ᐅమనసు - సాధన



ᐅమనసు - సాధన 


మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం- వీటిని అంతఃకరణ చతుష్టయమంటారు. మనసు వలన సంకల్పం, బుద్ధి వలన నిర్ణయించే శక్తి, చిత్తం వలన జ్ఞాపకశక్తి, అహంకారం వలన ఆత్మశక్తి కలుగుతాయి.బంధానికిగానీ, మోక్షానికిగానీ మనసే ప్రధానం. మనసు ఓ మాయావి. మనిషికి కలిగే ఆనందం, దుఃఖం మనసు వల్లే కలుగుతాయి.
మనసు ఆహ్లాదంగా ఉందనుకోండి, జగత్తు అప్పుడే విచ్చిన గులాబీలా మనోహరంగా కనబడుతుంది. సాధారణంగా వీచే గాలి, చల్లని కొండగాలిలా హాయిగా శరీరాన్ని తాకుతుంది. నిప్పులు చెరిగే వేసవిలో ఆశ్రయించిన శీతల విడుదుల్లా అననుకూల పరిస్థితులు కూడా మనసుకు హాయినిస్తాయి. లోకులు ఆడే క్రూర పరిహాసమూ నవనీతమై ఎదను తాకుతుంది. ఆకలిగొన్నవాడికి పచ్చడి మెతుకుల నుంచే తృప్తి లభించినట్లు ఆనంద క్షణంలో సామాన్య జీవనం మధురంగా భాసిల్లుతుంది.

మనసు నిర్వేదంగా ఉందనుకోండి, అన్ని అనుకూలతల్లోనూ ప్రతికూలత కనిపిస్తుంది. మధుర భాషణంలోనూ వ్యంగ్యం గోచరిస్తుంది. పరిహాసానికి ఆడిన మాటా తూటాలా గుండెను తాకుతుంది. వసంత కోకిల కుహూరవాలు రోత పుట్టిస్తాయి. మధుర సంగీత బాణీలు తలనొప్పి కలిగిస్తాయి. కొద్దిపాటి కష్టమూ భరింపరానిదవుతుంది. 'ఎవరైతే మనోవైఖరులను మార్పు చేసుకోగలరో, వారు ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోగలరు' అంటాడు ఓ ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త. సుఖాన్ని ఆనందించినట్లే, కష్టాన్నీ భరించే శక్తీ మనసుకు ఉంటుంది. ఆ మనసును సాధనతోను, వైరాగ్య నిగ్రహాలతోను పుష్టిగా చేసుకున్న సాధకుడే నిజమైన బలశాలి! అదే గీతాచార్యుడు ప్రవచించిన సమస్థితి. 'మనసు కోరిన అనుచితమైనదాన్ని కాదన గలగడమే మనోనిగ్రహ'మంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి.

'మనసును జయిస్తే సమస్త ప్రపంచాన్నే గెలిచినట్లు' అంటాడు ఓ సుప్రసిద్ధ తత్వవేత్త. ఈ జగత్తులో కష్టసుఖాలు చాలా మటుకు మనసు కల్పించుకున్నవే! తినగ తినగ వేపాకునూ మధుర పదార్థంగా రుచింపజేయగల అమోఘ శక్తి మనసుకుంది. భావనామాత్ర ప్రతిభచేత విశ్వాంతరాళాలను క్షణంలో చుట్టి రాగల మనశ్శక్తి అపూర్వం. మనోబలం ద్వారా ఆత్మశక్తి చేకూరుతుంది. అప్పుడు ఎదలోను, ఎదుటివారిలోను ఉన్న అంతర్యామిని సాధకుడు దర్శించగలుగుతాడు.

జ్ఞానాన్ని స్వీకరించేందుకు మనసు అనుకూలంగా ఉన్నప్పుడు మానవుడు ఎన్నో విజయాలు సాధిస్తాడు. బలహీనమైన మనసు అపజయాలకు, ఆత్మన్యూనతకు దారితీస్తుంది. సామాన్యుల జీవితాలు మనసుకు అధీనమై ఉండగా, మహనీయులకు మనసే అధీనంలో ఉండటం విశేషం!

- గోపాలుని రఘుపతిరావు 

ᐅత్యాగం



ᐅత్యాగం 

'ఆయన త్యాగానికి మారుపేరు' అనే వాక్యం మనం తరచూ వింటుంటాం. 'తల్లిదండ్రులు, అన్నదమ్ముల అభ్యున్నతి కోసం పెళ్లి కూడా మానుకుని ఆ సంసారాన్ని ఒక ఒడ్డుకు చేర్చాడని కొందరి కోసం ఎందరో వ్యాఖ్యానిస్తుంటారు. శ్రీరాముడు తండ్రి మాట కోసం రాజ్యాన్ని త్యాగం చేశాడు. అన్నవెంట నడచి సొంత సుఖాలను లక్ష్మణుడు త్యాగం చేశాడు. తనకు దక్కిన రాజ్యాన్ని వదలుకొని అన్న పాదుకలతో భరతుడు పరిపాలన సాగించాడు. ధర్మరాజు బలహీనతలను సహించి భీమార్జున నకుల సహదేవులు మారు మాటాడక కష్టాలన్నీ భరించి త్యాగధనులయ్యారని చదువుకున్నాం. తండ్రి సుఖం కోసం దేవవ్రతుడు ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని శపథం చేసి భీష్ముడయ్యాడు.
అప్పటి సంప్రదాయాలను అనుసరించి తప్పనిసరి పరిస్థితుల్లో పరిస్థితులకు తలొగ్గి వారంతా త్యాగం చేశారా? లేక స్వతస్సిద్ధంగా గుండెలోతుల్లోంచి వచ్చిన ప్రేమ కారణంగా అలా ప్రవర్తించవలసి వచ్చిందా అన్నది చర్చనీయాంశమే! వాల్మీకి వ్యాసాదులు తమ గ్రంథాలలో కొందరి ధీరోదాత్తతను అతిశయించడంకోసం మిగిలిన పాత్రలను అంతగా పట్టించుకోలేదా అన్న ప్రశ్న సహేతుకమే. లక్ష్మణుడు అన్న వెంట అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక్క రాముడు మాత్రమే అడవులకు వెళ్లాలని కైకేయి కోరింది. మరి సౌమిత్రి ఎందుకు వెళ్లినట్లు? అదే సోదర ప్రేమ! భరతుడికి ఒప్పందం ప్రకారం రాజ్యాధికారం సంక్రమించింది. అయితే ఎక్కడో ఉన్న అగ్రజుడి వద్దకు వెళ్లి 'రాజ్యం నాది కాదు, నీది' అని అర్థించాల్సిన పని ఏముంది? వారందరూ త్యాగగుణానికి ప్రతీకలే!

స్వార్థం విడనాడి ఎదుటివారి సుఖసంతోషాల కోసం సర్వం త్యజించిన మహానుభావులు వారు. హనుమంతుడు నిజానికి సుగ్రీవుడికి బంటుగా జీవితాంతం ఉండవలసిన వ్యక్తి. కాని, మధ్యలో వచ్చిన దాశరథిని అనుసరించి 'రామబంటు'గా ప్రఖ్యాతి చెందాడు. అది సుగ్రీవుడిపట్ల తిరస్కార భావం కానేకాదు. రాముడిపట్ల అవ్యాజమైన ప్రేమ! హరిశ్చంద్రుడు, నలుడు, శ్రీరాముడు, ధర్మరాజు వంటివారు తమ సామ్రాజ్యాలను తృణప్రాయంగా త్యాగంచేసి చరితార్థులయ్యారు.

ప్రస్తుత పరిస్థితి ఏమిటి? చిన్నమాట పట్టింపు కోసం జీవితాంతం ముఖాలు చూసుకోనివారెందరో! సెంటు భూమి కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినవారు ఎందరెందరో! తన అభ్యున్నతికి అడ్డుపడ్డాడన్న కారణంగా అత్యంత విలువైన కాలాన్ని దశాబ్దాల పాటు వృథా చేసుకున్నవారెందరో... వారికి చివరకు మిగిలిందేమిటి? ఒకవేళ న్యాయస్థానంలో విజయం లభించినా... దాని ప్రభావమెంత? గెలిచిన వాడికి దక్కిందేమీ లేదు... ఓడినవాడు పోగొట్టుకున్నదీ లేదు. అంతమాత్రాన అన్యాయం జరిగితే మిన్నకుండి ఇతరులకు దాసోహం కావాలని కాదు. న్యాయం కోసం పోరాడాల్సిందే... అంతిమంగా మనకు దక్కేదేమిటి? ఎంతో విలువైన కాలాన్నీ, మనశ్శాంతినీ పోగొట్టుకున్న తరవాత లభించిన విజయం నిజంగా నిరర్థకం కాదా? ఏదో సాధించామన్న తృప్తి వెనక దాగిఉన్న విషాదం సంగతేమిటి?అందుకే జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకొమ్మని గతంలో కవులెందరో చెప్పారు. జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా తమను తాము మలచుకొని, సందర్భానుసారం ప్రవర్తించినవారే విజేతలవుతారు.

త్యాగం అంటే ఆయా సమయ సందర్భాలనుబట్టి తనను తాను నిగ్రహించుకుని ఇతరులను సంతోషపెట్టడమే! పట్టుదలకు పోతే జీవితం పట్టు తప్పుతుంది. పరితాపం మిగులుతుంది. అందుకే సహనం, సంయమనం పాటిస్తే మనందరం త్యాగధనులమే!

- కిల్లాన మోహన్‌బాబు

ᐅనిత్య చైతన్యం



ᐅనిత్య చైతన్యం 

అలసిపోయిన దేహం ఒకింత సేద తీరడం సహజం. కానీ- 'ఇన్నాళ్లూ కష్టపడ్డాను. ఇక నాకు విశ్రాంతి అని, బాధ్యతలనుంచి విరమణ లభించిందని భావిస్తూ మిన్నకుండటం అసహజం. సృష్టిధర్మానికే విరుద్ధం.
సృష్టిక్రమం నిరంతరం కొనసాగిపోతూనే ఉంటుంది. ప్రకృతిలోని రుతువుల గమనం, గ్రహరాశుల గమనమూ సాగిపోతూనే ఉంటాయి. కాలం, ప్రవాహం కదలిపోతూనే ఉంటాయి.

అలాగే శారీరక మానసిక పరిశ్రమా నిరంతరమూ సాగిపోవాల్సిందే. చెలమలోని నీరు తోడేస్తుంటేనే పరిశుద్ధ జలం వచ్చి చేరుతూంటుంది. దేహంలోని శక్తి ఎప్పటికప్పుడు విడుదలవుతుంటేనే, నూత్న శక్తి వచ్చి చేరుతుంది.

మరెందుకీ కావాలని తెచ్చిపెట్టుకునే జడత్వం? 'నాకిక విశ్రాంతి తీసుకునే కాలమే ఇది' అంటూ శక్తిహీనులం కావడం దేనికి? శ్రమించని దేహం శవంతో సమానమంటారు.

పైబడుతున్న వయసు వృద్ధాప్యాన్ని తెస్తుంది. వృద్ధాప్యంలో జవసత్వాలు ఉడిగిపోయే స్థితి సహజమే. బాధ్యతల రాపిళ్లలో మనసూ అలసిపోయి ఉంటుంది.

అలాగని వాటి మానాన వాటిని వదిలేయడం, 'విశ్రాంతే ఇక పరమౌషధం' అన్న చందాన సాగితే- దేహం శిథిలమైపోతున్న చిహ్నంగా స్ఫురించకమానదు.

వయసు పైబడినా నిరంతరమూ కృషిచేస్తూ, వివిధ రంగాల్లో సుఫలాలను అందించిన, అందిస్తున్న వారెందరు లేరు!

వారి అనుభవాలు, జీవన గమనం కొండంత స్ఫూర్తిగా నిలుస్తుంది భావితరాలకు.

'నాకు ముదిమి రావచ్చు గాక... నా ఆశయాలు నిత్య శోభితాలే. శారీరక బలం కరిగిపోవచ్చు గాక... మనోబలం వాడిపోలేదు... భగవంతుణ్ని సిరిసంపదలు, సుఖసంతోషాలు ప్రసాదించమని కోరడంలేదు. శ్రమించే తత్వాన్ని, ఆఖరిక్షణం వరకు ఆరోగ్యకరమైన మనసును కలిగి ఉండేలా దీవెనలందివ్వమని ప్రార్థిస్తున్నాను' అంతరంగ ప్రతిజ్ఞగా ఇది హృదయ కుహరంలో సదా మార్మోగుతూనే ఉండాలి.

ఏదో ఒక లక్ష్య సాధనతోనే జీవితం ముగిసిపోరాదు. ఎన్నో లక్ష్యాల సమాహారమే జీవితం. ఒక్కొక్క దశలో ఒక్కో లక్ష్యం. లక్ష్యాలను సృష్టించుకునే జ్ఞాన సంపద, వాటి సాధనకు శక్తిని కడవరకు కలిగి ఉండాలి.

వీధి అరుగుమీద అంగవికలుడైన ఓ వృద్ధుడు కూర్చుని జనపనారతో తాళ్లు పేనుతుండగా, ఆ దారెంటపోతున్న ఓ వ్యక్తి- 'తాతా! నీ సంతానమంతా ప్రయోజకులయ్యారు. హాయిగా కృష్ణా రామా అంటూ కాలం వెళ్ళబుచ్చక దేనికి ఇంకా ఈ కష్టం నీకు?' అని ప్రశ్నించాడు.

ఆ వృద్ధుడు నవ్వి- 'ఇదేదో సంపాదనకో' మరెందుకో కాదు. ఇంత వయసున్న మా తండ్రే ఇంతగా కష్టపడుతుంటే మేమెంతగా శ్రమించాలి అన్న ఆలోచన నా పిల్లల్లో ఇంకా బలంగా నాటుకొనేందుకే' అంటూ బదులిచ్చాడు.

అనుభవాల సంగ్రహరూపమే వృద్ధాప్యం. ప్రతీమాట, చేత వేదంలా భాసిల్లాలి.

గడచిపోయిన క్షణం రాదు. ముందున్న క్షణాలు అత్యంత విలువైనవి. కాలాన్ని అధ్యయనంచేస్తూ సద్వినియోగపరచుకునే విచక్షణ ఈ దశలో పూర్ణపక్వతతో ఉంటుంది. కాలస్వరూపునిగా విరాజిల్లాలే తప్ప- కాలంవెంట తలొంచుకు తిరిగే జీవిగా ఉండనేకూడదు.

దేహంలోని 'శక్తి' దైవస్వరూపం. సదా ఆ శక్తిని ఉపాసిస్తూనే ఉండాలి. సకల ప్రాణుల్లోని 'చలనశక్తి' ఆ దైవ స్వరూపమే.

శ్రీకృష్ణ నిర్యాణం జరిగాక భగవత్ శక్తి అంతర్థానమై అరాచకం ప్రబలుతుంది. మహా పరాక్రమవంతుడైన అర్జునుడు అంతఃపురకాంతలను సైతం రక్షించలేని దుర్బలుడవుతాడు. గాండీవం కూడా ఎత్తలేని శక్తిహీనుడవుతాడు.

దేహాంతర్గత శక్తిని అనేకరూపాల్లో- క్రియాత్మకంగా వివేచనాత్మకంగా ఆఖరి ఘడియవరకు వినియోగించుకోవడమే వివేకవంతుల లక్షణం.

- దానం శివప్రసాదరావు

ᐅఅతనో వెన్నెల జలపాతం



ᐅఅతనో వెన్నెల జలపాతం! 


వైరాగ్యం... ప్రపంచం దృష్టిలో అన్నీ వదులుకోవటం. బాధ్యతల్ని విస్మరించటం. సోంబేరులైపోవటం. ముఖ్యంగా కుటుంబసభ్యుల్ని బాధపెట్టడం. నిజమేనా? నిజమే. అర్థం అదే. కానీ అంతరార్థం వేరు, భావార్థం వేరు, ఆధ్యాత్మికార్థం వేరు. దిగంబరత్వాన్ని అశ్లీలంగా భావించవచ్చు. ఆత్మ భావస్థితిగానూ అంగీకరించవచ్చు అలాగే ఇదీ. వాస్తవ స్థితిని, పరిస్థితిని అవగాహన చేసుకోవాలి. అశ్లీలతను, ఆత్మభావాన్ని ఒకే గాటన కట్టరాదు. వైరాగ్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని ఏకదృష్టితో చూడరాదు. ఉప్పు వేరు, కర్పూరం వేరు. వైరాగ్యం మంచి కర్పూరం. కర్పూరంలా 'నేను' హరించిపోయే పరిణామశీల భావౌన్నత్యం. ఇది అందరికీ అర్థం కాదు. చాలామంది దృష్టిలో వైరాగ్యం అంటే సోమరితనమే. బాహ్యదృష్టికి మాత్రం అంతమటుకే అనిపిస్తుంది. కానీ... అంతేనా? ఎంతమాత్రం కాదు. బాహ్య ఆడంబర స్పృహ లేకుండా నిర్వికారంగా ఉండిపోయే వైరాగ్యవంతుడు ఆంతర్యంలోనూ అంతే నిర్వికారంగా ఉంటాడు. అంతే నిరహంకారంగా ఉంటాడు. ముఖ్యంగా నిత్యానిత్య వస్తు వివేకాన్ని కలిగి ఉంటాడు. అందుకే అనిత్యమైన సంసారం పట్ల ఆ నిర్లిప్తత, నిర్వికారత. అయితే సాధారణ ప్రపంచానికి సందేహం- ప్రాపంచిక జనసందోహానికి అనుమానం. ఏమిటీ వైరాగ్యం! ఏమానందముంది ఇందులో! ప్రాణాలొడ్డి సంపాదించుకున్న ధన కనక వస్తురాశుల్ని పిల్లాపాపలతో అనుభవించకుండా ఏమిటీ అర్థంలేని అవివేక ప్రవర్తన! నిజమే... అలాగే అనిపిస్తుంది. ఔను మరి... ప్రపంచానికి వెన్నుచూపి వైరాగ్యాభిముఖుడై వెళ్లిపోతున్న మనిషి ఏం పొందుతున్నాడు? ఏ కొండ కొసనో, ఏ అరణ్య మధ్యంలోనో, ఏ వల్మీకపు చాటునో నిమీలిత నేత్రుడై కూర్చుండిపోయే మనిషి ఏమాలోచిస్తున్నాడు? ఏ ధనరాశులకోసం, ఏ నిధినిక్షేపాలకోసం తపిస్తున్నాడు? విచిత్రంగా... ఏమీ లేదు! అద్భుతంగా... దేనికోసమూ కాదు! అతడు అతడుగా మిగలని తీవ్ర వైరాగ్య భావనలో, ఆ భావన కూడా అంతరించి నిర్వికార ఏకాకార దివ్యత్వంలో ఉండిపోతున్నాడు. ఒకసారి... ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం. 'నాకేమీ వద్దు. నేనేమీ కాను, నేనేమీ లేను' అనే నిర్వికార అనుభూతి మనసును ఎంత భావరహితం, ఎంత భారరహితం చేసి ఆనందమో, ఆసవమో, రసమో... ఇవేమీ కాని శుద్ధ చైతన్య ఆవాహనమో... అది అనుభవించాలి... కాదు... అనుభూతించాలి. అదీ కాదా? ఏదీ కానిదేదో అదే అప్పటి... ఆ క్షణాన నీవు, నేను, మనం... నిజానికి అవీ మిగలవు!
తీవ్ర వైరాగ్యం ఎంత హృద్యమైంది! ప్రళయ ప్రభంజనాలకూ చలించకుండా అత్యంత కోమలమైన పూలరేకుల్లా అర్ధనిమీలితమై ఉన్న కనురెప్పలతో... కాదు... కనురేకులతో అత్యంత తేజోవంతమైన, అయినా అత్యంత ఆహ్లాదకరమైన ఒక వెలుగు హిమపాతం, ఒక వెన్నెల జలపాతం- ఆ తీవ్ర వైరాగ్యవంతుడి అణువణువునా జాలువారుతూనే ఉంటుంది.

మనిషి వైరాగ్యంతో తప్ప పరమేశ్వరాభిముఖుడు కాలేడు. ఏం? పరమేశ్వరునికి అభిముఖుడే కావాలా? అసలు అయ్యేతీరాలా? ఔను. తప్పదు. నిజానికి విశ్వాకారుడైన భగవంతుడికి మనిషి సదా అభిముఖుడే అయిఉన్నాడు. ఎందుకంటే- అన్నివైపులా తానే అయి ఉన్న ఆ పరాత్పరుడికి మనిషి అభిముఖుడయ్యే ప్రత్యేక ప్రయత్నమే అవసరం లేదు. మనిషి ఏ ముఖుడైనా సదా భగవన్ముఖుడయ్యే ఉన్నాడు. అయితే అది గొర్రెదాటు వ్యవహారం కాకూడదు. తెలిసి అభిముఖంగా సాగాలి. వివేకంతో వెళ్లాలి. లేకపోతే ఒడ్డున కట్టిన పడవకు తెడ్డు వేసినట్లే ఉన్నచోటునే ఉండిపోతాడు. మనిషి సాగాలి... భగవంతుడి వైపు. నిత్య సత్య స్వరూపుడైన భగవంతుడి వైపు. అందుకు నిత్యానిత్య వస్తు వివేకం ఉండాలి. అలా ఉన్నవాడే సాగగలడు. అది ఉన్నవాడే వైరాగ్యవంతుడు... అనంతాన్ని ఔపోసన పట్టినవాడు!

- చక్కిలం విజయలక్ష్మి 

ᐅతొందరపాటు



ᐅతొందరపాటు 

నిదానమే ప్రధానమని చెప్పినవారే ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమయ్యే ప్రమాదం ఉందన్నారు. అంటే త్వరగా పనులు చక్కబెట్టుకోవాలని భావం. త్వరత్వరగా చేసేపనిలో విజ్ఞత, నైపుణ్యం కొరవడే అవకాశం ఉంది. ఇక తొందరపడి మాటజారితే అంతే! వెనక్కి తీసుకోలేం! ఆకలి వేస్తోందని చెట్టుపిందెలు కోసుకుంటే అవి తినటానికి పనికిరావు. వేగిరపాటుతో పనిచేసి తరవాత బాధపడితే లాభంలేదంటారు విజ్ఞులు. ఆత్రంగా చేసే భోజనం అనారోగ్యానికి కారణమవుతుందంటారు వైద్యులు. వేగిరపు ఆలోచనల్లో పరిపూర్ణత ఉండదు. నలుగురి ఆమోదం పొందాలంటే సమయం తీసుకుని నిర్ణయాలు చేయవలసి ఉంటుంది.
ప్రాకృతికమైన సమస్యల పరిష్కారంలో వేచిచూసే ధోరణి అవలంబించవచ్చునేమోగానీ, ఆధ్యాత్మిక జీవితంలో ఈ అంశానికి సంబంధించి భిన్నమైన కోణముంది. సాధకులు మలిప్రాయం దాకా ఆగకుండా చిన్న వయసునుంచే ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవాలని విజ్ఞులు సూచిస్తారు. అతివేగం, అవివేకాలే అన్ని ఆపదలకు మూలమనీ, ముందువెనకలు ఆలోచించి పనిచేసేవారినే విజయలక్ష్మి వరిస్తుందనీ భారవి చెబుతారు.

అనాలోచితమైన, తొందరపాటుతో కూడిన విపరీత ధోరణి మహాభారతకావ్యం ఆదిపర్వంలో గాంధారి పాత్రద్వారా వ్యక్తమవుతుంది. గాంధారదేశాధీశుడైన సుబలుడి తనయ గాంధారి. భర్త ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డివాడు కనుక ఆయన చూడలేని లోకాన్ని తాను చూడకుండా కళ్లకు గంతలు కట్టుకొని కడదాకా జీవించిన పతివ్రత, ధీరవనిత గాంధారి. తన నూరుగురు కుమారులు కురుక్షేత్ర మహాసంగ్రామంలో మృతిచెందటంలో శ్రీకృష్ణుడి పాత్ర ఎంతో ఉందని భావించి, యాదవ కుల వినాశాన్ని కోరుతూ శ్రీకృష్ణుడంతటి వాడిని శపించిన మహిళ గాంధారి. సంతానం విషయంలో తోడికోడలు కుంతితో పోటీపడిన ఆమె కుంతికి తొలిబిడ్డడు (ధర్మరాజు) పుట్టినప్పుడు, తన చూలు సాఫల్యం కాలేదని భావించి తొందరపడి చేసిన అనాలోచిత చర్య ఓ వింత పరిస్థితికి దారితీసింది. వ్యాసుడంతటి మహనీయుడి అండ ఉంది కాబట్టి, ఆమె తన తొందరపాటు తాలూకు దుష్ప్రభావాన్నుంచి విజయవంతంగా బయటపడగలిగింది.

ఒకానొక శాపభయం కారణంగా పాండురాజు సంతానం కోసం తన భార్యలతో సంగమించలేకపోతాడు. సంతానంలేదని చింతిస్తున్న పాండురాజు అనుమతి మేరకు దూర్వాసుడిచ్చిన మంత్రప్రభావంతో గర్భం ధరిస్తుంది కుంతి. ఒకమంచి ముహుర్తంలో కుమారుని కంటుంది. అతడే ధర్మరాజు. కుంతి అదృష్టానికి అసూయ చెందిన గాంధారి, వ్యాసమహర్షి వర ప్రభావంతో తానూ గర్భం ధరిస్తుంది. ఏడాది గడిచినా కాన్పు కాకపోవడంతో ఆమె కాలహరణ భరించలేక గర్భాన్ని చేత్తో తాడనం చేసుకుంటుంది. ఖండమై పిండం నేలపై పడుతుంది. వ్యాసుడు ఆ పిండాన్ని సంరక్షించి దాన్ని నూటఒక్క భాగాలుగా విభజిస్తాడు. నేయినింపిన కుండల్లో వాటిని భద్రపరుస్తాడు. తనసూచన ప్రకారం వాటిని సంరక్షిస్తూ పరిపోషణ చెయ్యమంటాడు. అలా నేతికడవల్లో ఊపిరి పోసుకున్నవారే దుర్యోధనాదులు నూరుగురు, వారి సోదరి దుస్సల.

మానవులు క్లిష్ట సమయాల్లోనూ తొందరపాటు చర్యలకు ఉపక్రమించకూడదని గాంధారి తొందరపాటును వ్యాసుడంతటి వాడు సరిదిద్దటం వల్ల ఆమె సంతానం నిలబడిందనీ, సామాన్యులు ఆమెలా ప్రవర్తిస్తే విపరీత పరిణామాలు తప్పవన్న గొప్ప సందేశాన్ని మహాభారతం మానవాళికి అందిస్తుంది.

తొందరపాటు లేని, విచక్షణతో వివేకంతో కూడిన కార్యాచరణవల్ల అటు వ్యక్తికి, ఇటు సమాజానికి హితం కలుగుతుందని ధర్మశాస్త్రాలు తెలియజెబుతున్నాయి.

- గోపాలుని రఘుపతిరావు

ᐅయాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు



ᐅయాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు 


వివిధ దైవ క్షేత్రాల్లో కాలోత్సవాలు నిర్వహించే పద్ధతిని వైఖానస మహర్షి మరీచి సూచించాడంటారు. కాలోత్సవాల్లో బ్రహ్మోత్సవం అతి ప్రధానమైన ఉత్సవం. లోక శాంతికోసం బ్రహ్మోత్సవాలను తొమ్మిదిరోజులపాటు నిర్వహిస్తారు. ఆలయాల్లో ధ్రువమూర్తిని అనుసరించి బ్రహ్మోత్సవ కాలాన్ని పరమాత్మికోపనిషత్తు సూచిస్తోంది. యాదగిరిగుట్టపై వెలసిన లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ శుద్ధ తదియ నుంచి ప్రారంభం అవుతున్నాయి.
కోరికలతో కొందరు, భక్తితో మరికొందరు దైవదర్శనం చేసుకొంటారు. తెలిసో తెలియకో తాము చేసిన పాప ప్రక్షాళన కోసం మరెందరో క్షేత్రయాత్రలు చేస్తారు. భక్తుల కోరికలను తీర్చే భారం క్షేత్ర పాలకుడిదేనని పాంచరాత్రాగమంలో ఉంది. యాత్రికుల పాప ప్రక్షాళన తరవాత ఆ పాపాలను క్షేత్రపాలకుడే మోస్తాడని వరాహపురాణం చెబుతోంది. క్షేత్ర పాలకుడి పాపభారాన్ని తొలగించేందుకు బ్రహ్మ తానే కర్తగా క్షేత్రాల్లో ఉత్సవం నిర్వహించి పవిత్రం చేస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఇలా ప్రతియేటా బ్రహ్మ స్వయంగా నిర్వహిస్తాడని విశ్వసించే ఉత్సవాన్నే బ్రహ్మోత్సవం అంటారు. ఏ క్షేత్రంలో బ్రహ్మోత్సవం జరుగుతున్నా తొమ్మిదిరోజులు బ్రహ్మ సత్యలోకాన్ని విడిచి ఆ క్షేత్రంలోనే ఉంటాడని ప్రతీతి. అందుకే బ్రహ్మోత్సవాల సమయంలో వూరేగింపు రథంపై ఉత్సవమూర్తుల ముందు సముచిత ఆసనాన్ని ఖాళీగా ఉంచుతారు. ఆ ఆసనంలో స్వయానా విరించి ఆసీనుడై ఉత్సవాలను పర్యవేక్షిస్తాడన్నది నమ్మకం.

యాదగిరిగుట్టలో క్షేత్ర పాలకుడు హనుమంతుడు. ఆయన ఆహ్వానంపై కోదండపాణిగా తొమ్మిది రోజులూ రామభద్రుడు ఇక్కడే ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో ఇదొక ప్రత్యేకత. బ్రహ్మోత్సవ కాలంలో యాదగిరిగుట్ట పరిసర జనపదాల్లో ఇంటింటా తొమ్మిదిరోజులు పండుగ చేసుకోవడం పూర్వకాలంనుంచీ వస్తున్న ఆచారం. అంకురార్పణతో ప్రారంభమయ్యే ఉత్సవాలు తొమ్మిదోరోజు క్షేత్రంలోని పుష్కరిణిలో ఉత్సవమూర్తుల అవభృత స్నానంతో ముగుస్తాయి. మనరాష్ట్రంలో నృసింహుని ఆలయాలు చాలా ఉన్నాయి. అందులో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు సింహాచలం, అహోబిలం, యాదగిరిగుట్ట! యాదగిరిగుట్టలో నరమృగ శరీరధారి గుట్టలోని గుహలో తేజోవంతుడై వెలశాడంటారు. ఈ దైవం ఒక గుహలో స్వయంభువుగా ఉండటం ఈ క్షేత్రవిశేషం! ఎంతటివారైనా ఇక్కడ తల వంచి నరసింహుని దర్శనం చేసుకోవాల్సిందే!

మరెక్కడా లేనివిధంగా యాదగిరిగుట్టలో నరసింహుడు అయిదు రూపాల్లో ఉంటాడని చెబుతారు. జ్వాలానరసింహుడిగా, ఉగ్రనరసింహుడిగా, యోగ నరసింహుడిగా, గండభేరుండ నరసింహుడిగా, ధ్యాన నరసింహుడిగా ఈ క్షేత్రంలో ఉంటాడన్నది స్థలపురాణం. శ్రీలక్ష్మి నృసింహుడి అంకంపై కూర్చొని ఉన్న కారణంగా ఈ దైవాన్ని లక్ష్మీనరసింహుడిగా కొలుస్తారు. రుష్యశృంగుని కుమారుడు యాదర్షి ఈ కొండ గుహలో నరసింహస్వామి దర్శనంకోసం తపస్సు చేశాడని అంటారు. తపస్సుకు ఈ కొండ అత్యంత పవిత్రమైందని యాదర్షికి హనుమంతుడు సూచించాడని, ఇక్కడే యాదర్షి త్రేతాయుగం చివర్లో నలభైవేల సంవత్సరాలు నరమృగ శరీరునికోసం తపస్సు చేశాడని పురాణాల్లో ఉంది. గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణంలోనూ ఈ ప్రస్తావన కనిపిస్తుంది. శ్రీరాముడు కిష్కింధకు వెళ్తూ యాదగిరిపై ఒక రాత్రి నివసించాడట. పాండవులు తమ వనవాసకాలంలోనూ ఈ ప్రాంతంలో సంచరించారని నమ్ముతారు.

యాదర్షి తపస్సుకు మెచ్చి నరసింహుడు తొలుత తన నిజరూపంలో దర్శనమిచ్చాడంటారు. అలాంటి ఉగ్రనరమృగ శరీరుని చూడతరంకాక ప్రసన్నరూపంలో శ్రీలక్ష్మీ సమేతుడై దర్శనమివ్వమని ప్రార్థించాడు. మహర్షి కోరికను మన్నించి యాదర్షి తపస్సు చేసిన గుహలోనే లక్ష్మీసమేత యోగనరసింహుడిగా దర్శనమిచ్చాడని చెబుతారు. రుషి దైవాన్ని వేడుకొని ఆ గుహలోనే ప్రళయాంతం వరకూ భక్తుల కామ్యాలను తీరుస్తుండాలని అడిగాడని, దైవం అలా వెలసి భక్తుల కొంగుబంగారంగా యాదగిరిగుట్టలో ఉన్నాడనీ ఎందరో నమ్ముతారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఉత్సవమూర్తుల వూరేగింపులు, ప్రత్యేకపూజలు, రంగురంగుల దీపాలంకరణలతో యాదగిరిగుట్ట వైభవంగా భాసిస్తుంది.

- అప్పరుసు రమాకాంతరావు 

ᐅవెలుగు



ᐅవెలుగు 

మొక్కలు ఆరోగ్యంగా, బలంగా ఎదిగేందుకు కర్షకుడు ఏకదీక్షగా ఎంతో శ్రమిస్తాడు. ఎరువు వేస్తాడు. నీరు పోస్తాడు. కలుపు మొక్కలు ఏరివేస్తాడు. ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు కృషి సల్పుతాడు. ఇన్ని చేస్తేనే పంట చేతికి వచ్చేది.
మొక్క ఎదుగుదలకే అంత జాగ్రత్త ఉంటే, విలువైన మానవ జీవితాలకు మరెంతో జాగ్రత్త అవసరమన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. జీవనయానంలోని బాహ్య చర్యలన్నీ అంతర్గత ప్రవర్తనతో ముడివడి ఉండేవే.

అంతర్గత ప్రవర్తనలకు కేంద్రం మనసే. మనసు దృగ్గోచరం కాని ఓ మహాక్షేత్రం. సద్భావనలనే బీజాలు నాటితేనే పవిత్ర క్షేత్రంగా రూపుదిద్దుకొంటుంది. శక్తిపీఠంలా విరాజిల్లుతుంది. ప్రతిబంధకాలను, కష్టనష్టాలను, కాలుష్యాలను, వైకల్యాలను దరిచేరనీయదు. కాబట్టి మనసుకు శుద్ధ తత్వాన్ని కలిగించే సాధన దిశగా సాగాలి సాధకుడు.

రామకృష్ణులంటారు- 'ఈ శుద్ధమైన మనసు నాకు ఓ దివ్య పురుషునిలా గోచరిస్తుంది. ఆ పురుషుడు సూక్ష్మరూపంలో ఎక్కడికైనా ప్రయాణం చేస్తాడు. నాలో ఉండే మరో నల్లని ఆకారాన్ని ఎప్పుడూ శూలంతో పొడుస్తూ, నాకు సన్మార్గదర్శిగా ఉంటూనే ఉంటాడు. ఆ సూక్ష్మరూపుడి వల్ల ఏ విషయాన్నైనా అవగతం చేసుకోగలను' అని.

ఆ నల్లని ఆకారమే కామక్రోధాదులు- ఆశా పాశాలు. అటువంటి శుద్ధమైన మనసు పరమ గురువుతో సమానం. ఏది మంచో, ఏది చెడో ఎప్పటికప్పుడు ఎరుకపరుస్తూ, మనసును ఓ స్థిరబిందువు వద్ద నిలకడగా ఉంచుతుంది.

నిజానికి నూరేళ్ల జీవనయానం ఒడుదొడుకుల మయం. ఆశా పాశాలకు ఆలవాలం. ఇంటా, బైటా విరుద్ధ వర్తనలు. శత్రువులు, మిత్రులు, భయాలు, అనుభూతులు, రుగ్మతలు కలగా పులగంగా... ఎన్నో ప్రతికూలతలు!!

వీటితో మనసు రాపిళ్లకు గురవుతూనే ఉంటుంది. సద్గ్రంథ పఠనం, సజ్జన సాంగత్యం ఆత్మశోధనకు దారి తీస్తాయి. నీటిలో పెరిగే తామరకు నీటిబొట్టు సైతం అంటని విధంగా, మనసు విషయ వాంఛలకు లోబడని విధంగా- జీవన యానం సురక్షితంగా కొనసాగించేటట్లు ఆత్మశోధన దారిచూపుతుంది. ఈ ఆత్మశోధనే శుద్ధమైన మనసును పాదుకొనేలా చేస్తుంది. ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తుంది శుద్ధమైన మనసు.

సంయమ స్థితికి ఆలవాలంగా ఉంటుందది. నోటంట వెలువడే ప్రతి పలుకూ అర్థవంతంగా ఉంటుంది. ఆవేశకావేషాలకు తావుండదు. పరిణతి చెందిన ఆలోచనా విధానానికి, సర్వసమత్వ భావనలకు కేంద్రంగానూ ఉంటుంది శుద్ధత చెందిన మనసు. అపకారికి సైతం ఉపకారమే చెయ్యాలన్న గుణం ఉంటుంది.

అప్పుడు భోగంలో ఉన్నా యోగిలా ఉంటాడు మానవుడు. మనసుకు వాసనలేవీ అంటవు. లేమితనం బాధించదు. వ్యామోహాలకు అతీతుడవుతాడు. అందనివాడిగా, అంతుచిక్కనివాడిగా, అందరివాడిగా ద్యోతకమవుతాడు.

జీవితకాలం అంతా మనకు అనుకూలంగా జరిగిపోవాలనుకుంటాం. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగిపోవాలని వాంఛిస్తాం. మనోశుద్ధి గనుక పొందితే ఇది సాధ్యమే. జీవితం ఉన్నది సాధించేటందుకే.

సౌకర్యంగా, సుఖంగా బతికేందుకు సాధకుడిగా అంతరంగ వర్తనకు వెలుగు తెచ్చుకోవాలి. తాను వెలిగిపోవాలి. ఆ వెలుగే సత్యం- శివం- సుందరం.

- దానం శివప్రసాదరావు

ᐅఫాల్గుణం



ᐅఫాల్గుణం 

పుబ్బ, ఉత్తర అనే నక్షత్రాలకే పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి అని నామాంతరాలున్నాయి. వాటిలో ఉత్తర ఫల్గుణి బుద్ధి వికాసాన్ని, ధైర్యస్త్థెర్యాలను, నూతనోత్తేజాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నదని శాస్త్రవచనం. ఈ నక్షత్రంలో జన్మించిన ఇద్దరు ప్రసిద్ధ వ్యక్తులు అర్జునుడు, బృహస్పతి. వీరికి 'ఫాల్గుణభవులు' అని పేరు. అర్జునుడు ధైర్యస్త్థెర్యాలతో 'విజయుడు'గా నిలిచాడు. ఇతడికి 'ఫల్గుణుడు' అనే పేరు ఈ నక్షత్రం వల్లనే ఏర్పడింది. బుద్ధికి ప్రధాన నిర్వచనంగా దేవతల గురువైన బృహస్పతిని చెబుతారు. అంతటి గొప్ప వ్యక్తి జన్మించిన ఉత్తరఫల్గుణి నక్షత్రం పౌర్ణమి నాటి చంద్రునితో కలిసి ఉన్నందువల్ల ఈ మాసానికి 'ఫాల్గుణమాసం' అని పేరువచ్చింది.
వాతావరణ ప్రభావంతో ఆకులన్నీ రాలిపోయి చెట్లు మోడువారి పోయే కాలమిది. ఆశలన్నీ ఆవిరైపోయిన చోటే కొత్త అవకాశం పుడుతుందని నిరూపిస్తూ, కొత్త చిగుళ్ల రూపంలో ఆశలను, ఆత్మస్త్థెర్యాన్ని కలిగిస్తుందీ మాసం. సంవత్సరంలో చివరి రుతువైన శిశిరంలో చివరి మాసమిది. అయినా ఆ అంతం మరో కొత్త సంవత్సరం ఆరంభం కావడానికి నాంది అవుతుంది. శుక్ల పాడ్యమి నుంచి ద్వాదశి వరకు తొలి పన్నెండు రోజులూ లక్ష్మీసహిత నారాయణమూర్తిని పూజించాలని శాస్త్రవచనం. పన్నెండు రోజులూ పన్నెండు నెలలకు ప్రతీక. ఇలా పూజిస్తే సంవత్సరమంతా పూజించిన ఫలితం వస్తుందని నమ్మకం. దీనికి 'పయోవ్రతం' అని పేరు. ఈ పన్నెండు రోజులూ పాలు మాత్రమే నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలని చెబుతారు. ఈ మాసంలో గోదానం, ధాన్యదానం, వస్త్రదానం చేస్తే పుణ్యప్రదమని ధర్మశాస్త్రాలు వివరిస్తున్నాయి.

ఈ మాసంలో ప్రధానంగా పూజించాలని చెప్పే దేవత, వారణాసి(కాశీ)లో వెలసి ఉన్న డుం(ఠి)ఢి 'వినాయకుడు'. ఈయనను ఈ మాసంలో రెండు వేర్వేరు రోజుల్లో పూజిస్తారు. అవి శుక్లపంచమినాడు అవిఘ్నవ్రతం (విఘ్నాలు కలగకుండేటందుకు), శుక్ల చతుర్దశినాడు పుత్ర గణపతివ్రతం (సంతానాన్ని అపేక్షిస్తూ). శుక్లపక్ష ఏకాదశి 'ఆమలక్యైకాదశి' ఆ రోజున ఉసిరి చెట్టును పూజించాలని, ఉసిరిఫలాలను దానం చేయాలని, వాటిని తినాలని పురాణ కథనం. ఉసిరికి ఎన్నో ఔషధగుణాలున్నాయి. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అనేక వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది. అంత గొప్పతనం ఉన్న ఉసిరికి ఈ మాసంలో అంత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం ఉంది. ఆశ్వయుజమాసం (ఆరు నెలల క్రితం)లో పుష్పించే ఈ పంట ఈ ఆరు మాసాల్లో పూర్తి పక్వదశకు వచ్చి సంపూర్ణమైన ఔషధ గుణాలను సంతరించుకుంటుంది. విష్ణు ప్రీతికరమైన ఏకాదశికీ దీనికీ ముడి పెట్టారు పెద్దలు. అదీకాక, ఉసిరిచెట్టును విష్ణురూపంగా భావించడం తెలిసిందే.

శుక్లద్వాదశి: గోవింద ద్వాదశి అని దీనికి మరో పేరు. ఈ రోజు గోవింద నామస్మరణ చేస్తూ గంగానదిలో (కుదరనివారు ఇతర జల వనరుల వద్ద) స్నానం చేయాలని పెద్దలు చెబుతారు. ఇలా చేస్తే ఆరోగ్యప్రదమనీ అంటారు.

పూర్ణిమ: 'మహాఫల్గుణి' అని, 'డోలికా పూర్ణిమ' అని, 'హోలికా పూర్ణిమ' అనే పేర్లున్న రోజు ఇది. లక్ష్మీనారాయణ వ్రతం చేసి స్వామిని వూయలలో ఉంచి వూపుతారు. కాబట్టి దీనికి డోలికా పూర్ణిమ అని పేరు. ఉత్తరాంధ్ర, ఒడిషా ప్రాంతాల్లో ఈ సంప్రదాయం పాటిస్తారు. ఉత్తరహిందూ స్థానంలో రాక్షసపీడ తొలగిపోవడం కోసం 'హోళికా' అనే శక్తిని ఆరాధిస్తారు. ఆ మరునాడు (బహుళ పాడ్యమి) వసంతోత్సవం పేరుతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనందిస్తారు. ఉత్తరాదిన పౌర్ణమి మరునాటి నుంచీ నెల ప్రారంభంగా గణన చేస్తారు కొందరు. ఆ ప్రకారం చూస్తే ఈ రోజునుంచే వారికి వసంత రుతువు ప్రారంభం అయినట్లు లెక్క. దక్షిణాదిన దీనిని 'ఫంగుని' అని పిలుస్తారు. మధుర మీనాక్షిదేవికి, సుందరేశ్వర స్వామికి కల్యాణం జరిగిన రోజుగా ఇది ప్రసిద్ధం. అందుకే ఈ రోజున దక్షిణాది దేవాలయాల్లో కల్యాణవ్రతం జరుపుతారు. కాబట్టి 'కల్యాణపూర్ణిమ' అని వ్యవహరిస్తారు.

బహుళ అష్టమి: సీతాదేవి జన్మదినంగా పేర్కొంటారు. జనక మహారాజుకు భూమి దున్నుతుండగా సీత దొరికిన రోజుగా చెబుతారు.

అమావాస్య: ఈ రోజు సంవత్సరానికి ఆఖరు రోజు. అయినా దీన్ని 'కొత్త అమావాస్య' అని పిలుస్తారు. ఉత్తరాంధ్రలో ఈ రోజునే కొత్త నాగళ్లను ప్రారంభించి 'ఏరువాక' సాగుతారు. కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభించే రోజు కాబట్టి, 'కొత్త అమావాస్య' అని పిలుస్తారు.

ఈ రోజు పితృదేవతలను స్మరిస్తూ తర్పణ, పిండప్రదాన, దానాదులు చేయాలని, అలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని, వంశాభివృద్ధి జరుగుతుందని ఎందరో నమ్ముతారు.

- అయ్యగారి శ్రీనివాసరావు

ᐅనిన్ను నువ్వు తెలుసుకో



ᐅనిన్ను నువ్వు తెలుసుకో! 

'... ఆ సంగతి నువ్వెంత త్వరగా తెలుసుకుంటే నీకంత మంచిది. ఇది నీకు ముఖ్యం. నీకే ఎరుక లేకపోతే జీవితంలో నువ్వెంతో పోగొట్టుకుంటావు. పరిపూర్ణంగా నిన్ను నువ్వు ఎరిగినప్పుడే నీ మనసుకు శాంతి, సుఖం. అప్పుడు ఎలాంటి బాధ, అసంతృప్తి, ఆందోళన, ఒత్తిడి అన్నది నీ దరిచేరవు'- అని ఎవరో ఒకరు జీవితంలో చెప్పే పరిస్థితి ఒక్కోసారి ప్రతి ఒక్కరికీ వస్తూంటుంది.
చిత్రమేమంటే మనం తెలుసుకోవాల్సిన దాని గురించి మనం తగినంత శ్రద్ధ పెట్టం. ఇతరులకు తెలియనివాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తాం, మాట్లాడతాం. పైగా 'వాడేం చేయాలో వాడికి బొత్తిగా తెలియదు. పట్టించుకోడు. ఇంకొకరిమాట వినడు. వింటే వాడికది ఎంత మంచిదో!' అని మన అభిప్రాయాన్ని వెళ్లబుచ్చుతుంటాం.

మనం జీవించే వాతావరణం, చుట్టూ ఉండే మనుషులు, వారితోటి అనుబంధాలు, ఆప్యాయతలు, ఈతి బాధలు, ఒడుదొడుకులు... ఇలాంటి బయటి ప్రపంచ విషయాలు సమాజ జీవిగా మనకు ప్రధానం కావచ్చు. వీటన్నిటికన్న అతి ముఖ్యమైనది, వ్యక్తిగతమైనది మరొకటి ఉంది. అది మన లోపలి ప్రపంచం. మన ఆత్మ. మన జీవిత పరమార్థం. అంతర్యామితో మన అనుబంధం. వీటి గురించీ మనం ఆలోచించాలి కదా!

దేన్ని తెలుసుకోవాలన్నా మన మనసే ఆధారం. చిత్రంగా మన గురించి మనం తెలుసుకోవటానికి అడ్డం వచ్చేదీ మన మనసే! ఇతర విషయాల మీద ఆసక్తి చూపించే మనసు మన గురించి ఆలోచించటానికెందుకో అడుగడుగునా అడ్డం వస్తుంది. బయటి ప్రపంచ విషయాల గురించి గంటలు, రోజులు ఖర్చు పెట్టే మనసు అంతర్ముఖం చేసుకోవటానికి పట్టుమని పది నిమిషాలు కూడా కేటాయించదు. మరునాటికి చూద్దామనుకుంటూ వాయిదాలు వేస్తుంటుంది!

'ఏ విషయమూ ఆలోచించకుండా నీ ఊపిరిమీద నీ దృష్టిని అరవై నిమిషాలసేపు పెట్టగలిగితే నీకు ముక్తి లభించినట్టే!' అన్నాడు బుద్ధ భగవానుడు. అరవై నిమిషాల మాట అటుంచి- సామాన్య మానవులకు ఆరు నిమిషాలు కూడా సాధ్యం కాదు. అది సాధ్యం కావాలంటే ఎంతో సాధన కావాలి. ముందొక చోట నిశ్చలంగా కూర్చోగలగాలి. కళ్లు మూసుకొని ఊపిరి మీదనే మనసు లగ్నం చేయాలి. లోలోపలికి దూసుకు వచ్చే ఆలోచనల్ని అడ్డగించాలి. క్రమక్రమంగా ఆ మనసులో ఆలోచనల రద్దీని తగ్గించుకోగలగాలి. బయటి విషయాలతో బంధనాలు ఒక్కటొక్కటీ తెంచుకుంటూపోతే గాని మనసు విశాలం కాదు. అక్కడ వెలగాల్సిన అసలు దీపం వెలగదు!

ఒక్క రోజులో పది గంటలు శారీరక వ్యాయామం చేసి ఎవడూ కండలు పెంచి వస్తాదు కాలేడు. దానికి ఎన్నో ఏళ్ల నిరంతర అభ్యాసం కావాలి. అలాగే కొన్ని గంటలసేపు ధ్యానం చేయాలని తికమక పడుతూ గమ్యం సాధించాలనుకోవటం వృథా ప్రయాస. మొదట రెండు మూడు నిమిషాలతో ప్రారంభించి క్రమక్రమంగా సమయాన్ని పెంచుకుంటూపోవాలి. అనాదికాలం నుంచీ మన రుషులు, మునులు, సాధువులు, సిద్ధపురుషులు... అంతా అదే చేశారు. నిరంతర సాధనతో తమ జీవితాలకు ధన్యత చేకూర్చుకున్నారు!

- తటవర్తి రామచంద్రరావు

ᐅమహాశివరాత్రి



ᐅమహాశివరాత్రి 

దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలుకుతూ ఉండగా అందులోంచి ముందుగా హాలాహలం పుట్టింది. లోకాలను దహించటానికి ఆ విషాగ్ని కీలలు భుగభుగలాడుతూ చెలరేగుతూ ఉంటే, మంధరపర్వతం కవ్వంగా వాసుకి సర్పం తాడుగా సాగుతున్న అమృత మథనం ఆగిపోయింది. విషవిలయం ఆపటానికి విలయనేత్రుడు శివుడే స్వయంగా పూనుకొన్నాడు. విషపు మంటలను గుటుక్కున మింగి గరళకంఠుడయ్యాడు పరమశివుడు. ఆయన బాధను పంచుకోవటానికి, దేవ మానవ రాక్షసగణాలన్నీ జాగరణ పాటించి నీలకంఠుడికి సపర్యలు చేసిన రాత్రి 'మహాశివరాత్రి'గా ప్రసిద్ధమైంది. అన్ని శివాలయాల్లో కోలాహలంగా నాలుగు యామాలపాటు శివుడికి అభిషేకాలు, పూజలు, భజనలు చేయటం ఒక్క మతపరమైన సంప్రదాయం కాదు. 'సహ-అనుభూతి' ఒక సామాజిక ప్రక్రియ అని తెలియజేయటానికి శివరాత్రి చక్కని ఉదాహరణ. దీన్ని పౌరాణిక గాథగా కొట్టి వేయటానికి, మూఢాచారంగా ముద్రవేయటానికి వీలులేదు. పురాణం- వేదం తాలూకు వివర్తరూపం. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని వ్యంజింపచేయటానికి ద్రష్టలైన రుషీశ్వరులు సృష్టించిన దివ్యకథాకదంబం. మహాశివరాత్రి ఏడాదికొకసారే. మాసశివరాత్రి ప్రతినెలా ఎందరికో మార్గదర్శనం చేయిస్తుంది. ఈ శివరాత్రిని జ్ఞాన, ధ్యాన, కార్మిక శివరాత్రులుగా పాటించవలసిన అవసరం ఏమిటో తెలుసుకోవాలి. అంతకన్నా ముందు, అందులోని అంతరార్థం గ్రహించటం సమంజసం.
మంగళకరమైన శివశబ్దానికి అజ్ఞానానికి సంకేతం అయిన రాత్రికి లంకె ఏమిటి? ఈ ప్రశ్నకు తొలుత సమాధానం చెప్పుకోవాలి. భగవద్గీతలో స్థితప్రజ్ఞుడైన యోగి లక్షణాలను అర్జునుడికి తెలియజేస్తూ, కృష్ణపరమాత్మ చెప్పిన ముఖ్యమైన శ్లోకం గుర్తుచేసుకుంటే ఈ చిక్కుముడి విడిపోతుంది. తమో జీవులన్నింటికీ ఏది రాత్రో, జ్ఞాని అయిన యోగికి అది పగలు. అజ్ఞాన జీవులు మేలుకుని ఉండే సమయం ఆ జ్ఞానికి రాత్రితో సమానం. ఇప్పుడు శివరాత్రికి సరైన నిర్వచనం తేటతెల్లమైంది. క్షణికం, అశాశ్వతమైన ఇంద్రియ సుఖాల కోసం పాకులాడుతూ, ఆది ఆత్మస్థితికి దూరమైన మనం శివజ్ఞానులమై నిరంతరం పరమాత్మను ధ్యానిస్తూ, నిస్వార్థ క్రియా యోగులుగా మారటమే జీవిత ధ్యేయం.

మానవుడు కర్మజీవి కాబట్టి క్షణం కూడా ఏదో ఒక పని- శారీరకంగా కాకపోయినా మానసికంగానైనా చేయకతప్పదు. ఈ మనిషి జన్మ- కర్మ జనితమే కాబట్టి, అవతారపురుషుడు కృష్ణుడు తానూ కర్మ చేయకతప్పటం లేదని అర్జునుడికి చెప్పిన విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి. కర్మ చేయటం ఎలాగూ తప్పదు కాబట్టి, నిరంతర స్మరణ చేస్తూ కర్తవ్యకర్మను దైవకార్యంగా నిర్వర్తించాలి. ఇదే కార్మిక శివరాత్రి. ఈ విధంగా జ్ఞానభక్తి, కర్మ మార్గాల ద్వారా పరతత్వాన్ని గ్రహించటానికి శివరాత్రి అద్భుతమైన అవకాశాన్ని సందేశాత్మకంగా అందజేస్తున్నది.

- ఉప్పు రాఘవేంద్రరావు

ᐅపరమహంస



ᐅపరమహంస 

'ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి. ఒకటి వేసిన తరవాత సున్నాలు చేరిస్తే వందలు వేలు అవుతాయి. కాని ఒకటి చెరిపితే వాటన్నింటికీ విలువే ఉండదు. ఒకటి ఉండటంవల్లనే సున్నాలకు విలువచ్చింది. మొదట ఒకటి. తరవాత అనేకం. మొదట దైవం. తరవాతే జీవులు, జగత్తు' అంటారు రామకృష్ణ పరమహంస. 'ఆకాశంలో రాత్రిపూట నక్షత్రాలు కనిపిస్తాయి. సూర్యోదయమయ్యాక కనిపించవు. అందువల్ల పగటిపూట ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్పగలవా? నీ అజ్ఞానస్థితిలో భగవంతుని చూడలేకపోయినంత మాత్రాన భగవంతుడు లేడని చెప్పవద్దు' అంటారాయన.
రామకృష్ణులు అన్ని రకాల మత సాధనాలనూ అనుష్ఠించారు. 'ముసల్మాన్, క్రైస్తవం, శాక్తం, వేదాంత... వీటన్నిటిగుండా ఆ ఒక్కడే కనబడ్డాడు... అన్నీ వేరుపేరు బాటల గుండా ఆ ఒక్కని దగ్గరకే వస్తున్నాయి' అన్న గొప్ప సమన్వయవాది రామకృష్ణ పరమహంస.

రామకృష్ణ పరమహంస ఆధునిక అవతారపురుషుల్లో ఒకరు. అవతారం అనేది భగవంతుని దివ్య కరుణకు ప్రత్యేక రూపం. మానవ జాతికే ధర్మమార్గాన్ని చూపించడానికే భగవంతుడు అప్పుడప్పుడూ అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మికతగల మానవరూపంలో అవతరిస్తుంటాడంటారు. వివిధ కాలాల్లో మానవులకు నూతన ఆధ్యాత్మిక మార్గాలు చూపించే గొప్ప మత ప్రవక్తలందరూ అటువంటి దివ్య విభూతులు. రామకృష్ణుల దివ్యావతరణం 1836, ఫిబ్రవరి 19. ఆయన తొలి పేరు గదాధరుడు. పొట్టకూటి విద్యలను తిరస్కరించారు. ఆధ్యాత్మికత, భావావేశం, తీవ్రమైన భక్తి భావన ఆయనలో బాల్యంనుంచీ కనిపించిన లక్షణాలు. అమ్మవారి ఆలయంలో అర్చకత్వం గదాధరుని జీవితంలో మలుపు. నిశ్చింతతో, హాయిగా ఉండే ఆయన స్వభావం గంభీరంగాను, ఆత్మావలోకన స్థితిగాను మారిపోయింది. యాంత్రికంగా పూజలు నిర్వహించే మామూలు అర్చకులకు భిన్నంగా పూజానంతరం భక్త్యావేశంతో దేవీగానం చేస్తూ ఉత్తేజకరమైన పాటలు గంటల తరబడి పాడుతూ ఉండేవారు.

రామకృష్ణుని దృష్టిలో దేవత విగ్రహానికి దేవత స్వరూపానికి భేదం లేదు. ఆకాశంలో ఎగిరే పక్షుల గుంపును చూసినంత మాత్రానే కాదు, ఇలా ఏ చిన్న ప్రేరణకైనా ఆయన సమాధి స్థితిలోకే వెళ్ళిపోయేవారు. ఆయన గురుముఖతా నేర్చుకున్నది తక్కువే. ఆయన బోధనల్లో అపారమైన జ్ఞానం వ్యక్తమయ్యేది. ఆయన మాటల ద్వారా కంటే జీవితం ద్వారానే ఎక్కువ బోధించారు. భగవంతుడి లీలామానుష స్వరూపమైన సమస్త జగత్తును, సర్వ జీవరాశినీ అమితంగా ప్రేమించారు. ఆయనది మాతృహృదయం. కరుణాంతరంగం. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను, సందేహాలను అందరికీ అనుభవంలోకి వచ్చే రీతిలో చిన్నచిన్న కథల రూపంలో నివృత్తి చేస్తుండేవారు.

రామకృష్ణులకు కామకాంచనాల స్పృహలేదు. భార్యను జగన్మాత స్వరూపంగా ఎంచేవారు. సాధన దశలో ఒక చేత్తో మట్టిని, రెండో చేతితో కనకాన్ని పట్టుకొని రెంటినీ అనేకసార్లు పలికించి మట్టిని కనకమని, కనకం మట్టి అని వచించి భేదబుద్ధి నాశనం చేసి రెండింటినీ గంగలో పారేశారు. అహంకార నిర్మూలన నిమిత్తం ఆయన అవలంబించిన సాధనలు అపూర్వమైనవి. మరుగుదొడ్లను పరిశుభ్రం చేసేవారు.

'నేను' అనేది అజ్ఞానానికే చిహ్నం అనేవారాయన. ఈ నేను సత్యాన్ని కప్పేస్తుంది. మనిషికి దైవానికి మధ్య అడ్డుగోడలా నిలుస్తుంది. అనంతుడైన భగవంతుడికి ఒక పరిమితిని ఆపాదిస్తుంది. అందుకే 'నేను' తొలగిపోయి 'నీవు' అనేదానికి చోటుఇవ్వాలి అని ప్రబోధించేవారు పరమహంస. పచ్చి కుండ పగిలిపోతే ఆ మట్టి మళ్ళీ పిసికి కొత్త కుండ తయారుచేస్తాడు కుమ్మరి. కాల్చిన కుండ పగిలిపోతే దాన్ని ఇక ఉపయోగించడు. అదే విధంగా అజ్ఞానంలో మరణించినవాడు మళ్లీ జన్మిస్తాడు. కానీ జ్ఞానాగ్నిలో బాగా కాలినవాడు సిద్ధుడిగా మరణించి మళ్ళీ జన్మించడు అని జ్ఞానతత్వాన్ని ఆవిష్కరించారు.

పసిపిల్లలవలె వినిర్మల హృదయంగల రామకృష్ణులది గొప్ప సత్యనిష్ఠ. లోకంపట్ల ఆయనకున్న ప్రేమ గొప్పది. లోకానికి ఒక శరణ్యం చూపాలని తహతహలాడేవారు. లోకాలు ఎలా నడుచుకుంటే తమ మంచికి, ఇతరుల మంచికి సాధనభూతులవుతారో, దుఃఖితులను ఎలా ఆదరించాలో లోకానికి ఉద్బోధించాల్సిన గొప్ప భారాన్ని, కర్తవ్యాన్ని ఆయన వివేకానంద స్వామికి అప్పగించారు. 1886 ఆగస్టు 16న ఆయన మహాసమాధి చెందారు.

- డాక్టర్ డి.వి.సూర్యారావు

ᐅపరిపూర్ణత



ᐅపరిపూర్ణత 

ఆలోచనలు లేకుండా మనసు ఉండదు. మనసు పరిపూర్ణత సంతరించుకోవాలంటే ఆలోచనల్లో వూగిసలాట ఉండరాదు. స్థిరత్వం ఉండాలి. పరిపక్వత ఉండాలి. 
సజావైన ఆలోచనలున్న మనసు శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకోగలుగుతుంది. కించిత్తు అనారోగ్యాన్నీ తొంగిచూడనివ్వదు. కేవలం తనలోని పరిపూర్ణతనే కాదు... శరీరంలోని ప్రతి అవయవంలోని పరిపూర్ణతనీ శాసించగల శక్తి ఆ మనసుకు ఉంటుంది. అందుకే, ఆరోగ్యమైన మనసున్న వ్యక్తి... శారీరకంగానూ పూర్ణారోగ్యంతో ఉన్నానని పదేపదే తనకు తాను చెప్పుకొంటాడు!
తప్పిజారి... ఆలోచనల్లో అస్థిరత ప్రవేశిస్తే చాలు... అది మనసును కలచివేయటమే కాదు- శరీరంలో ఏదో ఒక బలహీనమైన చోట వెనువెంటనే రోగలక్షణానికి అంకురారోపణ చేస్తుంది. అపరిపక్వమైన ఆలోచనలే అన్ని రోగాలకీ మూలకారణం. అందులో వ్యతిరేకమైన (నెగెటివ్) ఆలోచనలు మనసులో ప్రవేశించాలేకాని, రోగ తీవ్రత పెరిగిపోవటానికది ఆస్కారమవుతుంది. అంటే, ఒకవిధంగా చేజేతులా మన అనారోగ్యాన్ని మనమే తెచ్చుకున్నవాళ్లమవుతాం. అప్పుడు మనసును కూడదీసుకోవాలి. అటు ఇటు పరుగెత్తే ఆలోచనల్ని కట్టడి చేయాలి. 'ఇదేమిటి? ఒక్కసారిగా నామీద నాకు పట్టు ఎలా తప్పిపోయింది? నేను పరిపూర్ణుడినే! అలా ఎలా నా సామర్థ్యాన్ని చేజార్చుకున్నాను? నేను నేనుగానే ఉండాలి! మళ్ళీ మామూలు మనిషినైపోవాలి' అని మనసును సమాధానపరచుకోవాలి. ఇది చాలావరకు ధ్యాన సాధనతో సానుకూలపడుతుంది. ఎవరికి వారు మనోధైర్యంతో యథాస్థితికి రావాల్సిందేకాని... ఇంకొకరు చేయగలిగేదేమీ ఉండదు.

ఒక్కొక్కప్పుడు వాతావరణ కాలుష్యంవల్ల, మార్పువల్ల, వయోభారంవల్ల అనుకున్నంత త్వరగా శరీరారోగ్యం చక్కబడకపోవచ్చు. అటువంటప్పుడు రోగిని పలకరించి సానుభూతి చూపించే బంధుమిత్రులు సర్వసాధారణంగా ఒక తప్పు చేస్తుంటారు. ఆ రోగి అస్వస్థత గురించి మరింత లోతుగా కూపీ తీస్తారు. చర్చిస్తారు. పదేపదే అడిగినదాన్నే అడుగుతుంటారు. ఒక్కోసారి ఇలాకాక మరోలా వైద్యం చేయాల్సిందని ఉచిత సలహాలిస్తుంటారు. ఇతరుల రోగలక్షణాలతో పోల్చి మరింతగా భయపెడుతుంటారు. దీనివల్ల ఆ రోగికి సాంత్వన కలగకపోగా, మరింత అపకారం జరుగుతుంది. అతనికి ఉన్న సహజమైన మానసిక శక్తీ హరించిపోతుంది. తానింక ఎప్పటికీ ఆరోగ్యం పుంజుకోలేనేమో అన్న అధైర్యం కుంగదీస్తుంది.

అందుకనే, వివేకవంతులు రోగి అనారోగ్యం గురించి ముక్తసరిగా మూడుముక్కలు మాట్లాడి విషయాన్ని మరోవైపు మళ్ళించాలి. త్వరలోనే అంతా సవ్యంగా అయిపోతుందని రోగికి అనిపించేలా ధైర్యం చెప్పాలి. ఇంకెవరెవరో ఎంత త్వరగా కోలుకుని పూర్ణారోగ్యవంతులైనారో సోదాహరణగా చెప్పాలి. అసలా రోగమంత చిన్నవిషయం ప్రపంచంలో మరొకటి లేదన్నంతగా తేలిగ్గా మాట్లాడాలి. అసలు ప్రస్తావననే మార్చి ఆ రోగిని మరిపించాలి. సరదా సంగతులతో మురిపించాలి.

పరిపక్వత కలిగిన వ్యక్తులు తమ పూర్ణారోగ్యాన్ని కాపాడుకోవటమే కాదు, ఇతరుల అనారోగ్యాన్నీ దూరం చేయగలుగుతారు. దానికి మానసిక దృఢత్వం, చక్కని ఆలోచనాసరళి, క్రమశిక్షణతోకూడిన జీవితం ఎంతో అవసరం. వాళ్లే పరిపూర్ణులు!

- విమలారామం

ᐅక్షమాగుణం



ᐅక్షమాగుణం 

మనం ఒక్కొక్కప్పుడు అవమానానికి గురైనప్పుడు అవతలి వ్యక్తిమీద ఎలా కక్ష తీర్చుకోవాలా అనే ఆలోచనతో బాధపడతాం. పందులు మురుగు కాల్వల్లో పొర్లి పొర్లి వాటి ఒంటిమీద తీట పోగొట్టుకుంటున్నట్లు మనం పొర్లి పొర్లి బాధపడకూడదు. అలా దొర్లడం పశువుల లక్షణం. జంతు ప్రదర్శనశాలలో ఖడ్గమృగం బురదగుమ్మిలో పొర్లి పొర్లి దొర్లుతూంటే చూసిన బాలబాలికలు ఆనందంతో కేరింతలు కొడుతున్నట్లు, మనం అంటే కిట్టనివాళ్లు ఆనందిస్తూ అపహాస్యం చేస్తూంటారు. అలాంటి స్థితిలో మనం కాస్త ఓర్పు వహించాలి. మన బంధుమిత్రుల్లో ఎవరైనా అటువంటి దుర్ఘటనకు లోనైనప్పుడు మనం వారికి ఓదార్చే వాక్యాలు నాలుగు పలకాలి. ఒకవేళ వారు మన దురవస్థను చూసి గతంలో కేరింతలు కొట్టినవారైనా, మనం వారిని ఓదార్చడానికి వెళ్లినప్పుడు వారే సిగ్గుపడి మనల్ని క్షమార్పణ కోరకపోయినా వారంతట వారే పరివర్తన చెందుతారు. తమలో తామే పశ్చాత్తప్తులవుతారు. ఆ విధంగా వారిలో రగులుతున్న ప్రతీకార జ్వాలను చల్లార్చినవారమవుతాం. అప్పుడు వారిలోనూ మనలోనూ సర్దుకుపోయే మనస్తత్వం ఏర్పడుతుంది. రాత్రింబవళ్లు మనలోనూ వారిలోనూ ఏర్పడిన కుమిలి కుమిలి బాధపడే సమస్యకు పరిష్కారం సులభతరమవుతుంది. భక్తుడైన ప్రహ్లాదుడు చెప్పిన మంచి మాటలు తండ్రి అయిన హిరణ్యకశిపుడికి రుచించలేదు. ప్రతీకార జ్వాలలతో కుతకుతలాడిపోయాడు. శరీరంలోని దుష్టాంగాన్ని వైద్యుడు ఖండించినట్లు వీణ్ని ఖండించేయాలనుకున్నాడు. చివరికి ఆ ప్రతీకార జ్వాలల్లోనే నరకేసరిచే హతుడై భస్మీపటలమయ్యాడు. (అతను చనిపోయాక ప్రహ్లాదుడే తండ్రి భౌతిక దేహానికి అంత్యక్రియలు జరపవలసి వచ్చింది.)
క్షమాగుణం అన్నది మార్పు చెందుతున్న సమాజానికి అద్దంపట్టాలి. కొన్ని సమయాల్లో క్షమాగుణం మిక్కిలి విలువైనదిగా తెలుసుకోవాలి. గతంలో మనం తెలిసో తెలియకో చేసిన తప్పుల్ని నెమరువేసుకోవద్దు. అవతలివాళ్ల తప్పుల్ని సైతం ఎత్తిచూపడమూ తగదు. అలా అయితే బాధితులకు ఉక్రోషం తప్పుతుంది. పుండుమీద కారం జల్లకుండా ఉపశమనం కలుగుతుంది. తామూ అటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడతారు. నిజాయతీగా తప్పుల్ని ఒప్పుకొని క్షమార్పణ కోరడం- మన గొప్పదనాన్ని ఇనుమడింపజేస్తుంది. బంగారానికి తావి అబ్బినట్లవుతుంది. అవతలివాళ్లు మనల్ని చూడగానే అప్రయత్నంగానే చేతులెత్తి నమస్కారిస్తారు. అప్పుడే ఎదుటివారిలోనూ పరివర్తన వస్తుంది. ఇంత మహోన్నత వ్యక్తిపై తొందరపడి కక్ష పెంచుకున్నామే అని బాధపడతారు. ఒక సాధువు శిష్యులతో వెళుతుంటే కొందరు వ్యక్తులు ఆ సాధువును అవహేళన చేస్తున్నారు. ఆయన సమాధానం చెప్పక మౌనం వహించాడు. 'అలా వాళ్లు తిడుతూంటే మౌనం వహిస్తారేమిటి స్వామీ?' అన్నారు శిష్యులు. 'ఆ తిట్లు నాకు తగిల్తేకదా బాధపడేది? అవి వారిదగ్గరే ఉండిపోయాయి. లోపలున్న అంతర్యామికి అవి తగలవు' బదులిచ్చారు స్వామీజీ. ఈ చెంపమీద కొడితే ఆ చెంప చూపించమంటాడు ఏసు ప్రభువు. క్షమాగుణం అంటే అలా ఉండాలి.

- బులుసు-జీ-ప్రకాష్

ᐅమధు విషాదం



ᐅమధు విషాదం 

విషాదం కొన్నిసార్లు అందంగా ఉంటుంది. మధురంగా ఉంటుంది. వాల్మీకి విషాదంతోనే మధురమైన రామాయణం ఉద్భవించింది. వ్యాస మహర్షి విషాద భావం కారణంగానే భాగవతం లోకానికి అందింది. అర్జున విషాద యోగమే భగవద్గీతకు నాంది పలికింది. ఇక ప్రేమికుల సంగతి చెప్పనే అక్కర్లేదు. బాధవాళ్లకు మధురంగానే ఉంటుంది. విషాదం బాధే అనుకుంటే ఇక కావలసిందేముంది? బాధే మధురం కదా!
నవ రసాల్లో కారం, చేదు కూడా ఉన్నట్టుగానే మనసు ఉత్పన్నంచేసే భావాల్లో విషాదమూ ఒకటి. తమాషా ఏమిటంటే, మనసు ఉత్పన్నం చేసినా ఆ మనసునే అది బాధలో ముంచెత్తుతుంది. అదే... విషాదంలో! కానీ అసలు విషాదం ఏమిటంటే, విషాదం మనిషికి బాధే. అంటే మనసుకు. నలిబిలి చేసే తీవ్రభావం. అదృష్టం ఏమిటంటే, ఆ విషాదం దాని పుట్టుపూర్వోత్తరాలు మన చేతుల్లోనివే. మనం పెంచి పోషించినవే. అంతకంటే ముఖ్యంగా విషాదం మనం నాటిన విత్తే. పెరిగి పెద్దయి, విస్తృతమై, ఊడలు దిగాక ఏదైనా దాని స్వేచ్ఛ కొద్దీ వెళ్తుందేమోగానీ బీజప్రాయం నుంచి రెక్కలు వచ్చేదాకా మన పెంపకంలోని బిడ్డే. పిల్లలు వారి ప్రవర్తన ద్వారా మనను బాధ పెడుతున్నారంటే, విషాదంలో ముంచేస్తున్నారంటే- ఆ పిల్లలు మనం పెంచినవాళ్లే. మన ప్రవర్తన, మనం కల్పించిన పరిసరాలు, పరిస్థితులు... అన్నీ. చాలా వరకు మన జీవన సరళికి ప్రతిబింబాలు వాళ్ళు. మన గతానికి నకళ్లు వాళ్లు. మన దురాశలకు మిగిలిన నిరాశలు వాళ్ళు. మన విషాదం కూడా అంతే. మనం పెంచి పోషించుకున్నదే. మన గుండెలో పాదుచేసి, కుదురుకట్టి, బీజం వేసుకోగా మొలిచిన పిచ్చిమొక్క. పదేపదే 'నెమరువేత' అనే విషజలంతో పెంచుకుంటున్న విషాద వృక్షం. విషవృక్షం. మనం పెంచుకున్నదే. మనం లాలించుకున్నదే. అది, గుండె తొట్టిలో లాలిపాటతో గోముగా పెరిగిన గారాల శిశువు. దానికి మన జీవితమే బలిపశువు. నిజం... ఇది మనం చేసిన తప్పే.

విషాదం బాధ కాదు. ఒక స్థితి. బాధను స్థిరం చేసే ఒకానొక తీవ్ర భార స్థితి. ఆ స్థితిలోకి మనకు తెలీకుండానే మనమే మనను మనం తోసి వేసుకుంటున్నాం. ఎందుకలా జరగాలి? మనకు ఆలోచన లేదు. మనకు ధైర్యం లేదు. మన మీద మనకు అదుపు లేదు. ఇంద్రియాలు ఎటు వెళ్తే అటు మనసును వెళ్ళనిస్తున్నాం. మనసు ఎటు వెళ్తే అటు ఆశలు పెంచుకుంటున్నాం. నిరాశలకు బీజం వేసుకుంటున్నాం. అదిచ్చే ఫలమే విషాదం. మనసును అదుపు చేసే బుద్ధి మనలోనే ఉంది కదా? మనతోనే ఉంది కదా? మనసు కంటే ఎన్నో రెట్లు బలీయమైన బుద్ధి శక్తిని ఎందుకు నిద్రాణంగా ఉంచేస్తున్నారు? ఎందుకు చైతన్యవంతం చేసుకోలేకపోతున్నాం? ప్రయోజనం పొందలేకపోతున్నాం. పక్వమైన ఫలాన్ని వదిలేసి కసుగాయను కొరుకుతున్నాం! వగరో చేదో కాక మాధుర్యమెలా దక్కుతుంది? రసాస్వాదనమెలా జరుగుతుంది? ఆలోచిద్దాం... అదీ బుద్ధిశక్తితో.. మనకు అర్థమైంది.. విషాదమైనా, వినోదమైనా మన మనసు చేసే కల్పనే అని. ఆ బీజ దశలోనే, ఆ వ్యవసాయ సాగు దశలోనే, ఆ ఎంపిక దశలోనే అప్రమత్తులమై ఉందాం. ఆ అవకాశం మనకుంది. మంచి విత్తులు నాటుకుందాం. మంచి ఆలోచనలను మాత్రమే అనుమతిద్దాం. మనసును మంచి నేస్తంగా మలచుకుందాం. నేస్తం ఎప్పుడూ న్యాయమే చేస్తుంది.

వాతావరణంలోని మార్పులను పక్షులు, జంతువులు ముందుగానే పసిగట్టేస్తాయి. బయటెక్కడో జరిగే వాతావరణ ఉపయోగాలను, ఉపద్రవాలనే మిగిలిన జీవజాలం గుర్తించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకునేటప్పుడు మనలోని, మనమే సృష్టించుకునే ఆలోచనల చిరుగాలుల్ని పసిగట్టి మనం నివారించలేమా? ఎందుకు సుడిగాలిగా మారనిస్తున్నాం? సునామీగా ఎదగనిస్తున్నాం? నిజమే... కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే, మన మనసుతో సంబంధం లేకుండానే బాధలు, వాటి తాలూకు విషాదం మనను చుట్టుముట్టేస్తాయి. దానికి ఆధ్యాత్మిక సాధనల ప్రభావం అడ్డుకట్ట వేస్తుంది. కష్టాలకు కాదు, కన్నీళ్లకు. కష్టాలను రాకుండా ఆపలేమేమో. కానీ కన్నీటిని ఆపగలం. కష్టాలను ఇష్టాలుగా మార్చుకుంటే, విషాదాన్ని వినోదంగా మలచుకుంటే. దానికి ఆధ్యాత్మిక పథమే మంత్రదండం. సానుకూల దృక్పథం, ఏకాత్మతా భావం, శాంతి సహనాలు, భగవత్ సృహ... ఈ అన్నింటి సమాహారమే ఆధ్యాత్మికత. వీటి పరిపోషకత్వానికి మనం శతథా ప్రయత్నించాలి. మనసును మనోహర ఉద్యానవనంగా మలచుకోవాలి. కలుపు మొక్కల్ని పీకేయాలి... కాదు కాదు... అసలు మొలకెత్తనివ్వకూడదు. అప్పుడు విషాదం మధురంగా ఉంటుంది.

- చక్కిలం విజయలక్ష్మి

ᐅప్రత్యామ్నాయం



ᐅప్రత్యామ్నాయం 

కొంతమంది ఎన్నో కలలు కంటారు. కోరికలు పెంచుకుంటారు. కోరిక తీరుతుందని ఆశపడతారు. అది నెరవేరకపోతే నిరాశతో దుఃఖిస్తారు. కుమిలిపోతారు. ఈ పని సమర్థనీయం కాదు. మరికొందరు తమకు అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువునుగాని వ్యక్తినిగాని పోగొట్టుకొన్నప్పుడు ఎంతగానో బాధపడతారు. విరక్తితో జీవితాన్ని అంతం చేసుకోవాలని చూస్తారు. ఈ పనీ ఉచితం కాదు. ఇంకొంతమంది ఉంటారు. తాము కోరుకున్నది లభ్యం కాలేదని నిరాశతో బాధపడరు, జీవితాన్ని అంతమూ చేసుకోరు. తమకు తామే వూరట చెందుతారు. సమాధానపరచుకొంటారు. కోరుకున్నది దొరకనప్పుడు దానికి బదులుగా మరొక వస్తువుతో (ప్రత్యామ్నాయంతో) పని జరుపుకొంటారు. తృప్తిపడతారు. జీవితాన్ని ఆనందంగా గడుపుతారు.
విద్యుద్దీపాలు ఆరిపోతే కొవ్వొత్తిని వెలిగించుకొని చీకటి ఇంట్లో వెలుగును నింపుకొంటున్నాం గదా. మానవుడికి సర్దుబాటుతత్వం ఉండాలేగాని కొవ్వొత్తిలాంటి ప్రత్యామ్నాయాలు నిత్యజీవితంలో ఎన్నో తారసపడుతూ ఉంటాయి.

తన తల్లి రబ్బరుబంతి కొనలేకపోయిందని అక్కడక్కడా పాచిపని చేసుకొని బతుకుతున్న ఒకామె ఏడేళ్ల కొడుకు నెత్తిమొత్తుకొని ఏడ్వనూ లేదు. అలిగి కూర్చోనూ లేదు. పనికిరాని గుడ్డపీలికలను దర్జీవాడి కొట్టునుంచి తెచ్చుకొని గుండ్రంగా చుట్టి బంతిని తయారు చేసుకున్నాడు. దాంతోనే ఆడుకొంటూ ఆనందిస్తున్నాడు. కోరిక నెరవేరకపోతే ఇల్లు వదిలి పారిపోవడమో, తనను తాను అంతం చేసుకోవడమో లేక ఇతరుల్ని చంపడమోలాంటి ఘోరమైన నేరాలు జరుగుతున్న ఈ రోజుల్లో ఆ పిల్లాడిలో ఉన్న సర్దుబాటుతత్వం పెద్దవాళ్లందరికీ గుణపాఠం కావాలి. అందుబాటులో ఉన్నదాంతోనే రాజీపడి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనే సందేశం ఈ పసివాడి గుడ్డబంతిలో ఉంది. రబ్బరు బంతికి ప్రత్యామ్నాయంగా గుడ్డబంతిని ఎంచుకొన్న ఆ పిల్లవాడి మనస్తత్వం సర్వులకూ ఆదర్శప్రాయమే.

ద్రోణాచార్యుల వారివద్ద శిష్యరికం లభించలేదని ఏకలవ్యుడుగాని, కర్ణుడుగాని నిరాశతో కుంగిపోనూలేదు. తమ జీవితాలను అంతం చేసుకోనూ లేదు. ద్రోణుడికి బదులుగా పరశురాముణ్ని గురువుగా చేసుకొని ధనుర్విద్య పొందాడు కర్ణుడు. ద్రోణుడి మట్టి బొమ్మనే గురువుగా భావించుకొని విలువిద్యను అభ్యసించాడు ఏకలవ్యుడు. ఆ ఇరువురూ లోకవిఖ్యాత ధనుర్విద్యా విశారదులయ్యారని భారతం చెబుతోంది.

కోరుకున్నది లభ్యం కానప్పుడు తొందరపాటుతో జీవితాన్ని అంతం చేసుకోకూడదు. నిదానంగా ఆలోచించి ప్రత్యామ్నాయాన్ని వెదుక్కోవాలి. దాంతోనే సంతృప్తి చెందాలి. అప్పుడే జీవితం ఆనందంగా గడచిపోతుంది- అని చెప్పే మన పెద్దల మాటల్ని, పురాణ కథనాలను మనం వినాలి. పాటించాలి. అప్పుడే మాణిక్యాల్లాంటి ఆ మాటల మూటలు మన జీవితాలకు పూలబాటలవుతాయి.

- కాలిపు వీరభద్రుడు

ᐅవిశ్వాసం



ᐅవిశ్వాసం 


భగవంతుడిపట్ల విశ్వాసం ఉన్నప్పుడే ఆయన్ని చేరే దారులు తెలుసుకోగలం. ఆత్మవిశ్వాసం దృఢంగా ఉన్నప్పుడే సాధనా మార్గంలో ముందుకు కదులుతాం. మామూలు జీవితంలానే ఉన్నత శిఖరాలు ఆరోహించడానికి విశ్వాసం తప్పనిసరిగా ఉండాలి. భక్తులకు, సత్పురుషులకు విశ్వాసం ఉచ్ఛ్వాసం వంటిది, నిశ్వాసం వంటిది. నిజానికి విశ్వాసమే వారికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. మనలో మనకు విశ్వాసం లేకపోతే భగవంతుడిలో విశ్వాసం పోగొట్టుకొన్నట్లే.
అనంతమైన ఆశకు పునాది అనంత విశ్వాసమే. అవి రెండూ ఉన్నప్పుడు అనంతమైన ఆకాంక్ష మనలో ప్రదీప్తమవుతుంది. ఎంతో ఆదర్శవంతమైన జీవితానికి ఈ ఆకాంక్ష మూలస్తంభం వంటిది.

ఆత్మవిశ్వాసం లేనివారు ఎప్పుడూ నిరాశానిస్పృహలతో జీవిస్తారు. వారే పనీ చేయలేరు. దేన్నీ సాధించలేరు. వారెప్పుడూ దుఃఖిస్తూనే ఉంటారు. వారి జీవితాలు బాధాగ్ని పుస్తకాలు. అందులో ప్రతి అక్షరం కన్నీటి బిందువే. ఒక్కక్షణం మనలో పూర్ణ విశ్వాసం వికాసం చెందితే నిరంతర స్వేచ్ఛ ఆత్మకు లభించినట్లే. అప్పుడు ఏ బాధలు, ఆందోళన, నైరాశ్యం ఉండవు. విశ్వాస తీరాల్లో దృఢంగా నిలబడగలవారికి విజయం సూర్యకిరీటంలా చేరువవుతుంది. సత్యం కిరణంలా తాకుతుంది. ఆనందం సముద్రమై ముంచెత్తుతుంది. విశ్వాసమే మతం. విశ్వాసానికి మించిన మతంలేదు. విశ్వాసమే దైవం, అదే జీవం. అదే సర్వం. ఆత్మనిశ్శబ్ద కాగితంపై భగవానుడు చేసిన చేవ్రాలు విశ్వాసం. సమస్తాన్ని జయించగల ధీమా ఆత్మకు ఉంది. అది మనలోనే ఉంది!

చీకటి తెరలవెనక దాగిన ఉషస్సు గురించి గానంచేసే విహంగం విశ్వాసం. విశ్వాసం అత్యున్నత స్థాయికి చెందిన జ్ఞాన ప్రకాశం. అది ప్రేమద్వారా, హృదయం ద్వారా ప్రబోధితమవుతుంది. ఈ జ్ఞానాన్ని మనం అపార్థం చేసుకోవడంవల్ల దాన్ని ప్రతిఘటిస్తాం. ఆ వింత పిలుపునకు మనం ప్రతి స్పందించం. విశ్వాసం ముందు హేతువు తలవంచుతుంది. అది అందించే స్వేచ్ఛకు హేతువు విస్తుపోతుంది.

విశ్వాసం మనిషిలో అత్యున్నత భూమికకు చెందిన ఒక దివ్య కాంక్ష. చాలామంది ఆ స్థాయి అందుకోలేరు. ఎవరూకూడా ఆ రేఖ దాటి వెళ్లలేరు. సందేహం ఒక వ్యధ. అది ఏకాంతం. తన కవల సోదరుడైన విశ్వాసాన్ని ఏనాడూ తెలుసుకోలేదు.

మనిషి అంతర్గత జీవితంలో రెండే రెండు విశిష్ట కోణాలున్నాయి. జీవిత పరమార్థం కోసం అన్వేషణ మొదటిది. శాశ్వతమైన దానికోసం గవేషణ రెండోది. ఈ రెండింటి వైపు నడిపేది విశ్వాసమే. విశ్వాసం భగవంతుడితో తీయని, మాయని బాంధవ్యం చివురింపజేస్తుంది. ఎవరికి వారికి తాను ఉత్కృష్ట వ్యక్తిననే భావన కలుగుతుంది.

మనం పరిస్థితుల ఉక్కు చక్రాల కింద పడి నలిగిపోయే కీటకాలు కాము. కీలుబొమ్మలం కాము. పరిస్థితులను ఎదిరించి జీవన గమ్యాన్ని మార్చి నవ్య దివ్య ప్రపంచాన్ని నిర్మించగల స్రష్టలం!

-కె.యజ్ఞన్న 

ᐅధ్యానానందం



ᐅధ్యానానందం 

మనిషికెప్పుడూ ఆనందం కోసమే వెతుకులాట. 
ఆనందం ఏ రూపంలో ఉన్నా అది తన సొంతం కావాలనుకుంటాడు. అభిరుచిని బట్టి ఆనందం ఉంటుంది. 'లోకో భిన్నరుచిః' అన్నారు. ఇక్కడ 'రుచి' అంటే ఆనందానుభూతి కలిగించేది అన్న అర్థం చెప్పుకోవాలి. లోకంలో అందరి రుచులు, అభిరుచులు ఒకేలా ఉండవు. ఎవరి బుద్ధిని బట్టి వారి అభిరుచులుంటాయి.
అనుభవరీత్యా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే- రుచి లేక అభిరుచి ద్వారా లభించే ఆనందం తాత్కాలికమే. ఆహారం తీసుకుంటే ఆకలి తీరుతుంది. మంచినీరు తాగితే దాహం తీరుతుంది. కొంత సమయం గడిచాక మళ్లీ ఆకలి, దాహం వేస్తాయి. తాత్కాలిక ఆనందం పరిస్థితీ ఇదే! కొత్త దుస్తులు, అవి కూడా తమ మనసుకు నచ్చినవి, అలాగే నగలు, పాదరక్షలు, వాహనం... ఇలా మనం నిత్యజీవితంలో మనసుకు ఆహ్లాదం కలిగించేవి సొంతం చేసుకునేందుకు పాటుపడుతూనే ఉంటాం. మోజు తీరగానే, మరో ఆనందం కోసం వెతుకులాట ప్రారంభమవుతుంది. రంగురంగుల సీతాకోకచిలుక ఏ విధంగా అయితే మురిపిస్తూ, చిక్కినట్లే చిక్కి చేజారిపోయి, ఇంకోచోట అందంగా రెక్కలల్లారుస్తుందో- ఆనందమూ అస్థిరంగా ఉంటూ మనల్ని ఊరిస్తూ అందీ అందకుండా వేధిస్తుంటుంది.

ఆనందం స్థిరంగా ఉండాలంటే 'ధ్యానమే మంచి పద్ధతి' అంటారు యోగ పండితులు. 'శ్వాస మీద ధ్యాస' అనే ఉపాయాన్నీ చెబుతారు. చెప్పినంతలో అందరికీ ఇది ఆచరణాత్మకం కావటంలేదు. ఎందుకంటే- అసలు సమస్య ఏకాగ్రత లోపమే. ఏకాగ్రత కోసం ధ్యానం చెయ్యాలంటారు. ధ్యానం చెయ్యాలంటే ఏకాగ్రత కుదరాలి. ఏది ముందు, ఏది వెనక? ఇదే... చాలామంది సమస్య.

ధ్యానానికి మూలసూత్రం దైవం గురించిన భావనల్ని మనసులో ధరించటం. మనం ఎవర్ని ఎక్కువగా ప్రేమిస్తామో, ఎప్పడూ వారి ధ్యాసలోనే ఉంటాం. మనం దైవం గురించి ఆలోచించటంలేదంటే మనకు ఆయన పట్ల తగినంత ప్రేమ లేనట్లేగా!

ప్రేమ కలగాలంటే మనలో ప్రేమించే మనసుండాలి. స్పందనలు, ప్రతిస్పందనలు ఉండాలి. అందంలోనే కాదు- అందంగా ఉండే ప్రకృతిలోని అణువణువులోనూ మనకు నేత్రానందం ప్రాప్తిస్తుంది.

ఇంత అద్భుత ప్రపంచాన్ని సృష్టించి, మనకు కానుక ఇచ్చినది పరమాత్మ అని తెలిశాక మనం ఆయన ఘనతకు అబ్బురపడకుండా ఎలా ఉండగలం? చిన్నారులు చిరుకానుకలకు మురిసిపోతారు. పసివారివి అందుకనే పసిడి మనసులు.

కానీ, మనం అలా ఉండలేకపోతున్నాం.

మనం ఆకాశానికి నిచ్చెనలు వేయాలనుకుంటాం. పక్షిలా ఎగరాలని, చేపలా ఈదాలని, సృష్టిని శాసించాలని... ఇలాంటి వింత కోరికలతో సతమతమవుతూ ఉంటాం.

కనిపించనివాడు భగవంతుడెలా అవుతాడని ఒకడంటే, కనిపిస్తే దేవుడెలా అవుతాడని ఇంకొకడంటాడు! తర్కం, కుతర్కం ఆధ్యాత్మిక విచికిత్సను పరిష్కరించలేవు.

భగవంతుణ్ని సరిగా అర్థం చేసుకోగలిగితే, మన పట్ల ఆయన ప్రేమ అనంతమని తెలుస్తుంది. అప్పుడు మనం ఆయన్ని ప్రేమించకుండా ఉండలేం. అంతేకాదు- ఆయన్ని మాత్రమే ప్రేమిస్తాం. ఆయన ధ్యాసలోనే జీవిస్తాం. ఆయన్నే సదా జపిస్తాం. ధ్యానిస్తాం. అప్పుడు కలిగే ఆనందం స్థిరంగా, మనల్ని ఎప్పుడూ వీడకుండా ఉంటుంది. అదే ధ్యానానందం!

కాటూరు రవీంద్రత్రివిక్రమ్

ᐅమధుర భక్తి



ᐅమధుర భక్తి 

బృందావనంలో సుందర గోవిందుని రాసలీల రసరమ్య మనోహర హేల! జీవాత్మ, పరమాత్మల సంయోగాన్ని ప్రతిబింబించే అమలిన శృంగారలీల! శ్రీకృష్ణుని మీద ఎటువంటి మనోవైకల్యం లేని ఆలోచన, కృష్ణప్రేమే అమృతతుల్యమనే వివేచన గోపికామణుల సొంతం. ఆయనే వారి దృష్టిలో, రససృష్టిలో సుఖప్రదుడు, శుభప్రదుడు. కందులేని చందురుని చందంగా అందాలు చిందుతూ కాంతులు చిందే ఆ కమలాక్షుడే గోపికలకు సర్వం, సర్వస్వం. గోపికలది సరస శృంగారం కాదు, అలౌకిక మధుర భక్తి. కృష్ణుడు గోపికలకు వశుడైనా, వారి సాన్నిధ్యంలో పరవశుడైనా, కేవలం వారి ఆధ్మాత్మిక శక్తివల్లనే కానీ, భౌతికయుక్తివల్ల కాదు. భౌతికశక్తికి, యుక్తికి కృష్ణుడు అగోచరుడు. సర్వమయుడైన కృష్ణుని గురించిన ఆరాధన, పరిపూర్ణమైన అవగాహన గోపకాంతల చర్యల్లో కమనీయంగా, రమణీయంగా దృగ్గోచరమవుతుంది. కృష్ణుడు గోపికా మనోహరుడే కాదు, నిరతమూ వారి మానస చోరుడు! భక్తిమార్గం అవలంబించని భక్తులకు కృష్ణుడు ఏ మాత్రం అవగతం కాడు. భక్తిమార్గంలో భక్తుడు సాధించిన సలక్షణమైన ప్రగతికి విలక్షణమైన రీతిలో భగవంతుడు వారిని కటాక్షిస్తూ ఉంటాడు. వారి నిష్కామ భక్తి స్పందనలకు నిష్కపటమైన రీతిలో ప్రతిస్పందిస్తూ ఉంటాడు. కృష్ణుని విరహంలోనూ, సమక్షంలోనూ ఆ దేవాధిదేవుణ్నే గోపికలు తమ హృదయంలో నిలుపుకొని ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ జీవితాన్ని వెలయించారు. కృష్ణుడు బృందావనవాసుల విరహతాపాన్ని చల్లబరచే తలంపుతో మధురనుంచి ఉద్దవునితో పంపిన సందేశంలో 'మీకు నా గురించిన విరహం, నాకు దూరంగా ఉన్నాననే ఆలోచన అవసరం లేదు. నాకూ మీకూ భౌతికమైన వియోగమే కానీ నేను సదా మీ మానస స్థితుడను. కైవల్య పథాన్ని పొందే మార్గాన్ని, ఆధ్యాత్మిక జ్ఞాన చింతన మీరు కొత్తగా అన్వేషించే అవసరం లేదు. జన్మించినప్పటినుంచే మీరు నన్ను గాఢంగా ప్రేమించటానికి అలవాటుపడ్డారు కాబట్టి మీరు మోక్షప్రాప్తి గురించిన ఎటువంటి సందేహానికి లోను కావద్దు' అంటూ గోపకాంతలకు స్పష్టం చేస్తాడు. ఇదీ గోపకాంతల ఘనత, ఉదాత్త చరిత!
మహా భాగవతంలో మధుర భక్తితత్వాన్నీ, మహాత్మ్యాన్నీ విస్తృతంగా తేటతెల్లం చేసే ఒక ఘట్టం ఆసక్తిదాయకంగా ఉంటుంది. శుకమహర్షి పరీక్షిత్తుకు వివరించిన రాసలీలా వృత్తాంతమిది.

'ఓ మహారాజా! ఓ శరత్కాలపు పున్నమి రాత్రిలో జగన్మోహనుడైన శ్రీకృష్ణుడు గోపకాంతలతో రాసక్రీడ చేయ సంకల్పించాడు. ప్రతి ఇద్దరు గోపికాభామల మధ్య ఒక కృష్ణ రూపం ఉండేటట్లుగా రాసమండలాన్ని మనోహరంగా ఏర్పాటు చేశాడు. కృష్ణుడు పద్మం మధ్యలో ఉండే కర్ణికలాగా రాసమండల కేంద్రంలో త్రిభువనాలూ సమ్మోహించే భంగిమలో నిలిచి, కర్ణపేయంగా వేణుగానం చేశాడు. రాసక్రీడ అనంతరం ఆ గోపికలతో జలక్రీడలు ఆరంభించి శ్రీకృష్ణుడు సందడిగా యమునానదిలో ప్రవేశించాడు. ఒకరిపై ఒకరు నీళ్ళు జల్లుకుంటూ, తుళ్లుతూ అందరూ జలక్రీడ ముగించారు. ఆ పున్నమిరాత్రి మధురస్మృతులను సుమధురంగా నెమరువేసుకుంటూ అందరూ ఇళ్లకు చేరుకున్నారు' అని శుకుడు రాసలీలా వృత్తాంతం చెప్పాక- పరీక్షిన్మహారాజు ఆయనను ఇలా ప్రశ్నించాడు. 'యోగివర్యా! ధర్మరక్షణార్థమై ఈ ధరాతలంపై శ్రీకృష్ణుడై అవతరించిన భగవానుడు, ఇంద్రియలోలునిలా పరస్త్రీలతో కలవడం లోకవిరుద్ధం, ధర్మవిరుద్ధం కాదా?' అని అడిగాడు. శుకమహర్షి అతని సందేహ నివృత్తి కోసం ఏమని చెప్పాడో తెలుసా?

'ఓ రాజా! శ్రీకృష్ణుడు నందనందనుడిగా, యశోదకు ప్రియతనయుడైన గొల్లవాడిగా మసలడం చూసి అతడొక సామాన్య మానవుడేనని భావించడంవల్ల- ఇటువంటి సందేహం నీకు కలుగుతోంది. అతడు మానవరూపంలో అవతరించిన పరమాత్మ. జీవాత్మలన్నీ పరమాత్మ తాలూకు అంశాలే కాబట్టి ఈ రకంగా వ్యవహరించడంలో ఎటువంటి విపరీతమూ లేదు. శరీరస్థాయిలో వ్యవహరించే దేహాభిమానులకే శరీర సంబంధమైన బంధుత్వాలూ, భిన్నత్వాలూ గోచరిస్తాయి. ఆత్మస్థాయిలో అంతా ఒకటే కదా!' అంటూ శుకుడు విశదీకరిస్తాడు. ఏ భావంలోనైనా, కోణంలోనైనా, ఆ భగవంతునియందే దృష్టిని కేంద్రీకరించినప్పుడు ఆయన లభ్యమవుతాడు. ఇదే విషయాన్ని కలిసంతరణోపనిషత్తులో నారదుడికి మహావిష్ణువు తెలియజెప్పాడు. భక్తులు ఎక్కడ త్రికరణ శుద్ధిగా తన నామగానం చేస్తూ ఉంటారో, తనయందే మనసును పరిపూర్ణంగా లగ్నం చేసి ఉంటారో అక్కడే తాను స్థితుడనై ఉంటానని తేటతెల్లం చేస్తాడు నారాయణుడు. గోపికల చిత్తవృత్తీ, ప్రవృత్తీ ఆ శ్యామసుందరుడే! వారి తనువూ, మనసూ గోవిందుడే. ధనమైనా, కనకమైనా ఆ దామోదరుడే. గోపికల మనోధ్యానం, హృదయగానం ఆ గోవిందుడే! నిరంతర, చిరంతన కృష్ణప్రేమతో గోపికల జన్మధన్యమైంది.

- వెంకట్ గరికపాటి

ᐅజ్ఞానాన్వేషణ



ᐅజ్ఞానాన్వేషణ 

'జ్ఞానమనే దీపాన్ని వెలిగించి ప్రకాశింపజేయకుంటే లోకం యావత్తు చిమ్మచీకటిలో మునిగి ఉంటుంది' అంటాడు మహాకవి దండి. మనిషిని బంధించేది అజ్ఞానమేగాని, సంసారం కాదు. అహంకారాన్ని అతిక్రమించలేని మానవుడు అజ్ఞానమనే సుడిగుండంలో నుంచి బయటపడలేడు. అజ్ఞానంలో ఉన్నవాడిని మోహం విడిచిపెట్టదు. మోహం ఉన్నవాడు స్వార్థబుద్ధితో పాపాచరణకు వెనుదీయడు. స్వార్థపరుడు సమాజానికి చీడపురుగులాంటివాడు.
జ్ఞానం ఒక్కటే శాశ్వతమైనది. 'మతములన్నియు మాసిపోవును. జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును' అంటాడు ఆధునిక కవి. నిజానికి మతాలు పుట్టినది అజ్ఞానమనే చీకట్లోంచి మనిషిని ఉద్ధరించడానికే. అవతార పురుషులు, ఆచార్యులు, జ్ఞానులు అవతరించిందీ జ్ఞానబోధకే.

తన స్వరూపం తాను తెలుసుకున్నవాడు జ్ఞాని. సూర్యుడికి చీకటి తెలియదు. జ్ఞానికి దుఃఖం తెలియదు. ఈ లోకాన్ని జ్ఞాని మాత్రమే ప్రేమించగలడు. జ్ఞానిది శివదృష్టి. అజ్ఞానిది శవ దృష్టి. 'నేను ఆత్మను... నాకు ఒక దేహం ఉంది' అని జ్ఞానికి తెలుసు. 'నేను దేహాన్ని... నాకు ఒక ఆత్మ ఉంది' అనుకొంటాడు అజ్ఞాని. జ్ఞాని దేహం దేవాలయం. దేహ ప్రారబ్ధాన్ని అనుసరించి జ్ఞానికి జరగవలసిన పనులు జరుగుతుంటాయి కాని, కర్తృత్వం ఉండదు. జ్ఞాని శరీరం ధరించి ఉన్నంతమాత్రం చేతనే లోకానికి మేలు జరుగుతుంది. మల్లెతోటలో కూర్చుని మనకు పరిమళం రావాలని కోరుకోనక్కర్లేదు. అదేవిధంగా జ్ఞాని సన్నిధిలో కాంతి, శక్తి, శాంతి నిండి ఉంటాయి.

మహిమలు చూపించినవాడే జ్ఞాని కాడు. జ్ఞాని సమదర్శిని. గాలిలో తేలిపోయేవాడో, నీట్లో నడిచిపోయేవాడో జ్ఞాని కాడు. కాలాన్ని, కామాన్ని జయించినవాడు జ్ఞాని. మరణించినవాణ్ని బతికించినవాడు జ్ఞాని కాడు. మరణించినవాడిలా జీవించేవాడు జ్ఞాని. శాస్త్రవేత్త ప్రకృతిమూలాన్ని శోధించినట్లుగా జ్ఞాని మనోమూలాన్ని శోధిస్తాడు. జ్ఞాని దేనికీ చలించడు. సమాజంలో శాంతిభదత్రలు కాపాడ్డానికి రక్షకభట యంత్రాంగంలా మానవ మానసాలను శాంతితో, కాంతితో నింపడానికి జ్ఞానుల బోధనలు కావాలి. జ్ఞానదానం చాలా గొప్పది. 'నాకు తెలిసిందొక్కటే... నాకేమీ తెలియదని' అంటాడు సోక్రటీసు. ఆ స్థితిలో ఉండగలిగినప్పుడే జ్ఞానాన్వేషణ జరుగుతుంది. లోక జ్ఞానమైనాసరే, భగవత్ జ్ఞానమైనా సరే. జ్ఞానాన్ని అన్వేషించడమూ, అన్వేషించేవారికి సహాయపడమూ అంటే నేర్చుకోవడమూ, నేర్పడమూ. ప్రాచీన భారతదేశంలో దాన్నొక తపస్సుగానే భావించేవారు. జ్ఞాన సముపార్జనపట్ల ఆసక్తి ఉన్నవారు జ్ఞానులను వెదుకుతూ శ్రమకోర్చి ఎక్కడికైనా వెళ్లేవారు. ఒక గురువును కలుసుకోవడం కోసమో, ఒక అపూర్వమైన తాళపత్ర గ్రంథాన్ని అన్వేషిస్తూనో వందల యోజనాలు నడిచేవారు. దారిలో భిక్షగా లభించే ఆహారమే భోజనం. వృద్ధాప్యం ప్రవేశించి శరీరం శుష్కించినా- శారీరక మానసిక శక్తులు కూడగొట్టుకొని తాము కోరుకున్నదాన్ని నిరంతరం నేర్చుకునేవారు.

జ్ఞానార్థులైన ఆరుగురు మునిపుత్రులు సుకేశుడు, సత్యకాముడు, గార్గ్యుడు, భార్గవుడు, కౌసల్యుడు, కబన్ది అనేవారు జ్ఞానాన్వేషణ తత్పరులై పిప్పలాద మహర్షివద్దకు వచ్చారు. పిప్పలాదుడు సువర్చల, దధీచిల పుత్రుడు. మహాజ్ఞాని. ఏ విద్యను నేర్పడానికైనా అందుకు తగిన మానసిక స్థితి అవసరం. అందుకే ఈ ఆరుగురిని ఒక సంవత్సరకాలం తపోమయ జీవితం గడపమని ఆదేశించాడు. ఆ తరవాత వారు ఆయనను అడిగిన ఆరు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ఈ గురుశిష్య సంవాదమే 'ప్రశ్నోపనిషత్తు'గా ప్రసిద్ధమైంది. జ్ఞానాన్వేషణలోంచి ఆవిర్భవించిన ఒక కల్పవృక్షం ఈ ఉపనిషత్తు.

- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు

ᐅమేరీమాత ఉత్సవాలు



ᐅమేరీమాత ఉత్సవాలు 

తండ్రి బాధ్యత పరిమితం, తల్లి పాత్ర అనుక్షణం. తన పిల్లలకు ప్రేమ పంచే విషయంలో తల్లి పేదరాలు కాదు. తాను అన్నిచోట్ల ఉండలేక తనకు మారుగా దేవుడు తల్లిని సృష్టించాడని ఆధ్యాత్మికులు అంటారు. అలాంటి దేవుడినే కన్నతల్లి ఎంత గొప్పది? ఆ తల్లి తన గర్భఫలాన్ని సమస్త మానవాళికి జీవఫలంగా ఇవ్వడం ఎంతటి అద్భుత విషయం. ఆ మహిమాన్వితురాలు ఎవరో కాదు, సిలువపై సమస్త మానవాళి పాపపరిహారం కోసం బలి అయిన క్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చిన మేరీమాత. బాల్యంనుంచి దేవుడి సమక్షంలో పెరిగి పెద్దదైన మేరీమాత, లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువుకు తల్లి అయింది.
15, 16 శతాబ్దాల్లో ఐరోపాలో సంభవించిన యుద్ధాల ఫలితంగా ప్రజలు ఎన్నో కష్టాలకు గురయ్యారు. తమకు సాంత్వన కలిగించే తల్లిగా భావించి మేరీమాతను పూజించడం ఆనాటి నుంచే మొదలైందని చరిత్రకారులు అంటారు. విజయవాడలోని గుణదలలో ప్రకృతిసిద్ధంగా వెలసిన కొండగుహలవద్ద 1925లో 'ఫాదర్ ఆర్లతి' అనే బోధకుడు మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1971నాటికి ఆ పరిసర ప్రాంతం ప్రసిద్ధ మేరీమాత ఆలయంగా రూపుదిద్దుకుంది. గుణదలలో ఏటా జనవరి 31నుంచి మేరీమాత ఉత్సవాలు నవదిన ప్రార్థనలతో మొదలవుతాయి. ఫిబ్రవరి 9-11 తేదీల మధ్య మూడురోజులపాటు జరిగే ఉత్సవాలకు ప్రపంచం నలుమూలలనుంచి లక్షలాది భక్తులు విచ్చేస్తుంటారు.

మేరీమాతను కొన్ని ప్రాంతాల్లో 'నిష్కళంక మాత'గా, 'అమలోద్భవి'గా, 'వ్యాకులమాత'గా భక్తులు స్మరిస్తున్నారు. మేరీమాత తన తల్లి గర్భంనుంచే జన్మపాపం లేకుండా రక్షణ పొందిందని, పరిశుద్ధాత్మ శక్తివల్ల గర్భం ధరించి ప్రభువైన ఏసుక్రీస్తుకు జన్మనిచ్చిందని చెబుతారు. అందువల్ల ఆధ్యాత్మికులు ఆమెను 'నిష్కళంక మాత'గా కీర్తించారు. పదమూడో శతాబ్దంలో 'స్కౌతుస్' అనే ప్రబోధకుడు ఆమెను 'అమలోద్భవి'గా పేర్కొన్నాడు.

మేరీమాతను భక్తులు వ్యాకులమాతగా స్మరించడానికి కారణం ఆమె తన జీవితంలో ఏడుసార్లు అత్యంత వ్యాకులతతో ఆవేదన చెందడమే. ఈ విషయాన్ని సువార్తీకులు బైబిలు లేఖనాల్లో పేర్కొన్నారు. క్రీస్తు జన్మించిన ఎనిమిదో రోజు ఆయనను దేవాలయంలో కానుకగా అర్పించినప్పుడు ఆమె వ్యాకులపడింది.

పసివాడైన బాల ఏసుకు అప్పటి రాజు హేరోదునుంచి ఎదురయ్యే ముప్పునుంచి తప్పించేందుకు మేరీమాత, తన భర్త యేసేపుతో ఈజిప్టునకు ప్రయాణమయ్యే సందర్భంలోనూ ఆమె ఎంతో ఆవేదన చెందిందని అంటారు. ఏసు పన్నెండు సంవత్సరాల వయసులో యెరుషలేము దేవాలయంలో తప్పిపోయినప్పుడూ ఆ తల్లి హృదయం ఎంతో క్షోభపడింది. ఏ పాపమూ చేయని క్రీస్తు ప్రభువును ఇద్దరు దోషుల మధ్య ఉంచి సిలువ వేసినప్పుడు ఆ తల్లి ఎంతో వ్యాకులతకు గురైంది.

సైనికుల హింసాత్మక చర్యలతో రక్తసిక్తమైన ఆయన దేహాన్ని తన ఒడిలో పడుకోబెట్టినప్పుడు ఆ తల్లి బాధతో దుఃఖించింది.

ఆయన చనిపోయినప్పుడు ఆ పరిశుద్ధ శరీరాన్ని శిష్యులు సమాధిలో ఉంచినప్పుడు ఆ తల్లి అంతులేని దుఃఖంతో వ్యాకులత చెందింది.

ఏసు పుట్టుకనుంచి పునరుత్థానం వరకు మేరీమాత ఎన్నో దుఃఖాలను, వేదనలను భరించింది. అయినా దేవునిపై అత్యంత విశ్వాసంతో, ధైర్యంగా ముందుకు సాగింది. ఆమె దృఢచిత్తం, ఆత్మస్త్థెర్యం ఆదర్శప్రాయమైనవి. అవే ఆమెను జగన్మాతగా అందరికీ ఆరాధనీయురాలైన మహిమాన్విత మాతగా ఉన్నత శిఖరంపై అధిష్ఠింపజేశాయి.

మేరీమాత ఉత్సవాలకు హాజరవుతున్న ప్రతీ భక్తుడు, భక్తురాలు బాల్యంలో తమ తల్లులు చూపిన ప్రేమ, ఆప్యాయతలను మేరీమాతను తిరిగి దర్శించడం ద్వారా అనుభూతి చెందుతారు. ఆ భావనతోనే కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులు ఉత్సవాలకు విచ్చేసి, మేరీమాత దీవెనలు పొందుతారు. అలా మేరీమాత ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.

- డాక్టర్ ఎమ్.సుగుణరావు

ᐅవ్యక్తీకరణలు



ᐅవ్యక్తీకరణలు 

దేవుడు అనే పదాన్ని నిత్యం చాలామంది తెలిసో తెలియకో వాడుతూనే ఉంటారు. ఇందులో ఆర్తులు, అర్థార్తులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు ఎందరో ఉంటారు.
దైవానుభూతి పొందినవారు దైవం గురించి పదేపదే సహజంగా తెలియజేస్తూ ఉంటారు. వాళ్లు ఏదో ఒకమార్గంలో వారి దివ్యత్వాన్ని వ్యక్తీకరించకుండా ఉండలేరు. నిర్మలమైన నీరు ఒక ప్రదేశాన్ని ఆక్రమించి నిలకడగా ఒక అస్తిత్వాన్ని పొంది సరస్సు అయినట్లు, దైవం మానవుడిలో వ్యాపించి తన దివ్యత్వాన్ని ప్రకటించినప్పుడు అతడు దేవుడే అవుతాడు!

ఆ దేవుడు 'దేవుడు' గురించి తెలియజేస్తే ఎంతమందికి జ్ఞానం కలుగుతుంది? ఒక నామానికి ఒక రూపానికి పరిమితమైన జ్ఞానం సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అయిన నిరాకార పరబ్రహ్మ దివ్యత్వాన్ని ఎలా గ్రహించగలుగుతుంది?

తల్లి చంటిపిల్లాడి చేతిలో ఒక బత్తాయి పండు పెడుతుంది. దాన్ని పట్టుకుని వాడు మురిసిపోతూ ఉంటాడు. అది వాడు తినాల్సి వచ్చినపుడు, తల్లే తిరిగి ఆ పండు తీసుకుని తొక్కలు వలిచి, తోలు తీసి, పిక్కలు విడదీసి మెత్తటి ఈనెలు, దాని లోపలి గుజ్జును ముక్కలు ముక్కలుగా చేసి వాడి నోటికి అందిస్తుంది.

వేదాలు మనకు బ్రహ్మ అందించినా వాటి సారం ఉపనిషత్తుల ద్వారా ఇతర మహాకావ్యాల ద్వారా, పురాణాల ద్వారా తిరిగి వ్యక్తమైంది. సద్గురువుల ప్రవచనాల ద్వారా వ్యాప్తిచెందింది. లోకానికి సరళం, సౌఖ్యమూ అయిన పద్ధతుల్లో తెలిసినప్పుడే- ఆ జ్ఞానానికి సార్థకత. తనకు తెలిసిన విషయం తెలిసినట్లుగా చెప్పటం ఒక పద్ధతి. ఇది భగవాన్ రమణ మహర్షి ఆచరించారు. తనకు తెలిసినదంతా చెప్పకుండా, లోకులకు అర్థమయ్యే రీతిలో చిన్నచిన్న పద్యాల రూపంలో అందించారు యోగి వేమన. దోహాల రూపంలో భగవదనుభూతిని కబీరు లిఖించారు. అన్నమయ్య, త్యాగయ్య, తుకారాం, మీరాబాయి... ఒక్కొక్కరిది ఒక్కో మార్గం.

అందరూ దేవుడి గురించే చెప్పారు. మొగ్గ పుష్పమై వికసించి పరిమళాలు వెదజల్లినట్లు దైవ సౌరభాన్ని లోకానికి పంచారు.

ఒక యోగి ఎప్పుడూ లాంతరు వెలిగించి దాన్ని పట్టుకుని పగలు కూడా తిరుగుతూ ఉండేవాడు. అందరూ అతడిని విచిత్రంగా చూసేవారు. ఎవరో ఒక పెద్దాయన ఉండబట్టలేక అడిగాడు. 'స్వామీ! ఎప్పుడూ మీరు ఈ లాంతరు చేతపట్టుకుని తిరుగుతూ ఉంటారు కదా! ఏమిటీ దీని అర్థం?' అని. దానికి అతడినుంచి వచ్చిన సమాధానం- 'లోకమంతా అజ్ఞానం అనే అంధకారంలో మగ్గుతోంది. చీకటిలో దీపం ఉండాలి కదా. అందుకే ఈ లాంతరు'.

మరొక గురువు, ఎవరైనా వచ్చి 'స్వామీ మీరు ఏం తెలుసుకున్నారు?' అని అడిగితే- కళ్లు మూసి వెంటనే కళ్లు తెరిచేవాడు. ఎవరికి ఏమీ అర్థం అయ్యేది కాదు. 'ఎవడో పిచ్చివాడు' అని అనుకునేవాళ్లు. కొంతకాలం తరవాత ఆయనే దానికి వివరణ ఇచ్చాడు- 'బయట, లోపల ఉన్నది ఒకటే' అని.

ఇంకొక సాధువు, కనిపించిన ప్రతి వ్యక్తికి, రాయికి, రప్పకి, చెట్టుకి, పుట్టకి, పాముకి, పక్షికి, ఆకాశానికి, నేలకి పదేపదే నమస్కరిస్తూ ఉండేవాడు. అందరూ అతడిని నిజంగా పిచ్చివాడిగా జమకట్టేశారు. చివరికి తెలిసిందేమిటంటే- భగవదనుభూతి వల్ల కలిగిన ఆనంద పారవశ్యంలో దైవోన్మత్తతతో ప్రతీది అతడికి శక్తి స్వరూపంగా గోచరించేదట.

ఇలా రకరకాల వ్యక్తీకరణలు. వాళ్లెవరూ పిచ్చివాళ్లు కారు. పిచ్చివాళ్లుగా గోచరించారు. మనకు తెలియనంత మాత్రాన ప్రతీది అసత్యం కాదు. అలాగని సత్యమూ కాదు. నీ అపరోక్ష అనుభూతితో పరీక్షించి తెలుసుకుని సత్యమార్గంలో నడవాలి. అప్పుడే 'దేవుడు' అనే పదానికి నిజమైన అర్థం. జీవన పరమార్థం.

- ఆనందసాయి స్వామి

ᐅసమ్మక్క-సారలమ్మ జాతర



ᐅసమ్మక్క-సారలమ్మ జాతర 


అక్కడ నిత్యపూజలందుకునే మూలవిరాట్ ఉండదు. ఉత్సవ విగ్రహాలు ఉండవు. పూజావిధానాలు లేవు. ఆగమశాస్త్ర ఆచరణలు కొనసాగవు. అక్కడ ఉన్నదల్లా అచంచలమైన భక్తి. కొండంత విశ్వాసం. సమున్నతమైన నమ్మకం. రెండు వెదురు కర్రలకు కట్టిన కుంకుమ భరిణెల్ని భక్తులు జంట దేవతలుగా పూజించుకుంటారు. రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమినాడు ఆ దేవతల్ని స్మరించుకుంటూ మహావైభవంగా జాతర నిర్వహించుకుంటారు. తల్లీకూతుళ్లయిన ఆ జంట దేవతలే సమ్మక్క, సారలమ్మ. తమను నమ్ముకున్న జాతికోసం, జనంకోసం వీరోచితంగా పోరాడి, తమ ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించిన అమర వీరుల్ని జానపదులు దైవాలుగా ఆరాధిస్తుంటారు. శత్రురాజుల దురహంకారాల్ని ఎదిరించి తమవారికోసం కదనరంగంలో సమ్మక్క, సారలమ్మలు వీరమరణం పొందారు.
వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 8-11 తేదీల మధ్య సమ్మక్క సారక్క జాతర నిర్వహిస్తారు. లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేసే ఈ మహాజాతర, మనదేశంలో కుంభమేళా తరవాత జరిగే అతిపెద్ద సంరంభం. ప్రపంచంలో ఇంతటి భారీస్థాయిలో గిరిజన జాతర మరెక్కడా జరగదు. రెండేళ్లకోసారి, మాఘ పౌర్ణమి తరవాత వచ్చే నాలుగు రోజులు ఈ సంబరం కొనసాగుతుంది. వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలను గిరిజనులేకాకుండా, గిరిజనేతరులూ ఆరాధ్యదైవాలుగా కొలుచుకుంటారు. అమ్మవార్లకు చీరె సారెల్ని, పసుపు కుంకుమల్ని భక్తులు సమర్పిస్తారు. తమ బరువుకు తూగే బెల్లాన్ని మొక్కుబడిగా ఇచ్చి, నివేదన చేస్తారు. తమ జీవితాలు బెల్లపు రుచి అంత మధురంగా సాగిపోవాలని జంట దేవతలకు విన్నవించుకుంటారు.

సమ్మక్క సారలమ్మల ఆవిర్భావం, వారి పేరిట జాతర నిర్వహించడానికి గల నేపథ్యానికి సంబంధించి ఎన్నో విశేషాంశాలు జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నాయి. ఏడో శతాబ్దంలో అప్పటి ఓరుగల్లు ప్రాంతానికి సమీపంలో బక్కయ్యపేట అనే గిరిజన గ్రామం ఉండేది. కోయ తెగకు చెందిన గిరిజనులు ఈ గ్రామంలో ఉండేవారు. గోదావరి నదీతీరంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లిన సందర్భంలో గిరిజనులకు పసిపాప ఏడుపు వినిపించింది. పులుల సంరక్షణలో ఉన్న ఓ పసిపాపను చూసి, దైవాంశతో తమకోసం అవతరించిన వనదేవతగా గిరిజనులు భావించారు. మాఘ శుద్ధ పౌర్ణమినాడు అందరి సమ్మతితో పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. బాల్యంనుంచే సమ్మక్క ఎన్నో లీలల్ని ప్రదర్శిస్తూ యుక్త వయస్కురాలైంది. ఆమెను పెంచి పెద్దచేసిన కోయతెగ నాయకుడు మేడిరాజు, తన మేనల్లుడైన పగిడిద్ద రాజుతో సమ్మక్కకు వివాహం చేశాడు. ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న జన్మించారు.

కాకతీయులకు సామంతులైన కోయరాజులు తీవ్ర అనావృష్టి వల్ల ఓ సంవత్సరం కప్పం కట్టలేదు. దాంతో అప్పటి కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు తన బలగంతో కోయతెగపై దండెత్తాడు. కాకతీయుల్ని కోయతెగ దీటుగా ఎదుర్కొంది. సంపెంగ వాగు దగ్గర జరిగిన పోరులో పగిడిద్ద రాజు, అతని సంతానమైన సారలమ్మ, నాగులమ్మ, సారలమ్మ భర్త గోవిందరాజు వీరమరణం చెందుతారు. పరాజయాన్ని భరించలేని జంపన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మార్పణ చేసుకున్నాడంటారు. ఆనాటినుంచి సంపెంగ వాగు జంపన్న వాగైంది. సమ్మక్క స్వయంగా సమర రంగానికి వచ్చి, కాకతీయులపై కత్తి దూసింది. అపర కాళికలా వీరవిహారం చేసింది. శత్రువులు కుట్రతో ఆమెను వెన్నుపోటు పొడిచారు. చివరిదాకా పోరాడి, సమ్మక్క నెత్తురోడుతూనే ఈశాన్యదిశగా ఉన్న చిలకలగుట్టపైకి వెళ్లిందని ప్రచారంలో ఉంది. గుట్టపై నాగవృక్షం కింద కుంకుమ భరిణెగా ఆమె అవతరించిందని స్థానికులు నమ్ముతారు. ధీరత్వానికి, శూరత్వానికి ప్రతీకలైన సమ్మక్క, సారలక్క రూపాల్ని జువ్విచెట్టు కింద ప్రతిష్ఠించారు. రెండేళ్లకోసారి చిలకలగుట్టనుంచి సారక్క రూపునీ, కన్నెపల్లి గ్రామంనుంచి సారలమ్మ రూపుని మేడారం రాతి గద్దెలకు వూరేగింపుగా తీసుకువస్తారు. తల్లీబిడ్డలకు బెల్లపు దిమ్మల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ బెల్లపు ముద్దల్నే బంగారంగా వ్యవహరిస్తూ, ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు. కొలిచినవారి పాలిట కొంగుబంగారమన్న భక్తి భావనతో సమ్మక్క, సారక్కల్ని ఆరాధించుకుంటారు.

- డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్ 

ᐅకలవని పట్టాలు



ᐅకలవని పట్టాలు 

అసాధారణమైన, అరుదైన చారిత్రక, పౌరాణిక గాథలకన్నా ఈనాటి సాంకేతిక అద్భుతాలవైపే అంతా ఆకర్షితులవుతున్నారు. పురోగమించాలి, మార్పుకావాలి అనేది నేటి నినాదం. అయితే గతంనుంచి వర్తమానాన్ని వేరు చేయలేం. గతం ఎప్పటికీ అంతరించిపోదు.
మనదేశంలో గతం అంతా పురాణగాథలు, సంకేతాలు, క్రతువులు కనిపిస్తాయి. అవన్నీ ప్రజల్ని స్నేహబంధంతో కలిపి ఉంచేవి. కొన్ని అతి విచిత్రగాథలున్నాయి. నదులకు, చెట్లకు అధిష్ఠాన దేవతలుంటారని, సురలోకంనుంచి ప్రవహించిన గంగ అని, కృష్ణవేణి తల్లి అని నేటికీ భావించేవారున్నారు. కొన్ని చరిత్రనుంచి ప్రభవించాయి. అవి మన జీవన వాస్తవాలను తీర్చిదిద్దలేదా?

పసితనం దాటి ప్రజ్ఞ, ప్రతిభ నిండిన దశలో ప్రవేశించగానే గతం విడిచివెళ్లిన చిహ్నాలను వర్తమాన వాస్తవాలతో ముడిపెట్టి, ఆనాటి గాథలకు తిరిగి ప్రాణం పోయాలనే తలపు కొందరికైనా కలగక మానదు. సమాజం ఆధునికత వైపు ఎంత వేగంగా అడుగులు వేస్తున్నప్పటికీ గతంతో బంధాలు తెంపుకోలేదు. గతం అంతర్వాహినిగా వూపిరితీస్తూనే సాగుతోంది. పల్లెల్లో అమాయక నిశ్శబ్దాల్లో మారుమోగిన జానపదగీతాలు మనం మరచిపోయామా? చాలాచోట్ల అదృశ్యం కావచ్చు. కాని ఆ జ్ఞాపకాలు మన గుండెల్లో ఇంకా పచ్చగా మెరుస్తూనే ఉన్నాయి కదా!

మనదేశంలో చారిత్రక ప్రాధాన్యం కలిగిన, మహిమాన్విత పుణ్య యాత్రాస్థలాలు కోకొల్లలు. అక్కడికి వెళ్లి తనివితీరా ప్రకృతి రమణీయ దృశ్యాలతోపాటు అలౌకికమైన సాన్నిధ్యాన్ని అనుభవించడం మరపురాని దివ్య అనుభూతి. అలాంటివాటిలో పార్వతి నది ప్రవహించే చోటు ఒక మహాద్భుతం. మనాలీ లోయలో మణికర్ణిక అనే చోట ప్రాచీన శివాలయం ఉంది. అక్కడే ఒక గురుద్వారా ఉంది. వేడినీటి బుగ్గలు ఉన్నాయి. అక్కడే చాలా పెద్ద నంది విగ్రహం ఉంది.

పార్వతీదేవి అక్కడ ఒక చిన్న తటాకంలో స్నానం చేస్తుండగా ఆమె బంగారు ఆభరణాలు అందులో పడిపోయాయట. అప్పుడు వాటిని తీసుకొని రావడంకోసం శివుడు ఒక సర్పాన్ని పంపాడని, ఆ సర్పం వాటిని నోట కరచుకొని తెచ్చి బయటకు విసురుగా వదిలిందని, అక్కడే వేడినీటి బుగ్గలు ఏర్పడ్డాయని చెబుతారు. ఆ ఉష్ణజలాలకు శరీరంలోని రుగ్మతలు పోగొట్టే మహిమ ఉందంటారు పెద్దలు. గురునానక్ కూడా అక్కడ ధ్యానం చేసినట్లు చెబుతారు. రాత్రివేళ హనుమంతుడు ఆ ప్రదేశంలో తిరుగుతుంటాడని ప్రతీతి.

(నమ్మేవారికి) ఇలాంటి పురాణగాథలు అబద్ధాలు కావు. కల్పనలు కావు. అవి మరొక రకం సత్యాన్ని చూపిస్తాయంటారు పురాణ పరిశోధకులు. సత్యం అనేక రూపాలుగా కనిపిస్తుంది. కొన్ని బహిర్ముఖమైనవి. కొన్ని అంతర్ముఖమైనవి. కొన్ని తర్కబద్ధమైనవి. మరికొన్ని అంతఃస్ఫూర్తికి మాత్రమే గోచరించేవి. కొన్ని సంస్కృతితో ముడివడిన విశ్వజనీన వాస్తవాలు. కొన్నింటికి సాక్ష్యాధారాలుంటాయి. మరికొన్ని విశ్వాసంపై ఆధారపడినవి. సైన్సు చెప్పలేనివాటికి మతం సమాధానం చెబుతుంది. మతం పట్టించుకోని రహస్యాలకు సైన్సు సమాధానం చెబుతుంది. మానవ ప్రగతికి అవి రెండూ పట్టాలు. అవి ఏనాడూ కలిసే అవకాశం లేదు.గతం ఏనాటికీ మరణించదు. అవి మన ఆలోచనల్ని, వూహల్ని దీప్తిమయం చేస్తూ తాను అదృశ్యంగా ప్రవహిస్తూనే ఉంటుంది- ఎప్పటికీ.

- కె.యజ్ఞన్న

ᐅపరమ పురుషుడు



ᐅపరమ పురుషుడు 


జీవితంలో ఆటుపోట్లు, సుఖదుఃఖాలు, లాభనష్టాలు సహజం అని తెలిసినప్పటికీ సగటు మనిషి కేవలం సుఖాలనే కోరుకుంటాడు. ఎందుకు- బాధలంటే భయం... జీవితాంతం హాయిగా, నల్లేరుమీద నడకలా గడపాలన్న కోరిక...
సృష్టి మొదలై నాగరికత పెరిగాక జన్మంతా పూర్తిగా సుఖాలతోనే బతికినవారెవరైనా ఉన్నారా? మరి మానవుడు దుఃఖాలకు దూరంగా ఉండాలని ఎందుకు భావిస్తాడు? కష్టసుఖాల కలబోత జీవితమని తెలిసీ ఎందుకు విలపిస్తాడు? సమదృష్టి లోపం వల్లనే ఇలా జరుగుతుంది. ప్రాపంచిక విషయాలకు అధిక ప్రాధాన్యమివ్వడం, ప్రతి చిన్న అంశానికీ అమితంగా కుంగిపోవడం, లేనిపోని భయాలతో భవిష్యత్తును వూహించుకోవడం ఎందరికో పరిపాటి.
పారమార్థిక చింతన చాలావరకు పరిణతినిస్తుంది. ఇహం, పరం మధ్యనున్న సన్ననిగీత చెరిపెయ్యగలిగితే స్థిరచిత్తం ఏర్పడుతుంది. ఎలాంటి సమస్య ఎదురైనా ఎదుర్కొనే దృఢసంకల్పం చిగురిస్తుంది. పరిష్కారం లభించడానికి మార్గం సుగమమవుతుంది. ఈ పారమార్థిక చింతన అంతర్గతంగా అంతర్లీనంగా జరగాలి. నిరంతరం అంతర్మథనం కొనసాగుతుండాలి. ఆశావహ దృక్పథం అలవరచుకోవాలి. చెడు ఆలోచనలను దూరంగా ఉంచాలి. గతంలో ధర్మమూర్తులుగా వాసికెక్కినవారి జీవనశైలిని పరిశీలించాలి. కష్టాల్లో వారెంత మనోనిబ్బరం ప్రదర్శించారో ఆకళింపు చేసుకోవాలి. ఆత్మహత్య భావనను ఆదిలోనే తుంచెయ్యాలి. చీకటి వేకువకు ప్రాణం పోస్తుందని గ్రహించాలి. ఒకరోజు ఆహారం దొరకలేదని ఏ జంతువైనా ఎప్పుడైనా ఆత్మహత్యాయత్నం చేసిందా? అలాంటిది, దుర్లభమైన నరజన్మ పొంది స్వయంకృతాపరాధాల కారణంగా దీన్ని నాశనం చేసుకుంటున్నవారెందరో!

పరిణతి కోసమే పారమార్థిక చింతన అన్న సత్యం తెలుసుకుంటే స్థితప్రజ్ఞత దానంతటదే వస్తుంది. కష్టాలకడలిని జీవితమంతా ఈది సుఖాలతీరం చేరిన ప్రముఖులెందరో ఉన్నారు. వారి చరిత్రలు ఆదర్శంగా తీసుకోవాలి. ఇలా పరిణతి సాధించిన మానవుడే పరమ పురుషుడవుతాడు.

- కిల్లాన మోహన్‌బాబు 

ᐅమీలాద్ - ఉన్ - నబి ప్రశస్తి



ᐅమీలాద్ - ఉన్ - నబి ప్రశస్తి 


సత్యం, న్యాయం, పరోపకారం, నీతి వంటి ఉత్తమ గుణాల సిరిసంపదల్ని లోకానికి అందించే నిమిత్తం విశ్వమానవశ్రేయాన్ని కాంక్షించే మహానుభావులు తమ ప్రాణాల్ని సైతం లక్ష్యపెట్టరు. బాధ్యతను భుజాలకెత్తుకొని ఎలాంటి కష్టనష్టాలనైనా ఎదుర్కొంటారు. ప్రోత్సాహ ప్రోద్బలాల కోసం నిరీక్షించరు. ఒకరి మేలు తమ మేలని భావిస్తారు. పరుల వేదనలు తొలగించడానికే జీవితం గడుపుతారు. కొత్త ఆనందాలకు వాకిళ్లు తెరుస్తారు. చిరస్థాయిగా ప్రజాహృదయాల్లో నిలుస్తారు.
మహమ్మద్ ప్రవక్త జన్మదినమే మీలాదున్నబి. మీలాద్ అంటే జన్మదినం. నబీ అంటే ప్రవక్త. మీలాద్-ఉన్-నబి అంటే ప్రవక్త జన్మదినం. ముస్లిములు మీలాదున్నబిని సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు. మహాప్రవక్త పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం మక్కాలో జన్మించారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను, ఆప్తులను కోల్పోయి ఏకాకి అయ్యారు. అయినా ధైర్యం వీడలేదు. అలముకొన్న కష్టాల్ని, అవరోధాల్ని ఛేదించుకొని మానవలోక మహోపకారం కోసం జీవితం గడిపారు.

ఆయన వాక్కులు, చేతలు నిస్వార్థ ఆదర్శాలకు ప్రతిరూపాలై శోభిల్లాయి. ఆయన జీవితం సత్యసంధతకు, సహనానికి, సౌహార్దానికి, ఉన్నత మానవీయ గుణాలకు ఆకరమైంది. నిత్యం సత్యాన్ని, సచ్ఛీలతను, సన్మార్గాన్ని ప్రబోధించేవారు. బోధించింది స్వయంగా ఆచరించేవారు.

రాజాధిరాజైనా మహాప్రవక్త ఒక పేదవాడిగా, సర్వస్వం త్యజించి, పూరిగుడిసెను నివాసంగా చేసుకొన్నారు. గృహస్థుగా ఉండి సంసార జీవితం గడిపారు. చిరిగిన బట్టల్ని తానే కుట్టుకొనేవారు. చెప్పులు తానే బాగుచేసుకొనేవారు. ఆయనకు పటాటోపం లేదు. వైభవం లేదు. అంగరక్షకుడు లేడు. ఖజానా లేదు. ఖర్జూరపు పండ్లు, మేకపాలు ఆయన ఆహారం. ఈతచాప లేక జనుపనార పట్టా ఆయన శయ్య. ఏదైనా సమావేశంలో ఆయన ఉన్నప్పుడు కొత్తగా వచ్చినవారికి సామాన్యులెవరో, దేశపాలకుడెవరో తెలిసేది కాదు.

ఆయన తనువు త్యజించిననాడు ఉన్న ఆస్తి అంతా కొన్ని నాణాలు మాత్రమే. కొన్నింటితో అప్పుతీర్చారు. అర్థించిన పేదవారికి మరికొన్నింటిని ఇచ్చారు. దీపం వెలిగించడానికి సైతం ఇంట్లో చమురు లేదు. ప్రవక్తను తత్వవేత్త, వక్త, శాసనకర్త, యోధుడు, హేతుబద్ధ విశ్వాసాల సంస్థాపకుడు, విగ్రహరహిత ఆరాధనా బోధకుడు- అని ప్రపంచ మేధావులు, పరిశీలకులు అన్నారు. ఆయన హితబోధలు జగత్తుకు ప్రేమపూరిత విధానం నేర్పుతున్నాయి. వాటిలో కొన్ని-

స్వార్థాన్ని, అహంభావాన్ని త్యజించడం సర్వోత్తమం. సాటి మానవ సోదరుల్ని మనకన్నా తక్కువగా చూడటం మహాపాపం. ఆచరణలేని హితబోధ జీవరహితమైన కళేబరం వంటిది. స్త్రీ జాతిని గౌరవించనివారు, అనాథలను ఆదరించనివారు జగత్ప్రభువు కరుణా కటాక్షాలకు అనర్హులు. కూలివాని చెమట బిందువులు ఆరకముందే అతని వేతనం చెల్లించాలి. అన్యాయం, అవినీతితో సమ్మిళితమైన అధర్మ సంపాదన పాపభూయిష్ఠమైంది. బంధువులు, బాటసారులు, వితంతువులు, నిస్సహాయులపట్ల గౌరవంతో, దయతో వ్యవహరించాలి. వృద్ధులకు చేదోడు కావాలి. విద్యార్జన స్త్రీ పురుషులందరి అనివార్య విధి. బాధ్యతలు విస్మరించి ఇతరుల హక్కుల్ని దోచుకోవడం మహాదోషం. వినాశనాన్ని, విచ్ఛిన్నాన్ని సృష్టించడం హేయం. వక్రమైన తలపులు, వికృతమైన కోరికలు, అసమంజస దృక్పథాలు, దౌష్ట్యాలు అన్నీ వ్యక్తి జీవితాన్ని రాక్షసత్వంవైపు మళ్లిస్తాయి. శాంతి, సామరస్యాలు మట్టి పాలవుతాయి. మానవజాతి పతనానికి హేతువులవుతాయి. విద్వేషంకన్నా ప్రేమ అనంత శక్తిసంపన్నమైంది. ధనాన్ని వ్యర్థమైన కాలక్షేపాల్లో, ఆడంబరాల్లో, విలాసాల్లో వ్యయ పరచడం ఎంతమాత్రం తగదు. వేలాది ప్రజల జీవనోపాధికి అది ఉపయోగపడుతుంది.

జ్ఞానుల హృదయాలనుంచి జ్ఞానజ్యోతిని అంతమొందిస్తుంది ప్రపంచ వ్యామోహం. నీ మరణానంతరం ప్రజలకు నీ దౌర్జన్యాలనుంచి విముక్తి లభించేలా జీవితం గడపవద్దు. శాంతి, పవిత్రత, ప్రేమ, ఆనందం, సహనం- ఇవే జీవన పథాన్ని కాంతిమయం చేస్తాయి! మహాప్రవక్త కురిపించిన సమున్నత భావాల సిరిజల్లు- మానవాళిలోని మలినాన్ని తుడిచి పెట్టడానికి, ప్రేమవాహిని ఇంకిపోకుండా ఉండటానికి సమత్వ ప్రభల్ని వెలిగించడానికి.

ఎవరి హృదయం అశాంతితో రగలరాదని, ప్రతిగుండె పరోపకారం కోసం తహతహలాడాలని, జగం శుభప్రదమై శోభిల్లాలని మీలాదున్నబి మహత్తర ఆకాంక్ష.

- డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా 

ᐅనిశ్శబ్ద శబ్దం



ᐅనిశ్శబ్ద శబ్దం 

నిశ్శబ్దం సనాతనమైంది... భగవంతుడిలా. నిశ్శబ్దం అంతర్ముఖమైంది... ధ్యానిలా. నిశ్శబ్దం అనంతమైంది... ఆకాశంలా. ఏమిటి నిశ్శబ్దం? కర్ణపేయమైన, అందమైన, అవసరమైన శబ్దాన్ని కాదని నిశ్శబ్దాన్ని ఎందుకు ఆశ్రయించాలి? ఎందుకు ఆచరించాలి? ఎందుకు ప్రేమించాలి?
చెవులకు వినిపించేది శబ్దం. ఆంతర్యానికి అర్థమయ్యేది నిశ్శబ్దం. ఆత్మవరకూ సాగేది నిశ్శబ్దం. ప్రథమ శబ్దరూపమైన ఓంకారం నిశ్శబ్దంలోంచే ఉత్పన్నమైంది. శబ్దం భౌతికమైంది. నిశ్శబ్దం ఆంతరికమైంది. నిజమే... కదిలే చిత్రపటంలా ఉండే నిశ్శబ్ద సజీవ చలిత ప్రకృతికి శబ్దం ఒక సౌందర్యాన్నిచ్చింది. కొత్త చైతన్యాన్ని తెచ్చింది. జీవులు భౌతికంగా పరస్పరం అంతర్గత భావాలను తెలుపుకొనేందుకు ఒక అవకాశాన్నిచ్చింది. సప్తస్వర సమన్వితమైన సంగీతంతో ప్రపంచాన్ని స్వరరాజ విరాజమానం చేసింది. నీరాజనాలందుకుంది. అయితే నిశ్శబ్దం ఆది స్వరం. సుస్వర రాజీవం. ఆత్మకు మాత్రమే అర్థమయ్యే అతిశయ శబ్ద సౌందర్యం. త్రిభువనాల్లో ఏ శబ్దమైనా నిశ్శబ్దంలోంచి వచ్చిందే. మళ్లీ ఏ శబ్దమైనా నిశ్శబ్దంలో విలీనం కావలసిందే. అది అపస్వరంలేని అనంత స్వరం. నిశ్శబ్ద శబ్దం.
ఆధ్యాత్మిక సాధనల్లో చాలామంది శబ్దాన్ని ఆశ్రయిస్తారు. అంటే పైకి పెద్దగా మంత్రాలు, స్తోత్రాలు చదవటం, పారాయణాదులు చేయటం లాంటివి. అలా చేయకపోతే వారికి తృప్తి ఉండదు. అసలు అలాకాక మరోలా చేయలేరు కూడా. వేదాలు శ్రుతులే (వినగలగినవి) అయినా, స్వరబద్ధంగా, శ్రుతిపక్వంగా పాఠనం చేయదగినవే అయినా- గురుముఖతా లభించే మంత్రాదులు మాత్రం నిశ్శబ్ద సాధనకే పరిమితమయ్యాయి. పారాయణాదులైనా అంతే. స్తోత్రాలకు మాత్రం పైకి పఠించే వెసులుబాటునిచ్చింది శాస్త్రం. అవి కూడా మానసికంగా చేసినా తప్పులేదు. నిజానికి ఏ సాధనైనా, భౌతికమైన పాఠ్య పాఠాలైనా, పుస్తక పఠనమైనా నిశ్శబ్దంగా చదవటమే ఉత్తమమైన పద్ధతి. ఏకాగ్రతకు సంబంధించిన ఏ సాధనైనా నిశ్శబ్ద సమయంలోనే నిశ్శబ్దంగా చేయమని పెద్దలు సలహా ఇస్తారు. నిశ్శబ్దం మనసును ఏకాగ్రపరుస్తుంది. శబ్దం పారాడ జేస్తుంది. ఏకాగ్రత కొరవడ జేస్తుంది. అయితే శబ్దానికి శక్తి లేదా అంటే, మళ్ళీ అది వేరే అంశం. నిప్పు కాలుస్తుంది. మళ్ళీ దాని ప్రయోజనం దానికుంటుంది. శబ్దం అవసరమైందే. కానీ, ఎంతవరకు? ఎంతవరకు అవసరమో అంతవరకే. అతిశబ్దం, అనవసర శబ్దం మనిషిని చిరాకుపరుస్తాయి. అంతర్ముఖ ప్రియులు (బహిర్ముఖులు కూడా) నిశ్శబ్దాన్ని వెదుక్కుంటూ వెళ్లేవారేగానీ, శబ్దాన్ని వెదుక్కుంటూ వచ్చేవారుండరు. హిమాలయ సానువులను ఆశ్రయిస్తూ వెళ్లేవారు అధికభాగం- ఆ ఊర్ధ్వముఖ హిమపర్వత మధ్యంలో లభించే ఏకాంత నిశ్శబ్దాన్ని అభిలషించే, ప్రేమించే. సాధకుల్లోని అరిషడ్వర్గ ఆసురీగణాల్ని అంతమొందించేది, ఆధ్యాత్మిక కేంద్రాలను జాగృతపరచి ఆత్మవైపు ప్రకాశాన్ని పరచే నిశ్శబ్దంలోని ప్రశాంతతే. గురువులు అప్పుడప్పుడూ ఏకాంతాన్ని ఆశ్రయిస్తూ వెళ్లమని శిష్యులకు సూచించేది- ఏకాంత నిశ్శబ్దం శిష్యుల్లోని అలజడులను ఉపశమింపజేసి సాధనకు మరింత ఆయత్తపరుస్తుందనే. శబ్దకాలుష్యం ప్రకృతిలోని నిశ్శబ్ద సౌందర్యాన్ని కలుషితం చేస్తుంది. వికృతం చేస్తుంది. ప్రశాంతతను భంగపరుస్తుంది.

'నిశ్శబ్దం ఒకరు సృష్టించింది కాదు. అది విశ్వాంతరాళంలోని సహజసిద్ధ స్థితి. అత్యంత అమూల్యమైన కొన్ని కొన్ని సహజత్వాలను యథాతథంగా ఉండనివ్వడమే లోకానికి కల్యాణ కారకం'.

ప్రాపంచికంగా ఆలోచించినా ప్రస్తుతం శబ్దకాలుష్యం ప్రపంచాన్ని కల్లోలపరుస్తోంది. అనారోగ్యాన్ని కలగజేస్తోంది. ముఖ్యంగా గర్భస్త శిశువుల్ని అస్వస్థతకు గురి చేయటమో, అసలుకే మోసం తేవడమో చేస్తోంది. మనం చేసే ఒక అనవసర శబ్దాన్ని చేయకుండా అదుపు చేసుకోగలిగితే... అలా కొన్ని వందలు, వేలు, లక్షల మంది ఆలోచించగలిగితే... ఆలోచిద్దాం!

- చక్కిలం విజయలక్ష్మి

ᐅభీష్మ ఏకాదశి



ᐅభీష్మ ఏకాదశి 

ఎవరికోసమూ ఆగనిది, ఎవరు చెప్పినా విననిది, కాలం సమీపిస్తే ఒక్క లిప్తపాటు గడువైనా ఇవ్వక కబళించేది- మృత్యువు. అలాంటి మరణాన్ని సైతం శాసించి, తాను కోరుకున్న పుణ్యతిథినాడు తనువు చాలించి భగవదైక్యం చెందినవాడు భీష్మాచార్యుడు. అంతటి గొప్పతనాన్ని సంపాదించుకోవడానికి ఆయన నిష్కల్మషమైన ప్రవర్తన, నిష్కర్షతో కూడిన నియమబద్ధ జీవన విధానమే కారణం.
గంగా(నది) దేవికి, శంతన మహారాజుకు జన్మించిన అష్టమ సంతానం దేవవ్రతుడు. వసిష్ఠుడి దగ్గర అన్ని విద్యలూ నేర్చుకుని బుద్ధిలో బృహస్పతితో సముడిగా పేరు తెచ్చుకున్నాడు. తండ్రి శంతనుడు ఒక రోజు తాను దాశరాజు కుమార్తె అయిన సత్యవతి మీద మనసు పడినట్లు చెప్పాడు. ఆమెకు కలిగిన సంతానానికి రాజ్యార్హత కల్పిస్తేనే సత్యవతి తనకు సొంతమవుతుందని చెప్పాడు. తండ్రి అంతరంగం అర్థం చేసుకున్న దేవవ్రతుడు- ఆయన కోరిక తీర్చడంకోసం తాను వివాహం చేసుకోకుండా ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతానని ప్రతిజ్ఞ చేశాడు. అలా భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆ క్షణంనుంచీ అతడి పేరు 'భీష్ముడు'గా మారింది. కొడుకు త్యాగాన్ని మెచ్చుకున్న తండ్రి అతడికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ప్రసాదించాడు.
సత్యవతికి శంతనుడి ద్వారా చిత్రాంగుడు, విచిత్ర వీర్యుడు అని ఇద్దరు బిడ్డలు కలిగారు. చిత్రాంగుడు గంధర్వులతో యుద్ధం చేస్తూ మరణించాడు. విచిత్ర వీర్యుణ్ని రాజుగా చేసి అంబిక, అంబాలిక అనే ఇద్దరు బాలికలనిచ్చి వివాహం చేశాడు భీష్ముడు. సంతానం కలగకుండానే అతడు మరణించాడు. తమ వంశం నిర్వంశం కాకూడదనే సంకల్పంతో పినతల్లి సత్యవతి, భీష్ముణ్ని పిలిచి, అతడి తమ్ముడి భార్య(అంబిక, అంబాలిక)లను సంతానవతులుగా చేసి వంశాన్ని నిలబెట్టమని కోరింది. అలా చేస్తే తన ప్రతిజ్ఞకు భంగం కలిగి తన సంతానమే రాజ్యమేలుతుందనిపించి నిరాకరించాడు భీష్ముడు. అయినప్పటికీ ఆ వంశం నిలబడటానికి వేదవిదుడైన వ్యాసుడి ద్వారా వారిని సంతానవతులు చేయించాడు. ఆ సంతానమే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు.

కురు పాండవుల మధ్య రాజ్యార్హత విషయంలో శత్రుత్వం ఏర్పడింది. అలా పెరిగిన వైరం కురుక్షేత్ర యుద్ధం వరకు దారి తీసింది. ఎవరికీ ఇష్టం లేకపోయినా బంధువులు, మిత్రులు, పరివారం అంతా ఇరు వర్గాలుగా విడిపోక తప్పలేదు. భీష్ముడు కౌరవపక్షం వహించాడు. నిష్పక్షపాతంగా, చిత్తశుద్ధితో, ధర్మబద్ధంగానే యుద్ధం చేశాడు. కాని ఆయన పాండవ పక్షపాతం చూపుతున్నాడని అపనమ్మకం ఏర్పడింది కౌరవులకు. అందుకే సైన్యాధ్యక్ష పదవి నుంచి తప్పుకొమ్మన్నాడు దుర్యోధనుడు. అయినా కౌరవుల క్షేమం కోరి తప్పుకోలేదతడు. పాండవసేనలో పరిస్థితి ఇంకోలా ఉంది. భీష్ముడు కౌరవ పక్షంలో ఉన్నంతసేపూ వారిని జయించడం తమవల్ల కాదనే నిశ్చయానికి వచ్చారు. అందుకే రహస్యంగా కలిసి జయించే మార్గం చెప్పమని ఆయననే ప్రార్థించారు. తాను కావాలి అనుకుంటున్నవాళ్లు, తనకు కావాలనుకున్నవాళ్లు ఇద్దరూ తనను వద్దనుకుంటున్నారు. కాబట్టి నిష్క్రమించాలని నిశ్చయించుకుని మార్గం సూచించాడు. ఆ మేరకు శిఖండిని యుద్ధరంగాన ఆయనకు ఎదురుగా నిలిపారు పాండవులు. యుద్ధభూమిలో శిఖండిని చూస్తూనే అస్త్ర సన్యాసం చేశాడు భీష్ముడు. అదే అదనుగా అర్జునుడు వేసిన బాణపు దెబ్బకు కూలిపోయాడు. అంతటి మహానుభావుడు నేలమీద పడరాదని తలచి అప్పటికప్పుడు బాణాలతో అంపశయ్య ఏర్పరచాడు అర్జునుడు. దానిపై మేను వాల్చిన అతడికి అది దక్షిణాయణమని గుర్తొచ్చింది. కొద్దిరోజుల్లో ఉత్తరాయణం రాబోతోందని, అప్పుడు తనువు చాలిస్తే కైవల్యం సంభవిస్తుందని తలపోశాడు. తండ్రి ఇచ్చిన వరాన్ని గుర్తు తెచ్చుకుని మరణాన్ని నియంత్రించుకున్నాడు. ఉత్తరాయణంలో మాఘ శుక్ల ఏకాదశి నాడు తన తనుత్యాగానికి ముహూర్తం నిర్ణయించుకున్నాడు. మాఘ శుక్ల సప్తమి మొదలుకుని రోజుకొక ప్రాణం చొప్పున విడుస్తూ ఏకాదశి నాటికి విష్ణువులో లీనమైపోయాడని, అందువల్ల ఆ అయిదు రోజులను భీష్మ పంచకం అంటారని మహాభారత కథనం. పై కథనం ఆధారంగా భీష్ముడి నిర్యాణ దినాన్ని భీష్మ ఏకాదశిగా జరుపుతారు.

ధర్మనిరతుడు, కర్మయోగి, ఆదర్శ పురుషుడైనందువల్లే భీష్ముడి నిర్యాణ దినం లోకానికి స్మరణదినమైంది.

- అయ్యగారి శ్రీనివాసరావు