ᐅకూర్మ జయంతి





కూర్మ జయంతి 

మహావిష్ణువు దశావతారాల్లో నేరుగా రాక్షస సంహారం లక్ష్యంగా గోచరించకపోయినా, విశిష్ట ప్రయోజనాన్ని ఉద్దేశించినది కూర్మావతారం. పురాణాల ప్రకారం- అసురుల వేధింపులకు తాళలేక ఇంద్రాదిదేవతలు బ్రహ్మతో కలిసి పురుషోత్తముని ప్రార్థించారు. కరుణాంతరంగుడైన శ్రీహరి అమృతోత్పాదన యత్నాన్ని సూచించాడు. పాలసముద్రంలో సర్వతృణాలు, లతలు, ఔషధాలు వేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి, వాసుకి మహాసర్పాన్ని తరితాడుగా చేసి మధిస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయని, అమృతం లభిస్తుందని పలికాడు. ఆ మేరకు ఇంద్రుడు దానవులను కూడా సాగరమధనానికి అంగీకరింపజేశాడు.
దేవ దానవులు మందరాన్ని కవ్వంగా తెచ్చి వాసుకిని తాడుగా చేసుకున్నారు. వాసుకి సర్పం. పాముకు విషం తల భాగంలో ఉంటుంది. అది మృత్యు స్వరూపం. రాక్షసులు తామసులు. తమస్సు పాపభూయిష్ఠం. దాన్ని అణిచివేస్తే తప్ప లోకంలోనైనా, మనసులోనైనా ప్రకాశం కలగదు. అందుచేత శ్రీహరి రాక్షసుల్ని మృత్యుస్వరూపమైన వాసుకి ముఖం వద్ద నిలిపాడు.

మధనంలో బరువుగా ఉండి కింద ఆధారం లేకపోవడంవల్ల సముద్రంలో మునిగిపోయింది పర్వతం. అప్పటి శ్రీహరి లీల కూర్మావతారం. బ్రహ్మాండాన్ని తలపించే పరిమాణంలో సుందర కూర్మరూపంలో మహావిష్ణువు అవతరించాడు. పాలసముద్రంలో మునిగిపోయిన మందర పర్వతాన్ని పైకెత్తి, అత్యంత కఠోరమైన తన కర్పరంపై నిలిపాడు.

క్షీరసాగర మధనంలో చిట్టచివరగా లభించిన అమృత కలశాన్ని విష్ణువు మోహిని రూపం దాల్చి రాక్షసుల్ని సమ్మోహితుల్ని చేసి దేవతలకు అమృతం ప్రసాదించాడు. శ్రీహరి జంబూద్వీపంలో కూర్మరూపుడై విశ్వరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడని బ్రహ్మపురాణం పేర్కొంటోంది.

ఆది కూర్మానికి వెన్నులో మేష వృషభరాసులు, తలలో మిథున కర్కాటకాలు, ఆగ్నేయంలో సింహరాశి, దక్షిణ ఉదర భాగంలో కన్యాతులలు, నైరుతిలో వృశ్చికం, తోకపై ధనుస్సు వాయవ్యాన మకరం, ఎడమవైపు కుంభం, ఈశాన్యంలో మీనరాశి ఆక్రమించుకొని ఉంటాయంటారు. దాన్నే కాలానికి ప్రతీకగా చెబుతారు.

కూర్మం జలంలో వసించే జంతువు. తనకు గమన సంకల్పం కలిగినప్పుడు కరచరణాలు కదిలిస్తుంది. సంకల్ప రహితంగా ఉన్నప్పుడు నీట్లో స్తంభించి ఉంటుంది. అవసరం లేనప్పుడు ఇంద్రియాలను విషయ సుఖాల నుంచి మరల్చగలగడమనే స్థితప్రజ్ఞకు, బహిర్ముఖ ప్రవృత్తి నిలుపుచేసుకొని అంతర్ముఖ ప్రవృత్తిలోనికి వెళ్లగలిగే చిత్తవృత్తికి కూర్మం ప్రతీక. అనంతమైన పొడవు వెడల్పులుగల దేహం- అనాదిగా అనంతంగా ఉండే వస్తువుకే ఉంటుంది తప్ప, జనన నాశనాలు కలిగినవాటికి సంభవించదు. అటువంటి అనంతమైన దేహంతో ఒప్పువాడు విశ్వరూపుడైన నారాయణుడేనని చెబుతారు. కూర్మం అనంతమైన దేహంతో జగమంతా నిండి క్రీడిస్తున్నట్లు సర్వాధిష్ఠాన చైతన్యాత్మ స్వరూపనారాయణుడు జీవకోటి అంతటా నిండి ఉండి క్రీడిస్తున్నాడని భక్తులు విశ్వసిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మ క్షేత్రంలో కూర్మనాథుడు వెలశాడు. కళింగగాంగులు నిర్మించిన శ్రీకూర్మక్షేత్రం చారిత్రక శాసన ప్రాధాన్యం కలిగింది. అస్సాంలో గౌహతిలోనూ పెద్ద కూర్మనాథ ఆలయం ఉంది.


- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు