ᐅనమ్మకం
నమ్మకం పెరగాలంటే బలమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఈ వ్యక్తిత్వమే మనిషిని అమరుణ్ని చేస్తుంది. బలి, శిబి, హరిశ్చంద్రుడు, ప్రవరుడు వంటివారు పురాణపురుషులయ్యారు. ఆధునికకాలంలో కూడా 'అతను చస్తే లంచంతీసుకోడు... ఇతడు వ్యసనాలకు దూరంగా ఉంటాడు... అతడు గొప్ప నిజాయతీపరుడు' లాంటి వ్యాఖ్యానాలు తరచూ వినిపిస్తుంటాయి. కుటుంబంలో, సమాజంలో ఇలాంటి నమ్మకం కలిగించాలంటే- ఎంతో సహనం, నిగ్రహం అవసరం. జీవితాంతం ఇదే సుగుణాన్ని నిలుపుకొనే దృఢదీక్ష కావాలి. ఈ ప్రస్థానంలో ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా అదరక బెదరక నిలవాలి. ఒక్కోసారి కొన్ని ప్రలోభాలు మనిషిని భ్రమింపజేస్తాయి. కొందరు ఆ వ్యక్తిని దిగజార్చే ప్రయత్నం చేయనూవచ్చు. స్వార్థపరులు పెద్దమొత్తంలో ధనాన్ని ఎరగా చూపవచ్చు. నిజాయతీపరుడు అలాంటి పరీక్షా సమయంలోనే చలించకూడదు. ఏమాత్రం లొంగినా అతని వ్యక్తిత్వం మసకబారుతుంది. సమాజానికి అతడిపై నమ్మకం సడలుతుంది. చివరికి చెడ్డపేరు మిగులుతుంది.
- కిల్లాన మోహన్బాబు