ᐅజ్ఞానసముపార్జన



----------------------------
పరిపూర్ణ జ్ఞానసముపార్జన 
----------------------------


మానవ జీవితంలో జ్ఞానానికున్న ప్రాధాన్యం మరి దేనికీలేదు. 'జ్ఞ' అంటే తెలుసుకోవడం, 'జ్ఞానం' అంటే తెలుసుకోదగినదని అర్థం. జ్ఞానానికి సమానమైనదేదీ లేదని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మే చెప్పాడు. నేలమీదపడిన బిడ్డ 'క్యా..క్యా' అని రోదిస్తాడట. 'చోళ్లోళ్లోహాయీ' అని తల్లి జోలపాడుతుందట. 'ఈ జగత్తులో హాయిలేదు... ఈ జగత్తే మిథ్య నాయనా' అని మొట్టమొదటి వేదాంత పాఠం బోధిస్తుందట. ఇది ఓ కవి చమత్కారంగా చెప్పిన మాట. 'జగన్మిథ్య- బ్రహ్మసత్యం' అన్న ప్రథమజ్ఞాన సోపానం మీద కన్నతల్లే బిడ్డను నిలబెట్టింది. తరవాత తండ్రి, గురువు, సమాజం, కాలంనుంచి ఎంతో జ్ఞానాన్ని ఆర్జించవలసి ఉంటుంది. జ్ఞానమనేది ఓ దివ్యజ్యోతి. ఆ జ్యోతి ప్రవేశనం వల్లనే మనం మన గమ్యాలను, లక్ష్యాలను సాధించుకోగలం. జ్ఞాన సముపార్జనకు మన పూర్వజులెన్నో వనరులు సమకూర్చిపెట్టారు. అసలు భగవంతుడే 'ప్రకృతి' అనే పాఠశాలను జ్ఞానసముపార్జన కోసం మనకు ప్రసాదించాడు. అందుకు మనం సర్వదా కృతజ్ఞులమై ఉండాలి. జీవితంలోని ఏ క్షేత్రంలో విజయం సాధించాలన్నా, సుఖశాంతులు పొందాలన్నా, పరమపద సద్గతిని పొందాలనుకున్నా జ్ఞానార్జన చేయాలి. జ్ఞానార్చన జరగాలి. జ్ఞానాన్ని అర్చిస్తే, గౌరవిస్తే, ఆహ్వానిస్తే, అది మనకు అఖండ యశో వైభవాన్ని ప్రసాదిస్తుంది. పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం కేవలం జ్ఞానికే సాధ్యం. ఆత్మజ్ఞానం ఆర్జించినవాడే జ్ఞాని. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, వాల్మీకి అంబరీషాదులంతా తమ జ్ఞాననేత్రంతో పరమాత్మను దర్శించి, పునీతులైన ధన్యాత్ములుగా చెబుతారు. జ్ఞానవంతమైన వాగ్వర్షం కురిసిన చోట, ప్రకాశవంతమైన మేఘాలు వర్షించి సుభిక్షం కలగజేస్తాయని వేదాలు వర్ణిస్తున్నాయి. ప్రపంచానికంతటికీ ప్రాతినిధ్యం వహించగలవాడు కేవలం 'జ్ఞాని' మాత్రమే!

జ్ఞానం పరోక్షమనీ, అపరోక్షమనీ రెండు విధాలు. పాండిత్యం, బుద్ధి కుశలత వల్ల లభించేది పరోక్ష జ్ఞానం. వివేకం, వైరాగ్యం, శమదమాలు, ముముక్షత్వం వల్ల అపరోక్ష జ్ఞానప్రాప్తి కలుగుతుంది. ఈ రెండు విధాల జ్ఞాన సముపార్జన చేసినప్పుడే 'సంపూర్ణజ్ఞాని' అనిపించుకునే అవకాశముంది. అటువంటివాడే 'పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడిమి బ్రతుకునాటకము' అన్న సత్యవాక్కును విశ్వసించగలుగుతాడు. జ్ఞాని ఇతరుల కోసం భగవచ్ఛింతన చేస్తాడు. తన అజ్ఞానాన్ని, తన దోషాలను జ్ఞాని మాత్రమే తెలుసుకోగలుగుతాడు. జ్ఞానాగ్నిలో కర్మలను దహింపజేసుకోగలవాడే పండితుడు, ముముక్షువు కాగలుగుతాడు. హృదయంలోని సంశయాలన్నింటినీ జ్ఞానయోగి మాత్రమే నివృత్తి చేసుకోగలడు. అజ్ఞానం- మార్పును అంగీకరించదు. మూర్ఖతను సమర్థిస్తుంది. జ్ఞానరహితమైన కార్యం వాసన లేని పువ్వు. జ్ఞానాన్ని ప్రవర్ధమానం చేసే శక్తి ఒక్క సత్వ గుణానికే ఉంది. తమో గుణం జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది. జ్ఞాన యోగం చేయగలవాడే పరమాత్మకు సన్నిహితుడు కాగలడు. జడప్రాయంగా ఉన్న అమిత జ్ఞానంకన్నా చైతన్య రూపంలో సమాజాన్ని ప్రభావితం చేయగల పరిమిత జ్ఞానమే మిన్న. శ్రమను ప్రేరేపించలేని జ్ఞానమెంతటిదైనా వ్యర్థమే అన్నారు బుధులు. అటువంటి జ్ఞానంవల్ల ఎన్ని ఆటంకాలు, సమస్యలు, బాధలు ఎదురైనా మానవుడు ఆదిలోనే అధిరోహించగలడు.

సాధకుడికి జ్ఞానాన్ని మించిన గొప్ప సాధనమే లేదు. ఆ జ్ఞానమే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆత్మజ్ఞాని తన కర్మను చేస్తూ, అన్నీ చూస్తూ, తాకుతూ, వింటూ, తింటూ కూడా నిర్లిప్తుడై ఉంటాడు. ఆ పనులన్నీ చేసేది తాను కాదని గ్రహిస్తాడు. ఇంద్రియాలు తమ పనిని తాము చేసుకుపోతున్నాయని గమనిస్తాడు. అన్నింటినీ సమంగా చూస్తాడు. భూషణకు పొంగడు. దూషణకు కుంగడు. సంసారంలో ఉంటూ కూడా సన్యాసిలా వ్యవహరిస్తాడు. ఇదే మోక్ష సౌధానికి ప్రథమ సోపానం. జ్ఞాని అయినవాడు మొట్టమొదట- 'నేనెవరిని, నా శక్తి ఏమిటి, ఎలా ఉన్నాను, ఎలా ఉండాలి?' అన్న ప్రశ్నలు వేసుకుని సంతృప్తికరమైన సమాధానాలు ఎప్పటికప్పుడు పొందుతూ తన ఆంతరిక, బాహ్యవ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకుంటూ జ్ఞానార్జన ద్వారా జ్ఞానార్చనలో సర్వదా లీనమై ఉంటాడు. అందుకు సద్గురువే ఎల్లవేళలా పథప్రదర్శకుడై నడిపిస్తాడు. తోడిన కొద్దీ శుద్ధ జలమిస్తుంది చెలమ. వేడినకొద్దీ మహాజ్ఞానమిస్తాడు గురువు. గురువు కులమతాలతో నిమిత్తం లేకుండా జ్ఞానం గ్రహించేవాడే నిజమైన శిష్యుడు. యుద్ధంలో కత్తితోనే పని, కత్తిని కాపాడే ఒరతో కాదు. అలాగే గురువు ప్రసాదించే జ్ఞానంతోనే పని; అతని కులమతాలతో పనిలేదు శిష్యుడికి. వంద గ్రంథాల జ్ఞానం కన్నా సద్గురువు హితవాణి ఒక్కటే మహిమాన్వితమైనది. మన సమస్యలకు పరిష్కారం గ్రంథాల్లో వెదుక్కోవాలి; కాని, గురువు మన సమస్యకు సూటిగా పరిష్కార మార్గం చూపి, జ్ఞానశిఖరం వైపు తీసుకెడతాడు.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి