ᐅలోకాభి రాముడు
మన సంస్కృతితో మమేకమైనది మనోజ్ఞ రామనామం. శ్రీరాముడు ధర్మస్వరూపుడు, సత్యవ్రతుడు, వినయశీలి, మధురభాషి. బుద్ధిలో బృహస్పతిని మించినవాడు. పరాక్రమంతో పరశురాముణ్ని పడగొట్టినవాడు. అన్నింటికీ మించి ప్రజాక్షేమమే ప్రథమ కర్తవ్యంగా పాలించిన ప్రభువు. కుటుంబం, సోదరులు, భార్య... ఎవరైనా- ప్రజల తరవాతనే అని భావించి, ఆచరించి చూపిన ఆదర్శమూర్తి. ప్రజామన్ననలు రామునిలా చూరగొన్న మరొక రాజు పురాణ పుటల్లో కనిపించడు. రఘుమౌళి కఠోర బ్రహ్మచర్యనిష్ఠాపరుడు. తమ రాజు అడవుల్లో అష్టకష్టాలు పడుతుంటే తాము అయోధ్యలో సుఖసంతోషాలతో ఎలా ఉండగలమని స్వచ్ఛందంగా పౌరులే పద్నాలుగేళ్లు బ్రహ్మచర్యం పాటించడం- ఆయనపట్ల అపార ప్రజాభిమానానికి ప్రత్యక్ష నిదర్శనం!
ఏ వైరమూ లేకుండా చెట్టుచాటునుంచి తననెందుకు వధించావని వాలి ఆఖరి ఘడియల్లో ప్రశ్నిస్తే- రఘురాముడు చెప్పిన ధర్మరహస్యం రసరంజితం. పరమాత్మకు తప్ప పరమధార్మికులకు సైతం ఇది సాంతం అర్థం కాదు. పరిశుద్ధ హృదయ దర్పణంతో పరిశీలిస్తేనే ధర్మసూక్ష్మం అందులో ప్రతిబింబిస్తుంది. వాలి మెడలో ధరించిన కాంచనమాల గతంలో సాక్షాత్తు విష్ణువే దేవాంతర రూపంలో ప్రసాదించనది. ఆ మాల ధరించి యుద్ధం చేస్తే ఎదుటివాడు ఎంతటి బలవంతుడైనా ఎదిరి నిలువలేడు. ఆ వరబలం వాలికున్నంతవరకు కోదండరాముడు తలపడినా దాని ప్రభావంనుంచి తప్పించుకోలేడు. పైగా కూతురితో సమానమైన సుగ్రీవపత్నిని చెరపట్టి అధర్మానికి పాల్పడ్డ వాలి దండనార్హుడు. వానరజాతిలో అలాంటి సంప్రదాయం ఉన్నప్పటికీ భర్త మరణించిన తరవాత మాత్రమే అది సాధ్యపడుతుంది. ధర్మసంరక్షణార్థం భరతుడి ప్రతినిధిగా అధర్మపరుణ్ని అణచడం అన్యాయం కాదు. రాక్షస సంహారం కోసం తాను మానవజన్మ ఎత్తాననీ ఇందుకోసం ఇంద్రుని అంశతో వాలి ముందుగానే జన్మించినట్లు చెబుతాడు. రానున్న రామరావణ సంగ్రామంలో వానర సహాయం అనివార్యమని అంటాడు. తద్భిన్నంగా వాలి రావణునితో మైత్రి పెంచుకోవడమూ అధర్మం కిందికే వస్తుందని ఆయన విశ్లేషణాత్మకంగా వివరిస్తాడు. పితృద్రోహం, దేవద్రోహం దోషాలు అంటకుండా వధించానని వాలికి కనువిప్పు కలిగిస్తాడు.
వాల్మీకి రామాయణాన్నే అందరూ ప్రామాణికంగా స్వీకరిస్తారు. చిత్రంగా- ప్రస్తుతం ప్రజాబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న కొన్ని సంఘటనలు, సన్నివేశాలు ఈ కావ్యంలో కనిపించవు. ఉదాహరణకు- అహల్య రాయిగా మారడం, లక్ష్మణుడు రేఖలు గీయడం, శృంగిబేరపురం బోయరాజైన గుహుడు స్వయంగా నది దాటించడం, రావణబ్రహ్మ కడుపులో అమృత భాండం ఉండటం వంటివి మనకు గోచరించవు. వాల్మీకి తరవాత తులసి, భాస్కర, మొల్ల, ఇటీవల విశ్వనాథ వంటివారు రామాయణాన్ని తమదైన శైలిలో రచించి తరించారు. మూలకథకు భంగం వాటిల్లకుండా నాటకీయతకోసం మార్చిన ఘటనలు ఈ కావ్యానికి వన్నె తెచ్చాయేకాని చిన్నబుచ్చలేదు! ఇంతటి ఘనచరిత్ర కలిగిన సూర్యతేజస్వి, చంద్ర కౌముదీ వర్చస్వి, శుభయశస్వి అయిన లోకాభిరాముడికి వాడవాడలా, పల్లెపల్లెనా మందిరాలు నిర్మించి నిత్యం పూజించడం మానవాళికి దక్కిన పుణ్యఫలం!
- కిల్లాన మోహన్బాబు