరించి ఉగాదిని జరుపుకోవడంలో ఖగోళ విశిష్ఠత కనిపిస్తుంది.
హిందువులు రెండురకాలైన ఉగాది పర్వదినం జరుపుకుంటున్నా దానిలో ‘ఏకత్వం’ కనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య కొద్దిపాటి రోజులు తేడాలున్నా రెండూ వసంతకాలంలోనే ఉండడం విశేషం!

చాగంటి కోటేశ్వర రావు > ఉగాది ఉపన్యాసం : http://www.youtube.com/watch?v=5S_uM0evBZ4