----------------------
శివస్వరూపం
---------------------
జన్మించిన క్షణంనుంచీ మనల్ని కాలవాహిని మన రూపురేఖల్ని, తనువును, దాంతో మనసును మారుస్తుంది. జీవన ప్రయాణం మృత్యువు దగ్గర ఆగిపోతుంది. మృత్యుమందిరం దగ్గరకు మనలో అధికులు రోగులుగా, పాపులుగా వీపున దుష్కర్మల మూటలు మోస్తూ చేరుకుంటారు. దైవం మనిషిని శరీర రూపధారిగా గుర్తించడు. ఆత్మగానే చూస్తాడు. పరమాత్మనుంచీ ఆత్మ విడిపోతుండగా, ఆప్యాయంగా జ్ఞానమును సద్వినియోగం చేసుకున్న జీవుడు మృత్యుమందిర ద్వారాలు దాటి, పరమాత్మ ఎదుట తేజోమయమైన ఆత్మస్వరూపుడు అవుతాడు.
గండకీ నది ప్రవాహానికి కరిగిపోయే రాళ్ళే, నునుపుదేలి శివస్వరూపాలైన సాలగ్రామాలవుతాయని ప్రతీతి. అంటే కాలవాహినిలో శిలలు సైతం తమను తాము సంస్కరించుకుని, శివస్వరూపంగా రూపొందుతున్నాయి. మరి మనిషి మాటేమిటి? పూచిక పుల్లలు నీటిలో తేలుతూ ప్రవాహ వాలులో పడికొట్టుకు పోయినట్లు అర్థరహిత జీవితాలు గడపటం తప్ప, జీవితం ముగిసిపోయేదాకా మేలుకోరా? జీవన చరిత్రలో ప్రతి ఏటా వసంతాలు వస్తున్నాయి. శిశిరాలు, గ్రీష్మాలు, వర్షాలు మనల్ని తమతమ ప్రత్యేకతలతో అలరిస్తున్నాయి. ప్రకృతినుంచి మనం ఎలాంటి సందేశాలూ అందుకోవటంలేదు.
అర్థవంతంగా మార్చుకోవాల్సిన జీవితాలను వ్యర్థమయం చేసుకుంటున్నారు. ఎదురుగా హిమశిఖరాలు ఆహ్వానిస్తుంటే దిగువన ఉన్న లోయల్లోకి దిగిపోతున్నారు. ప్రయాణం దిశ మారాలి. పాదాలు ఎత్తుకు అలవాటు పడాలి. ఆధ్యాత్మికత ఉత్తమ, ఉన్నత ప్రమాణాల జీవిత శిఖరాన్ని చేరుకోవాలి. అప్పుడు జీవన ధారలోంచి వేరుపడి, సాక్షిగా ఆ ప్రవాహాన్ని మందహాసంతో వీక్షిస్తారు. అదే మోక్షం.
- కాటూరు రవీంద్ర తివ్రికమ్