ᐅసమర్థుడి ఆశ్రయం




సమర్థుడి ఆశ్రయం 

జీవితకాలంలో ప్రతి మనిషీ ఎప్పుడో ఒకప్పుడు ఎవరోఒకర్ని ఆశ్రయించక తప్పదు. మనకు ఎన్నో అవసరాలుంటాయి. వాటికోసం మరొకరిని ఆశ్రయిస్తాం. ఏ ఆశ్రయం లేకుండా మనిషి జీవించలేడు. దేనికోసమైనా ఎవరో ఒకరిని ఆశ్రయించాల్సి వచ్చినపుడు సద్గుణుడు సమర్థుడైన వాడినే ఆశ్రయించాలని పిప్పలాదుడు రచించిన గుణార్ణవం సూచిస్తోంది. మనం ఆశ్రయం పొందాల్సిన వ్యక్తి యశోవంతుడై ఉండాలి. కార్యం సఫలం కావడానికి కొంత ఆలస్యం జరిగినా యశోవంతుడు ఆశ్రితుల కార్యాన్ని సాఫల్యం చేస్తాడు. సుగ్రీవుడు శ్రీరాముని ఆశ్రయించాడు. వాలిని సంహరించడంలో కొంత ఆలస్యమైనా కిష్కింధకు సుగ్రీవుడు రాజయ్యాడు. కైకేయి మంధరను ఆశ్రయించింది. అది హీన ఆశ్రయం. అలాంటి ఆశ్రితులవల్ల అనర్థాలు సంభవిస్తాయి. దశరథుడు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. లంకాధీశుడు రావణుడు పరస్త్రీ కోసం శూర్పణఖను, కాలనేమిని ఆశ్రయించాడు. ఫలితంగా సర్వనాశనమే జరిగింది.
మనిషికి వివేకం, విచక్షణ అవసరం. హీనమైన కోరికలతో ఆశ్రయిస్తే సమర్థుడైనా సరే ఆశ్రిత రక్షణ చేయలేడు. పర్ణశాలలో ఉన్నప్పుడు సీత బంగారు జింకకోసం శ్రీరాముణ్ని ఆశ్రయించింది. ఫలితంగా శ్రీరాముడితో వియోగం ఏర్పడింది. విభీషణుడి కథ మనకు తెలిసిందే. సొంత అన్నను కాదని శ్రీరాముడి ఆశ్రయం పొందాడు. యశోవంతుడు, సమర్థుడు కానప్పుడు తన రక్త సంబంధీకులను సైతం త్యజించాలని రామాయణంలోని ఘట్టాలు తెలుపుతున్నాయి. మహాపురుషుల ఆశ్రయాన్ని స్వీకరించినవారికీ గొప్పతనం అబ్బుతుంది. ఎటువంటి ఆధారం లేని శబరి శ్రీరాముడి ఆశ్రయాన్ని స్వీకరించి మహాత్మురాలిగా మారింది. మహాపురుషులూ ఒక్కొక్కసారి తమకన్నా చిన్నవారి ఆశ్రయం పొందాల్సి వస్తుంది. గోదావరి నదిని దాటాల్సిన సందర్భంలో గుహుడి సహాయాన్ని శ్రీరాముడు అర్థించాడు. మహాభారతంలో భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణుడు లాంటి వీరులూ అసమర్థులైన కౌరవుల ఆశ్రయంలో ఉంటూ ప్రాణాలు కోల్పోయారు. బలహీనుడైన విరాటరాజు యశోవంతుడైన ధర్మరాజు (కంకుభట్టు)కిచ్చిన ఆశ్రయంవల్ల గోగ్రహణంలో కౌరవులను ఓడించగలిగాడు. రాధేయుడు హీనాశ్రయం వల్ల హీనస్థితిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సమకాలీన సమాజంలోనూ గొప్పవారిని, హృదయవైశాల్యం కలవారినీ, నీతిమంతులనే ఆశ్రయించక తప్పదు. సంపదలు విరివిగా లభించినా హీనుల ఆశ్రయం తగదని ధర్మశాస్త్రాలు తెలుపుతున్నాయి. మన అవసరాలు తీరడంలో ఆలస్యం జరిగినా సమర్థులే మనకు మేలుచేస్తారు. సంపదలు కలిగి హీనుడైన మిత్రుడికన్నా సిరులు లేని యశోవంతుడు వివేకవంతుడైన శత్రువు మేలని చాణక్యుడు చెప్పిన నీతివాక్యం అన్నివేళలా ఆచరణీయం!


- అప్పరుసు రమాకాంతరావు