ᐅ పుణ్యాల పండుగ

ᐅ పుణ్యాల పండుగ

పుణ్యపర్వం సంక్రాంతి. ఏ కర్మలవలన మనం పవిత్రులమవుతామో వాటిని పుణ్యాలు అంటారు. అలాంటి సత్కర్మలకు సత్కాలం లభించడం యోగం. వర్షరుతువులో వ్యవసాయం వలె- పుణ్యకాలాల్లో పుణ్యకర్మలు యోగ్యమై విశేష ఫలాలను ప్రసాదిస్తాయని శాస్త్రవచనం.
సూర్యశక్తిలోని దివ్యత్వాన్ని దర్శించిన మహర్షులు, దాన్ని పొందే పద్ధతులను ధార్మిక గ్రంథాల ద్వారా అందించారు. సౌరకాంతి పరివర్తనాన్ని ఆధారం చేసుకున్న పర్వం సంక్రాంతి. ఏ మాసమైనా సంక్రమణం దివ్యపర్వమే. అయినా, ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశమైన మకర సంక్రమణానికి విశిష్ట ప్రాధాన్యముందని శాస్త్రోక్తి. స్నాన దాన జపతపాది పుణ్యకర్మలు ఈ పర్వకాలంలో పుష్టినిస్తాయని, సత్సంకల్పాలు అవశ్యం ఫలిస్తాయని ఆర్షగ్రంథాల మాట.

దేవతలను, పితృదేవతలను పూజలతో, తర్పణలతో తృప్తిపరచి వారి అనుగ్రహం వల్ల కుటుంబసౌఖ్యాన్ని, సర్వసంపత్సమృద్ధిని పొందడానికి ఈ పర్వం మహోపయోగమని ధర్మశాస్త్రకర్తల వచనం. ఈ సంక్రాంతిని 'తిల సంక్రాంతి' అనీ వ్యవహరిస్తారు. సంక్రాంతికున్న వివిధ విశిష్టాంశాల్లో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క అంశాన్ని పాటిస్తుంది.

దేవతలకు (ప్రత్యేకంగా శివుడికి) నువ్వులనూనె దీపాన్ని అర్పించడం, నువ్వులతో వండిన వంటకాలను నివేదించి, ఆ ప్రసాదాలను ఆరగించడం శ్రేష్ఠమని అనుష్ఠాన ప్రధాన గ్రంథాలు చెబుతున్న విశేషం. తిలలను, బెల్లపు పదార్థాలను కలిపి ఒకొరికొకరు అందించుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకోవడం కొన్ని ప్రాంతాల ఆచారం. కొత్తబియ్యంతో పాయసం వండి సూర్యభగవానుడికి నివేదించడం వేదాల యజ్ఞాల్లోని అంశం. ఆ వేదసంస్కృతి సామాన్యుల్లోనూ వ్యాప్తమై 'పొంగల్‌' పేరుతో జరుగుతోంది. దీనికి మూలం- వైదికమైన 'ఆగ్రయణేష్టి'.

మంచి కాలంలో మంచి ఆలోచన, మంచి ఆచరణ- అనే ఒక మంగళకర భావన ఈ పర్వంలో వ్యాపించి ఉంది. సోమవారంనాడు ఈ సంక్రమణం రావడం శుభసూచకమని, సంపత్కరమనీ జ్యోతిష శాస్త్రం చెప్పిన ఫలం.

సూక్ష్మ దివ్య విజ్ఞానానికి సంబంధించిన అంశాలతోపాటు, అన్ని భారతీయ పర్వాల్లాగా ఈ పర్వంలోనూ ప్రకృతితో మానవుడికున్న ఆత్మీయబంధం గోచరిస్తుంది. ప్రాణదాత్రి అయిన సౌరశక్తిలోని పరిణామాల్లో దివ్యత్వాన్ని దర్శించడం గొప్ప సంస్కారం.

ప్రకృతిలో జీవనగతిపై ప్రభావం చూపే పంచభూతాలు, గ్రహాల రీతులను గమనించి; ఒక దానితో ఒకటి అనుబంధమై, ఒకదానిపై ఒకటి స్పందనను ప్రసరిస్తున్న విశ్వరహస్యాలను గ్రహించి- రుషులు కొన్ని పద్ధతులను నిర్దేశించారు.

ప్రకృతి పరిణామాల పట్ల, మానవ సంబంధాల పట్ల ఒక చైతన్యవంతమైన ఆత్మీయతను చాటిచెప్పే పండుగలివి- అని సూక్ష్మదృష్టితో పరిశీలిస్తే స్పష్టపడుతుంది. ప్రతి ఇల్లూ లక్ష్మీకళతో ఉట్టిపడుతూ, బంధుమిత్రులతో కళకళలాడటం సంక్రాంతి శోభ. సామాజికంగా ఉన్న సమైక్యతకు ఈ పర్వం ఒక తార్కాణం. 'దానం' ద్వారా అభ్యుదయం సాధించాలని చాటిన ధర్మశాస్త్రాలు, ఈ పండుగను 'దానపర్వం'గా అభివర్ణించాయి. ఈ సంక్రాంతినాడు సస్యలక్ష్మీ కళను ఆరాధించడం, వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో అవశ్యకర్తవ్యంగా భావిస్తారు. ఈ పంటల పండుగనాడు మహాలక్ష్మిని ఆరాధించడం శ్రేష్ఠమని దేవీమహిమా గ్రంథాలు తెలియజేస్తున్నాయి. పౌష్యలక్ష్మి, సంక్రాంతిలక్ష్మి- అని కీర్తించే జగజ్జననిని రంగవల్లులతో, పసుపు కుంకుమలతో, నవధాన్యంతో ఆరాధించడం సంప్రదాయం.

కొన్ని ప్రాంతాల్లో ముత్తయిదువులు పసుపు కుంకాలను పంచుకుంటూ సౌభాగ్యకాంక్షను వ్యక్తపరచడం సంప్రదాయంగా ఉంది. దివ్యత్వ మానవత్వాలతో ప్రకృతి సౌందర్యం పరిమళించడం సంక్రమణ సంపద.

- సామవేదం షణ్ముఖశర్మ