ᐅజ్ఞానానందం... గణేశ స్వరూపం
శివుడు జ్ఞానమూర్తి, శక్తి ఆనందస్వరూపిణి. జ్ఞానానందాలు విడిగా ఉండవు. ఈ శివశక్తుల ఏకతత్వమే గణపతి- అంటే, జ్ఞానానంద సమాహార స్వరూపం. ఈ తత్వాన్నే వివిధ ఉపాసనాపద్ధతులుగా, కథలుగా, రూపాలుగా వివరించాయి పురాణాది శాస్త్రాలు. ధర్మగతికి, దేవకార్యాలకు ఆటంకాలు ఎదురై, జగత్స్థితికి అవరోధాలు కలిగినప్పుడు ఆ విఘ్నాలను పరిహరించడానికై పలురూపాలతో వినాయకుడు ఆవిర్భవించినట్లుగా ఎన్నో కథలున్నాయి. అందుకే ఆ స్వామికి ఎన్నో అవతారాలు. ఒకప్పుడు జగదంబ భండాసురునితో యుద్ధం చేస్తుండగా ఆ రాక్షసుని సోదరుడు విశుక్రుడు ఒక విఘ్నయంత్రాన్ని తయారుచేసి ప్రయోగించాడని బ్రహ్మాండ పురాణగాథ. ఆ యంత్రం పేరు 'జయవిఘ్నశిల'. దానిలో ఎనిమిది విఘ్నశక్తులున్నాయని ఆ కథ చెబుతోంది. అవి: అలస (సోమరితనం), దీన, కృపణ (బేలతనం), నిద్ర, తంద్ర (కునుకుపాటు), క్లీబ, ప్రమీలిక, నిరహంకార. ఈ నామాల ఆంతర్యాన్ని పరిశీలిస్తే- ఈ శక్తులు ప్రగతికి అడ్డుతగిలే గుణాలేనని స్పష్టమవుతుంది. దీన్నిబట్టి పురాణకథల సంకేతవాదం మనకు చెప్పే పాఠాలు అవగతమవుతాయి. ఏ కార్యరంగంలోనైనా పై ఎనిమిదీ అడ్డంకులు. సోమరితనం, దిగులు, బేలతనం, నిద్ర, కునుకు, కర్తవ్యందాకా వచ్చేటప్పటికి వెనుదీయడం (క్లీబ), సంకోచించడం (ప్రమీలిక), 'నావల్ల ఏమీకాదు' అంటూ తనపై తనకు నమ్మకం లేనితనం. వ్యక్తిత్వ వికాసానికి ఇవి శత్రువులు. వీటిని ప్రయోగించగానే శక్తిసేనలు జడమయ్యాయి, నిర్వీర్యమయ్యాయి.
మనలోనున్న అఖండ ఆత్మచైతన్యం వల్ల పనిచేసే అంతర్గత శక్తులే శక్తిసేనలు. అవి పై ఎనిమిది దుర్గుణాలవల్ల స్తంభించిపోవడమే ఈ గాథలో ఆంతర్యం. ఆ సమయంలో అమ్మవారు (లలితాదేవి) పరమేశ్వరుని చూసి, ఆ దర్శనంవల్ల కలిగిన స్పందనతో మందహాసం చేసిందట. ఆ మందహాస తేజంనుంచి గణపతి ఆవిర్భవించాడని ఆ పురాణ కథ. శివశక్తి స్పందనవల్ల కలిగిన ఆనందచైతన్యమే విఘ్నేశ్వరుడు. అదే 'నవ్వు' నుంచి ఉద్భవించడంలోని ఉద్దేశం. అలా వెలువడిన మహాగణపతి అవలీలగా విఘ్నయంత్రాన్ని పిండిచేశాడు. ఎనిమిది విఘ్నశక్తుల్నీ సంహరించాడు. ఈ ప్రాచీన గాథలోని గొప్ప భావాల్ని పరికిస్తే గణపతిభావం అవగతమవుతుంది.
జ్ఞానానందశక్తినుంచి ఉత్సాహం, కార్యశీలత వంటి దివ్యశక్తులు కలుగుతాయి. ఇవి ఎలాంటి విపరీతాలనైనా తొలగించి, సిద్ధిని ప్రసాదిస్తాయి. గణపతి ఆనందరూపుడు. సంతోషాన్ని ప్రసాదించడమే ఆయన అనుగ్రహం.
హాస్యరసానికి గణపతిని అధీశునిగా చెప్పడంలోనూ ఇదే ఆంతర్యం. అలాగే 'మోదకం' ఆయనకు నైవేద్యం... అనడంలోనూ ఇదే భావం. ఒక కార్యం ప్రారంభించేటప్పుడు 'భయం, సంశయం, సంకోచం, ఉద్వేగం' వంటి వికారాలు లేకుండా; ఉత్సాహంగా, 'తప్పక సిద్ధిలభిస్తుంది' అనే సకారాత్మక భావనతో కూడిన ఆనందాన్ని 'ఆమోదం'- అనవచ్చు. సిద్ధి కలిగాక లభించే ఆనందాన్ని 'ప్రమోదం' అని భావించవచ్చు. ఈ రెండు ఆనంద భావాలే గణపతి శక్తులు. 'పూర్ణ'త్వానికి సంకేతంగా మోదకాలు, ఉండ్రాళ్లు, లడ్డు... వంటివి గణపతికి నైవేద్యాలుగా- ఆయన వల్ల మనకు ప్రసాదాలుగా లభిస్తాయి. పరిపూర్ణానందతత్వమే గణపతి స్వరూపం... ఆ అనుభవమే మనకు ప్రసాదం. పంచభూతాల్లో భూమియందున్న ఈశ్వరశక్తిని గణపతిగా ఆరాధించడం మరో శాస్త్ర కథనం. ఈ పృథ్వీతత్వంలోని చిచ్ఛక్తినే 'మూలాధారశక్తి'గా యోగశాస్త్రం చెబుతోంది. ఈ మూలమైన చక్రానికి అధిష్ఠానం గణపతి. యోగపరంగా ఆదిదైవమితడే... ఈ భూతత్వప్రతీకగానే మట్టితో స్వామిప్రతిమను చేయడమనే సంప్రదాయం వచ్చింది. ఈ భూమిపై, భూమివల్ల- పార్థివశరీరంతో బతికే మనం, ఈ తత్వంలోనే ఈశ్వరతత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. ఆ ప్రక్రియే గణపతి ఉపాసన. బ్రహ్మజ్ఞానాన్ని గ్రహించకుండా అడ్డుకొనే 'వక్ర'మైన మాయాశక్తి 'విఘ్నం'. దాన్ని తొలగించి, తన పరతత్వాన్ని ప్రత్యక్షంచేసే విఘ్ననాశకుడు, మాయకు నాయకుడు విఘ్నేశ్వరుడు.
- సామవేదం షణ్ముఖశర్మ