ᐅఆత్మస్త్థెర్యం
ᐅఆత్మస్త్థెర్యం
ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య భావన కలగకుండటమే ఆత్మస్త్థెర్యం. కష్టాలు, సుఖాలు గాలితెమ్మెరలాంటివి. ఒకప్పుడు చల్లనిగాలి, మరొకప్పుడు వేడిగాలి వీస్తున్నట్లే- కష్టసుఖాలు కూడా మన జీవనయానంలో అతిథుల్లా వచ్చిపోతుంటాయి. సుఖం వచ్చినప్పుడు కలిగిన ఆనందం కష్టం వచ్చినప్పుడు ఉండదు. కష్టంలోని భయం సుఖంలో కలగదు. నిజానికి భయం, అభయం రెండూ భగవంతుడు ఏర్పరచేవి. ఎవరైతే కష్టాల్లో ఆత్మస్త్థెర్యం కోల్పోరో వారే ఆత్మనిగ్రహం కలిగినవారు.
శ్రీరాముడికి వచ్చిన కష్టాలు మానవులకు ఎవరికీ కలగవనేది యథార్థం. రాజు కావాల్సిన రాముడు అరణ్యవాసానికి సిద్ధపడి ఏరికోరి కష్టాలను తెచ్చుకొన్నాడనుకుంటారు కొందరు. నిజానికి శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను పరిపాలించాడు. తల్లికి తన తండ్రి ఇచ్చిన మాటను నిజం చేశాడు. అవి కష్టాలుగా ఆయన భావించనేలేదు. పూలమ్మినచోట కట్టెలమ్మే పరిస్థితి విధి వైపరీత్యంతో సంభవించినా- ఆత్మస్త్థెర్యం కోల్పోకూడదు. సమస్య లేని స్థలమే లేదు. కష్టం రాని గృహమే లేదు. కానీ లోకంలో తామే కష్టాలనుభవిస్తున్నట్లు కలత చెంది బలవన్మరణానికి పాల్పడటం ఏరకంగానూ సమర్థనీయం కాదు. సుఖదుఃఖాలు రెంటినీ స్వీకరించకుండా ఉంటే ఆత్మస్త్థెర్యం నీ వెన్నంటే ఉంటుంది.
కారడవిలో తన భార్య సీతను అపహరించాడని గ్రహించిన శ్రీరాముడు కుంగిపోలేదు. అన్వేషణ మొదలు పెట్టాడు. ఆ అన్వేషణలో జటాయువు తోడైంది. శబరి కలిసింది. సుగ్రీవుడి పరిచయం కలిగింది. వానరుల సఖ్యత దొరికింది. ఇది శ్రీరాముని ఆత్మస్త్థెర్యం. ఇక దుస్సాహసమైన సముద్ర లంఘనంలో హనుమంతుడు సముద్రాన్ని దాటింది కూడా ఆత్మస్త్థెర్యంతోనే. వాలితో చావుదెబ్బలు తిన్నా వాలి వధ జరిగి, తనకు న్యాయమే జరుగుతుందని శ్రీరాముడిపై విశ్వాసంతో ఉన్న సుగ్రీవుడిదీ ఆత్మస్త్థెర్యమే.
కొందరు అధికారులు స్వార్థంతో చేసిన మోసానికి బలైనవారు సుగ్రీవుడిలా ఆత్మస్త్థెర్యాన్ని బూనాలి. మొదటిసారి కాకపోయినా, రెండోసారైనా విజయం సాధిస్తారు. ప్రతిసారీ అన్యాయంపై న్యాయం గెలుస్తూనే ఉంటుంది. కొందరు అన్యాయానికి సుగ్రీవుడిలా బలవుతూనే ఉన్నారు. అయినా చివరికి సుగ్రీవ విజయమే! అంతవరకూ మనకు కావాల్సింది ఆత్మస్త్థెర్యం. మనోనిగ్రహంతో కూడిన ఒక నమ్మకం, పట్టుదల కావాలి. దైవంపట్ల విశ్వాసం ఏర్పడాలి. 'అసహనంతో ఒరిగే ప్రయోజనమేమీ లేదు, ఓర్పు వహించండి- విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది'- అంటారు స్వామి వివేకానంద.
నవమాసాలు నిండిన తల్లి ప్రసవవేదన ఆత్మస్త్థెర్యంతో కూడినదే. తాను తల్లినవుతున్నాననే దృఢనమ్మకమే అన్ని నొప్పులను సహించేలా చేస్తుంది. బంగారంపై ఎన్ని దెబ్బలు వేసినా అది హారమవుతుందే తప్ప బూడిద కాదు.
మోసంతో జయించామని కొందరు భుజాలు ఎగరేసినా కడకు రావణాసురుడిలా అంతమొందక తప్పదు. అంతవరకూ మోసపోయినవారు కోల్పోకూడనిది ఆత్మస్త్థెర్యం.
- డాక్టర్ మరింగంటి మధుబాబు